కోహీర్, అక్టోబర్8 : చట్టాలపై ప్రతిఒక్కరు అవగాహన కలిగి ఉండాలని జహీరాబాద్ కోర్టు సీనియర్ సివిల్ జడ్జి దుర్గాప్రసాద్ అన్నారు. శుక్రవారం మండలంలోని పైడిగుమ్మల్ గ్రామంలో చట్టాలపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా జడ్జి దుర్గాప్రసాద్ మాట్లాడుతూ.. ప్రతి చిన్న విషయానికి కేసులు పెట్టుకోవద్దని సూచించారు.
భూముల విషయాల్లో కూడా తగాదాలు పెట్టుకోవద్దని ప్రతిఒక్కరూ చట్టాలను గౌరవించాలన్నారు. ప్రజల మధ్య ఎలాంటి గొడవలు జరిగినా ప్రతి శనివారం కోహీర్ తహసీల్ కార్యాలయంలో పరిష్కార కేంద్రాన్ని ఏర్పాటు చేయిస్తామన్నారు.
అక్కడకు వచ్చే ప్రజలకు ఉచితంగా సలహాలను అందజేస్తారన్నారు. తాగి వాహనాలు నడుపొద్దని డీఎస్పీ శంకర్రాజు కోరారు. తాగిన మైకంలో వాహనాలు నడుపడంతోనే అనేక మంది రోడ్డు ప్రమాదాల బారీన పడి మృతి చెందుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
నిబంధనలు పాటించాలన్నారు. అనంతరం కోహీర్ తహసీల్ కార్యాలయంలో చట్టాలపై అవగాహన కల్పించారు. సమావేశంలో తహసీల్దార్ కిషన్, ఎస్సై చల్లా రాజశేఖర్, గ్రామప్రజలు పాల్గొన్నారు.