కంగ్టి, జనవరి 27: బీఆర్ఎస్ పార్టీతోనే మండలంలో గ్రామాలు అభివృద్ధి చెందాయని ఎమ్మెల్యే మహారెడ్డి భూపాల్రెడ్డి అన్నారు. శుక్రవారం కంగ్టి మండలంలో పలు అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశాల్లో మాట్లాడుతూ ఎనిమిదేండ్ల కాలంలో మండలంలోని అన్ని గ్రామాల్లో అనేక అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించామని చెప్పారు. బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత మండలంలోని అన్ని గ్రామాలకు బీటీ రోడ్లు ఏర్పాటు చేశామని చెప్పారు. దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు సంక్షేమ పథకాలను అందిస్తున్నదని అన్నారు. రైతులకు రైతుబంధు, రైతుబీమా తదితర పథకాలను ప్రవేశపెట్టి వారిని ఆదుకుంటున్నదన్నారు. కంగ్టిలో రూ.25 లక్షలతో సీసీ రోడ్డు, రూ.5లక్షలతో అంబేద్కర్ భవనం, తుర్కవడగామలో రూ.20లక్షలతో సీసీ రోడ్డు, నాగూర్(కె)లో రూ.5లక్షలతో వాల్మీకీ భవనం, 15లక్షలతో సీసీ రోడ్లకు శంకుస్థాపన చేసి భూమిపూజ చేశారు. స్థానిక పంచాయతీ కార్యాలయంలో కొనసాగుతున్న కంటివెలుగు శిబిరాన్ని సందర్శించి వైద్యులతో మాట్లాడారు. అనంతరం ఇటీవల మృతిచెందిన సీనీయర్ బీఆర్ఎస్ నాయకుడు గాదే కృష్ణమూర్తి కుటుంబాన్ని పరామర్శించారు.
కార్యక్రమంలో బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు మహారెడ్డి రోషన్రెడ్డి, ఎంపీపీ సంగీతవెంకట్రెడ్డి, జడ్పీటీసీ కోట లలితాఆంజనేయులు, సర్పంచ్ల ఫోరం మండలాధ్యక్షుడు సిద్దరమేశ్, బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు గంగారాం, ఆయాగ్రామాల సర్పంచ్లు, ఎంపీటీసీలు పాల్గొన్నారు.
గాంధీజీ ఆశయాలను సాకారం చేద్దాం
మహాత్మాగాంధీ ఆశయాలను సాకారం చేసే దిశగా ప్రతి ఒక్కరూ తోడ్పడాలని ఎమ్మెల్యే మహారెడ్డి భూపాల్రెడ్డి అన్నారు. శుక్రవారం నారాయణఖేడ్ మండలం అబ్బెందలో ఏర్పాటు చేసిన గాంధీజీ విగ్రహాన్ని ఆవిష్కరించిన సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడారు. ప్రపంచంలోనే అతి పెద్ద ప్రజాస్వామ్య దేశంగా అవతరించిన భారతదేశ ప్రజలకు ఆంగ్లేయుల నుంచి అహింసా పద్ధతిలో గాంధీజీ పోరాడి దేశానికి స్వాతంత్య్రం తెచ్చారన్నారు. సమాజంలో శాంతి సౌభ్రాతృత్వం నెలకొనేందుకు గాంధీజీ చూపిన మార్గం అనుసరణీయమన్నారు. మాజీ ఎంపీపీ జీవులానాయక్ తన సొంత ఖర్చుతో గాంధీజీ విగ్రహాన్ని ఏర్పాటు చేయడం గొప్ప విషయమని ఎమ్మెల్యే కొనియాడారు. కార్యక్రమంలో సర్పంచ్ సుదర్శన్రావు, ఉపసర్పంచ్ హన్మంతు, నాయకులు వెంకట్రెడ్డి, వార్డు సభ్యులు పాల్గొన్నారు.