జహీరాబాద్, సెప్టెంబర్ 27 : యాసంగిలో రైతులు ఉద్యాన పంటలు సాగు చేసేందుకు ముందుకు రావాలని జహీరాబాద్ డివిజన్ ఉద్యాన శాఖ అధికారి అనుషారెడ్డి తెలిపారు. సోమవారం జహీరాబాద్ మండలంలోని చిరాగ్పల్లి రైతు వేదికలో నిర్వహించిన యాసంగి పంటల సాగు ఆవగాహన సదస్సులో పాల్గొని మాట్లాడారు.
యాసంగిలో రైతులు ఉద్యాన పంటలైన మామిడి, అరటి, బొప్పాయి, వంటి పంటలు సాగు చేయాలన్నారు. కూరగాయలను మల్చింగ్ సీట్తో సాగు చేసేందుకు ప్రయత్నం చేయాలన్నారు. ప్రభుత్వం కూరగాయలు సాగు చేసేందుకు రైతులకు సబ్సిడి పై మల్చింగ్ సీట్ ఇస్తారన్నారు. భారీ వర్షాలకు నీట మునిగి పంటలకు నష్టా జరిగే ఆవకాశం ఉందన్నారు. పంట పొలంలో నిల్వ ఉన్న నీటిని వెంటనే తొలగించేందుకు ఏర్పాట్లు చేయాలన్నారు.
రైతులు యాసంగిలో నూనె గింజల పంటలైన నల్ల, తెల్ల కుసుమ పంటలు సాగు చేయాలన్నారు. వేరు శనగ పంట సాగు చేసేందుకు రైతులు ముందుకు రావాలన్నారు. కార్యక్రమంలో చిరాగ్పల్లి, కాశీంపూర్ రైతులు మల్లేశం, అశోక్, దత్తాత్రి, మౌలాన, ప్రసాద్ తదితరులు ఉన్నారు.