న్యాల్కల్ : సంగారెడ్డి జిల్లా న్యాల్కల్ మండలం హద్నూర్ గ్రామంలో మంగళవారం నిర్వహించిన ఊరడమ్మ జాతరకు భక్తులు పోటెత్తారు. 50 ఏండ్ల తర్వాత నిర్వహించిన జాతరకు వివిధ ప్రాంతాల్లో ఉన్న గ్రామస్తులు తమ పిల్లాపాపలతో పెద్ద ఎత్తున హాజరయ్యారు. ఉదయం అమ్మవారికి కుంకుమార్చన, అభిషేకం, హారతి తదితర పూజలు నిర్వహించారు.
అనంతరం వందలాది మంది మహిళలు బోనాలను ఎత్తుకొని గ్రామంలోని ప్రధాన వీధుల గుండా గుల్ల బిర్లా డప్పు వాయిద్యాలు, పోతురాజుల విన్యాసాల మధ్య భారీ ఎత్తున ఊరేగింపు నిర్వహించారు. అనంతరం అమ్మవారికి బోనాలు, నైవేద్యాలు సమర్పించారు. ఒడి బియ్యం పోసి పాడిపంటలు బాగా పండి ప్రజలందరూ సుఖశాంతులతో చల్లగా గడిపేలా చూడాలని అమ్మవారిని మొక్కుకున్నారు.
అనంతరం జాతర ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో భక్తులకు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ వీరమణి, పీఏసీఎస్ డైరెక్టర్ ప్రవీణ్ కుమార్, ఉత్సవ కమిటీ సభ్యులు రాజ్ కుమార్, బక్క రెడ్డి, సంగారెడ్డి, అంజిరెడ్డి, నవీన్ పటేల్, జైపాల్ రెడ్డి, పవన్ పటేల్, చాకలి మల్లన్న, అంజన్న, శివ్ పటేల్, యధుల్ పటేల్, నరేష్ తదితరులు పాల్గొన్నారు.