సంగారెడ్డి, మే 26 : రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు ప్రెండ్లీ పోలీసు యంత్రాంగాన్ని ఏర్పాటు చేసిందని, పారిశ్రామిక ప్రాంతంలో పోలీసుల సేవలకు ఐలా (ఇండస్ట్రీయల్ లోకల్ ఏరియా అథారిటీ) సభ్యులు ప్రత్యేక వాహనం అందచేయడం సంతోషకరమని ఎస్పీ చంద్రశేఖర్రెడ్డి అన్నారు. బుధవారం ఐలా సభ్యులు జిల్లా పోలీస్ కార్యాలయంలో మహీంద్రా స్కార్పియో వాహనాన్ని ఎస్పీకి అందజేశారు. వాహనాన్ని పాశమైలారంలో పెట్రోలింగ్ నిర్వహించడానికి ఉపయోగించాలని ఎస్పీని వారు కోరారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడారు. పోలీసుల సేవలను విస్తృతం చేసి ప్రజలకు శాంతిభద్రతలు కల్పిస్తున్నామన్నారు. పారిశ్రామిక ప్రాంతంలో శాంతిభద్రత పరిరక్షణకు 24గంటల నిరంతర పెట్రోలింగ్ నిర్వహించడానికి ఉపయోగిస్తామని తెలిపారు. కార్యక్రమంలో అదనపు ఎస్పీ సృజన, ఐలా చైర్మన్ దుర్గాప్రసాద్, టీఎస్ఐఐసీ జోనల్ మేనేజర్ అనురాధ, ఎస్బీ డీఎస్పీ శ్రీనివాస్ నాయుడు, ఆర్ఐ హరిలాల్, ఐలా వైస్ చైర్మన్ రాఘవరెడ్డి, కార్యదర్శి సత్యనారాయణ, కోశాధికారి జీవీకే రాజు, సంగారెడ్డి సెక్యూరిటీ కౌన్సెల్ కార్యదర్శి చందు కుమార్, ఐలా ఎగ్జిక్యూటీవ్ కమిటీ సభ్యులు రాకేశ్, నాగేశ్వర్ రావు, రమణారెడ్డి, కృష్ణ పాల్గొన్నారు.