పటాన్చెరు, జనవరి 4 : ఎన్డీటీవీ ప్రతినిధి బృం దం సంగారెడ్డి జిల్లా పటాన్చెరు మండలంలోని చిట్కుల్ పంచాయతీలో పర్యటించింది. ఎన్డీటీవీ ప్రతినిధి ఉమాసుధీర్ గ్రామంలో పల్లె ప్రకృతివనాన్ని చూసి ఫిదా అయ్యారు. సర్పంచ్ నీలం మధు ముదిరాజ్ ఎన్డీటీవీ ప్రతినిధులను స్వాగతం పలికి పం చాయతీ భవనాన్ని చూపించారు. అనంతరం వారు పల్లె ప్రకృతివనం, డంపింగ్యార్డు, పల్లె ప్రకృతివనం, వైకుంఠధామాన్ని చూసి వీడియో షూట్ చేశా రు. పల్లె ప్రకృతివనంలో ఏర్పాటు చేసిన వాకింగ్ ట్రాక్, సిమెంట్ బెంచ్లను చూసి వారు సర్పంచ్ను అభినందించారు. మహిళా సంఘాలు, ప్రజాప్రతినిధులు పచ్చదనం పెంపు, పారిశుధ్య పరిరక్షణకు తీసుకుంటున్న చర్యలను అడిగి రికార్డు చేశారు. తెలంగాణ వచ్చిన తర్వాత చిట్కుల్ గ్రామానికి మహర్దశ వచ్చిందని సర్పంచ్ వారికి వివరించారు. సీఎం కేసీఆర్ పట్టణాలకు దీటుగా పల్లెల్లో సౌకర్యాలు కల్పించారన్నారు. గ్రామంలో పచ్చదనానికి అధిక ప్రాధాన్యత ఇచ్చామన్నారు. గ్రామంలో 100 శాతం వ్యక్తిగత మరుగుదొడ్లు నిర్మించామని కార్యదర్శి కవిత తెలిపారు. ఈ సందర్భంగా ఎన్డీటీవీ ప్రతినిధి మొక్క నాటారు. వారి వెంట జాగృతి నాయకులు భిక్షపతి, డీపీవో సురేశ్ మోహన్, డీఆర్డీవో శ్రీనివాస్రావు, ఎంపీడీవో బన్సీలాల్, ఇన్చార్జి ఎంపీవో మధుసూదన్, ఉమాసుధీర్, ఉప సర్పంచ్ విష్ణువర్ధన్రెడ్డి, వార్డు సభ్యులు ఉన్నారు.
సోలక్పల్లి రైతు వేదిక అద్భుతం
సోలక్పల్లి గ్రామం లో నిర్మించిన రైతు వేదిక చూసి ఎన్డీటీవీ బృందం ప్రతినిధులు సంతోషం వ్యక్తం చేశా రు. మంగళవారం డీపీవో సురేశ్మోహన్, డీఆర్డీవో శ్రీనివాస్రావుతో కలిసి ఎన్డీటీవీ బృందం ప్రతినిధులు రైతు వేదికను పరిశీలించి వివరాలు తీసుకున్నారు. అనంతరం రైతులతో మాట్లాడారు. రైతుబంధు, రైతుబీమా గురించి రైతులను అడిగి వారి అభిప్రాయాలను చిత్రీకరించారు. రైతువేదికలో రైతులతో నిర్వహించిన సమావేశాన్ని బృందం చిత్రీకరించింది. వారి వెంట సర్పంచ్ శ్రీకాంత్రెడ్డి, ఏవో రవీంద్రనాథ్రెడ్డి, ఎంపీవో రాజ్కుమార్, ఏఈవో యోగేశ్వర్రెడ్డి ఉన్నారు.