సంగారెడ్డి: జిల్లాలోని అమీన్పూర్లో సాఫ్ట్వేర్ ఇంజనీర్ శ్రీకాంత్ ఫ్యామిలీ సూసైడ్ చేసుకున్న విషయం తెలిసిందే. అయితే.. వీళ్ల ఆత్మహత్యలపై పోలీసులకు కొన్ని కీలక విషయాలు తెలిశాయి. అమీన్ పూర్లోని వందనపురి కాలనీలో ఉండే శ్రీకాంత్.. తన భార్య, కూతురును చంపి తను ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన ఇటీవల సంచలనం సృష్టించింది.
శ్రీకాంత్ ఫ్యామిలీ ఆత్మహత్యకు గల కారణాలను అన్వేషిస్తున్న పోలీసులకు శ్రీకాంత్ ఫోన్ డేటా కొన్ని క్లూస్ను అందించింది. శ్రీకాంత్కు తను అప్పు తీసుకున్న ఫైనాన్షియర్ల నుంచి చాలాసార్లు ఫోన్ వచ్చినట్టు పోలీసులు గుర్తించారు. కరోనా వల్ల శ్రీకాంత్ ఉద్యోగం చేయకుండా కొన్ని నెలల పాటు ఉన్నాడని దీంతో తనకు ఆర్థిక సమస్యలు ఎక్కువైనట్టు తెలుస్తోంది. ఒక నెల కిందనే శ్రీకాంత్ ఓ ఎంఎన్సీ కంపెనీలో చేరినట్టు పోలీసులు గుర్తించారు.
ఫైనాన్షియర్ల నుంచి ఒత్తిడి పెరగడంతో తన దగ్గర డబ్బులు లేవని శ్రీకాంత్ వాళ్లకు ఈమెయిల్ చేసినట్టు తెలుస్తోంది. మరోవైపు ఫ్యామిలీ మొత్తం సూసైడ్ చేసుకోవాలని ఒక నెల ముందు నుంచే ప్లానింగ్ చేసుకున్నట్టుగా పోలీసుల దర్యాప్తులో వెల్లడైనట్టు తెలుస్తోంది. ఎలా చనిపోవాలో ఒక నెల ముందు నుంచే నెట్లో శ్రీకాంత్ వెతికినట్టు పోలీసులు గుర్తించారు. అయితే.. ఇంకా ఈ కేసులో పలు అనుమానాలు ఉన్నాయని.. పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు.
శ్రీకాంత్ ఇంట్లో ఉన్న దేవుడి బొమ్మలు బోర్లించి ఉండటం.. వారి నుదుటిన ఎర్రటి బొట్లు ఉండటం లాంటి విషయాలపై కూడా దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు స్పష్టం చేశారు.