సిర్గాపూర్, అక్టోబర్ 27: సంగారెడ్డి జిల్లా సిర్గాపూర్ మండల పరిధిలోని వంగ్దాల్ గైరాన్తండాలో ఒకప్పుడు తాగునీటి కోసం హైరానా పడేవారు. గ్రామస్తులు తాగునీటి కోసం కిలోమీటర్ల దూరంలోని వాగుకు వెళ్లి నీటిని తెచ్చుకునేవారు. వేసవికాలం వచ్చిందంటే వాగు ఎండి చెలిమ గుంతలే దిక్కయ్యేవి. గుంత తవ్వి అందులో ఊట నీళ్లను చెంబుతో తోడి బిందెలు నింపుకొని దుస్థితి ఉండేది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ‘మిషన్ భగీరథ’ పథకంతో తాగునీటి తండాట్ల తీరింది. ఇంటింటికీ నల్లా ద్వారా తాగునీరు ఇంటికి వస్తుండడంతో కష్టాలు దూరమయ్యాయి. ఇప్పుడు వంగ్దాల్ గైరాన్తండా మహిళలు ఇంటి ముందర ఉన్న నల్లా నీళ్లు పట్టుకుంటున్నారు. ఎత్తు గట్టుపైన ఉన్న తమ తండాకు మిషన్ భగీరథ నీళ్లు నిత్యం వస్తున్నాయని, ఇదంతా ముఖ్యమంత్రి కేసీఆర్ చలువేనని గైరాన్తండా (కొత్త గ్రామ పంచాయతీ) సర్పంచ్ జ్యోతిబాయి సంతోషంగా చెబుతున్నారు.