సంగారెడ్డి: కేంద్రంలోని మోదీ ప్రభుత్వం పరిశ్రమలను కార్పొరేటీకరణ చేయడం గర్హనీయమని ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి అన్నారు. కొత్తగా ఒక్క పరిశ్రమను స్థాపించకపోగా.. ఉన్నవాటిని ప్రైవేటు సంస్థలకు కట్టబెట్టాలని చూడటం దుర్మార్గమన్నారు. ఇందిరాగాంధీ హయాంలో సంగారెడ్డిలో నెలకొల్పిన ఓడీఎఫ్ను ప్రైవేటీకరించేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తున్నదని, వెంటనే ఈ ప్రయత్నాన్ని విరమించుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. వేలాది మంది ఉద్యోగుల పొట్టగొట్టే హక్కు మీకెవరిచ్చారని ప్రధాని మోదీని ప్రశ్నించారు. శనివారం ఆయన సంగారెడ్డి జిల్లా కేంద్రంలో మీడియాతో మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం విధానాలను దుయ్యబట్టారు.
ఓడీఎఫ్ ఆవరణలో ఉన్న దవాఖాన నిర్వహణ నుంచి కేంద్రం తప్పుకోవాలని అనుకోవడం దుర్మార్గమన్నారు. ఇలా జరిగితే కంపెనీ సిబ్బందితో పాటు వారి కుటుంబసభ్యులకు వైద్య సేవలు ఎలా అందుతాయని ఆయన ప్రశ్నాంచారు. వారికి వైద్య సేవలు అందకుండా చేయడమేనా అభివృద్ధి, సంక్షేమమా చెప్పాలన్నారు. ఈ దవాఖాన మూసివేతతో ఇక్కడ పనిచేస్తున్న డాక్టర్లు, నర్సులు, ఇతర సిబ్బంది ఎక్కడికెళ్లాలని, వారి పరిస్థితి ఏమిటో కేంద్రం వివరించాలని డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వ నిర్ణయంతో ఓడీఎఫ్లో పనిచేస్తున్న ఎనిమిది వేల మంది ఉద్యోగుల ఆరోగ్య భద్రత ప్రశ్నార్ధకంగా మారుతుందన్నారు.
సంగారెడ్డిలో ఓడీఎఫ్ ఏర్పాటు సమయంలో స్థానికులు 3200 ఎకరాల భూమిని ఇచ్చారని ఎంపీ కొత్త ప్రభాకర్రెడ్డి గుర్తుచేశారు. ఇప్పుడు ఆ విలువైన భూములను ప్రైవేట్ పరం చేసే కుట్ర జరుగుతున్నదని ఆరోపించారు. ఒకవేళ కేంద్ర ప్రభుత్వం ఓడీఎఫ్ను ప్రైవేట్ పరం చేయాలని చూస్తే పరిశ్రమ ఏర్పాటు కోసం ఇచ్చిన స్థానికులు ఇచ్చిన భూములను రాష్ట్ర ప్రభుత్వానికి అప్పగించాలని ఆయన డిమాండ్ చేశారు. మా భూములు తీసుకుని ఉపాధి కల్పించకుండా.. కార్పొరేట్లకు కట్టబెడితే ఊరుకునే ప్రసక్తే లేదన్నారు. ఈ విషయాన్ని టీఆర్ఎస్ ఎంపీలతో కలిసి పార్లమెంట్లో లెవనెత్తుతామని స్పష్టం చేశారు. కేంద్రం చేస్తున్న ఈ మోసాన్ని నిరసిస్తూ పోరాడతామని, ఓడీఎఫ్ ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం తరపున అండగా నిలుస్తామని హామీ ఇచ్చారు.