పటాన్చెరు, జూలై 9: గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం, హైదరాబాద్లోని స్కూల్ ఆఫ్ టెక్నాలజీ, గీతం హైదరాబాద్ బిజినెస్ స్కూల్, స్కూల్ ఆఫ్ ఫార్మసీ, స్కూల్ ఆఫ్ సైన్స్లు శుక్రవారం సంయుక్తంగా విజేతల దినోత్సవాన్ని (అచీవర్స్ డే) ఘనంగా నిర్వహించాయి. అచీవర్స్ డే ముఖ్య అతిథిగా టెక్చువా సీఈవో శ్రావణ్రెడ్డి పాల్గొని విద్యార్థులకు నియామక ఉత్తర్వులు అందజేస్తూ, విజేతలను అభినందించారు. ఈ విజయం విద్యార్థుల ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించడంతో పాటు వృత్తిపర నిర్ణయాలు తీసుకోవడంలో తోడ్పడుతుందన్నారు. సభాధ్యక్షత వహించిన గీతం వైస్ ఛాన్స్లర్ ప్రొఫెసర్ శివప్రసాద్ మాట్లాడుతూ, కొవిడ్ 19 మహమ్మారి కారణంగా అనేక సవాళ్లు ఉన్నప్పటికీ, తమ విద్యార్థులు చేసిన కృషి, గీతం అందించిన నాణ్యమైన విద్య కెరీర్ గైడెన్స్ విభాగంతో పాటు అధ్యాపకుల అలుపెరుగని శ్రమ, సమష్టి కృషి ఈ ప్రాంగణ నియామక ఫలితాల్లో ప్రతిబింబిస్తున్నాయన్నారు.
అనంతరం ప్రాంగణ నియామకాల్లో ఎంపికైన ఇంజినీరింగ్, మేనేజ్మెంట్, ఫార్మసీ, సైన్స్ విద్యార్థులకు నియామక పత్రాలను అందజేశాయి. 2020-21 విద్యా సంవత్సరంలో దాదాపు 165 దేశీయ, బహుళ జాతి కంపెనీలు హైదరాబాద్ గీతంలో ప్రాంగణ నియామకాలను నిర్వహించి, 903 మంది బీటెక్, ఎంటెక్, బీబీఏ, ఎంబీఏ, బీ ఫార్మసీ, బీఎస్సీ, ఎంఎస్సీ విద్యార్థులను ఎంపిక చేసినట్లు గీతం వర్గాలు ప్రకటించాయి. 197 మంది విద్యార్థులు ఒకటి కంటే ఎక్కువ ఉద్యోగాలకు ఎంపికైనట్లు తెలిపారు. కాగా, మేనేజ్మెంట్ విద్యార్థుల ప్రాంగణ నియామకాలపై జీహెచ్బీఎస్ డీన్ అండ్ డైరెక్టర్ ప్రొ. బీ.కరుణాకర్, ఫార్మసీ నియామకాలపై ప్రిన్సిపాల్ ప్రొ.జీఎస్ కుమార్, సైన్స్ నియామకాలపై ప్రిన్సిపాల్ ప్రొ.జీఏ రామారావు విడివిడిగా నివేదికలు సమర్పించారు. కార్యక్రమంలో గీతం అధ్యక్షుడు ఎం.భరత్, రెసిడెంట్ డైరెక్టర్ డీవీవీఎస్ఆర్ వర్మ, స్కూల్ ఆఫ్టెక్నాలజీ ప్రిన్సిపాల్ ప్రొ. ఎస్.సీతారామయ్య, వివిధ విభాగాధిపతులు, వివిధ కంపెనీలకు ఎంపికైన విద్యార్థులు, వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు.