మహేశ్వరం : పని చేసే ప్రభుత్వానికే ప్రజలు పట్టం కట్టాలని, సీఎం కేసీఆర్తోనే తెలంగాణ అభివృద్ధి సాధ్యమని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి (Minister Sabitha Indra Reddy) అన్నారు. శనివారం మహేశ్వరం మండల పరిధిలోని అకాన్పల్లి, గట్టుపల్లి, రామచంద్రగూడ, పెండ్యాల, కల్వకోల్, దుబ్బచెర్ల, సుభాన్పూర్, అయ్యవారి పల్లి, దిలావర్గూడ, గాంధీనగర్ తండా, కోళ్లపడకల్, పోరండ్ల గ్రామాల్లో జరిగిన ఎన్నికల ప్రచారంలో జడ్పీచైర్పర్సన్ తీగల అనితా హరినాథ్రెడ్డితో కలిసి ఆమె పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ మహేశ్వరం నియోజక వర్గానికి ఇష్టం లేక వచ్చిన కాంగ్రెస్ అభ్యర్థిని ఓడించాలని కోరారు. రియల్ ఎస్టేట్ వ్యాపారస్థులకు, రియల్ సేవకురాలికి జరుగుతున్న ఎన్నికల యుద్ధంలో ప్రజలే న్యాయనిర్ణేతలని వెల్లడించారు. జరిగిన అభివృద్ధితో పాటు జరుగబోయే పనులు కొనసాగాలంటే బీఆర్ఎస్(BRS)ను గెలిపించాలని సూచించారు.
సీఎం కేసీఆర్ చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ నినాదంతో ప్రజల ముందుకు వస్తున్నామని అన్నారు. ప్రతి ఇంటికి మంచి నీరు అందిస్తున్న ఘనత సీఎం కేసీఆర్(CM KCR)కే దక్కుతుందని అన్నారు. రైతు బంధు ద్వారా రైతులకు బరోసాను కలిపిస్తున్న బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఆదరించాలని కోరారు. తెలంగాణకు కాంగ్రెస్, బీజేపీ పార్టీలు ఇప్పటి వరకు ఏం చేశారని ప్రజలు నిలదీయాలని ప్రజలకు పిలుపునిచ్చారు. మూడు గంటలు కరెంటిచ్చే కాంగ్రెస్ కావాలా? 24 గంటల కరెంటు ఇచ్చే బీఆర్ఎస్ కావాలో ప్రజలు తీర్పును ఇవ్వాలని సూచించారు.
కాంగ్రెస్, బీజేపీ నాయకులు పంచె డబ్బు సంచులకు ఇక్కడి ప్రజలు మోసపోరని అన్నారు. ప్రభుత్వం అధికారంలోకి రాగానే అసైన్డ్ భూమి ఉన్నవారికి పట్టాలను ఇవ్వనున్నామని ఆమె తెలిపారు. ఈ కార్యక్రమంలో పీఏసీఎస్ చైర్మన్ మంచె పాండు యాదవ్, వైస్ చైర్మన్ వెంకటేశ్వర్రెడ్డి, మాజీ ఎస్సీ, ఎస్టీ కమిషన్ సభ్యుడు చిలక మర్రి నర్సింహ, బీసీ సెల్ నియోజక వర్గం అధ్యక్షుడు మల్లేశ్యాదవ్, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు అంగోతు రాజునాయక్ తదితరులు పాల్గొన్నారు.