జిన్నారం, అక్టోబర్ 28 : ఇంటి నుంచి పనిమీద బయటకు వెళ్లిన వ్యక్తి మూడు రోజులైనా తిరిగి రాక..రోడ్డు పక్కన శవమై కనిపించాడు. వివరాలల్లోకి వెళ్తే..జిల్లాలోని హత్నూర మండలం రొయ్యపల్లి గ్రామానికి చెందిన జీళ్ల విజయ్కుమార్(54) ఇంటి నుంచి గత మూడు రోజుల క్రితం పనిమీద పటాన్చెరు వెళ్లాడు.
రోజు రాత్రి వరకు తిరిగి వచ్చే విజయ్కుమార్ తెల్లవారిన ఇంటికి తిరిగి రాలేదు. ఫోన్ కూడా స్విచ్చాఫ్ వస్తుండడంతో కుటుంబీకులు హత్నూర పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. కాగా, గురువారం ఉదయం కొడకంచి బస్బాడీ పరిశ్రమ సమీపంలో రోడ్డు పక్కన బైక్తోపాటు విజయ్కుమార్ మృతి చెంది ఉన్నాడు.
రోడ్డు ప్రమాదంలో మృతి చెంది ఉండవచ్చని స్థానికులు తెలిపారు. పోలీసులకు సమాచారం ఇవ్వడంతో జిన్నారం పోలీసులు, విజయ్ కుమార్ కుటుంబీకులు సంఘటన స్థలానికి వచ్చి పరిశీలించారు. గత మూడు రోజుల క్రితం ఇంటి నుంచి బయటకు వెళ్లిన విజయ్కుమార్ రోజు ఇంటికి వచ్చే వ్యక్తి అని, అతడు చనిపోయిన తీరు తమకు అనుమానాలు ఉన్నాయని కుటుంబీకులు పోలీసులకు తెలిపారు.
పోలీసులు కేసు నమోదు చేసుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం నిర్వహించి కుటుంబీకులకు అప్పగించారు.