యాచారం : ఫార్మాసిటీ భూనిర్వాసితులకు దసరా పండుగ లోపే ఇళ్ల స్థలాలను అప్పగిస్తామని ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి అన్నారు. రంగారెడ్డి జిల్లా యాచారం మండల కేంద్రంలోని సాయి శరణం ఫంక్షన్ హాల్లో తాటిపర్తి, కుర్మిద్ద, నానక్నగర్ గ్రామాల ఫార్మా భూ నిర్వాసితులకు ఎకరాకు 121 గజాల చొప్పున 979 మంది రైతులకు ఇళ్ల స్థలాల సర్టిఫికెట్లను అందజేశారు.
ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ఇండ్ల స్థలాలను లాటరీ (Lottery) విధానం ద్వారా ఎంపిక చేసి స్థలాలను అప్పగిస్తామన్నారు. ఇండ్ల స్థలాల కోసం కేటాయించిన 600 ఎకరాల స్థలంలో ముమ్మరంగా పనులు కొనసాగుతున్నాయని వెల్లడించారు. భూమి చదును, రోడ్ల నిర్మాణం కొనసాగుతుందని వివరించారు. ఇప్పటికే ఫార్మా భూసేకరణలో, ఇళ్ల స్థలాల పంపిణీలో ఎలాంటి అవకతవకలు లేవన్నారు. ఫార్మా ఏర్పాటులో భూములు కోల్పోయిన బాధితులకు నష్ట పరిహారంతో పాటు ఎకరాకు 121 గజాల స్థలాన్ని అన్ని వసతులతో కూడిన ఎచ్ఎండీఏ (HMDA) వెంచర్లో ఇస్తున్నట్లు తెలిపారు.
పాఠశాల, పార్కు, దవాఖానా, రోడ్లు, విద్యుత్, తాగునీరు, మంచినీరు, భూగర్భ డ్రైనేజీ తదితర మౌలిక వసతులను కల్పించనున్నట్లు తెలిపారు. దీంతో భూమి కోల్పోయిన ప్రతి రైతుకు రూ. 10నుంచి 13లక్షలు అదనంగా లబ్ధి చేకూరుతుందన్నారు. ప్రభుత్వం అందిస్తున్న పాట్లపై ఎలాంటి నిబందనలు ఉండవని, అవసరమైతే తిరిగి అమ్ముకోవచ్చన్నారు. ఫార్మా పరిసరాల్లో లే-అవుట్లు, ఇండ్ల నిర్మాణాలు, వ్యవసాయం చేసుకోవచ్చన్నారు.
పరిశ్రమలతోనే ఇక్కడి ప్రాంతం రానున్న రోజుల్లో ఎంతో అభివృద్ధి చెందుతుందన్నారు. ఫార్మా రైతులకు అన్యాయం చేసేది లేదన్నారు. ఫార్మా రాకతో స్థానిక యువతి యువకులకు ఉద్యోగ అవకాశాలు పుష్కలంగా ఉంటాయన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ సుకన్య, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ సత్తు వెంకటరమణారెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ ఏర్పుల చంద్రయ్య తదితరులు పాల్గొన్నారు.