నారాయణఖేడ్, జూలై 23 : అధికారులంతా సమన్వయంతో పని చేసినప్పుడే సమస్యలు పరిష్కారమవుతాయని, ఆ దిశగా కృషి చేసి ప్రజా ప్రతినిధుల సూచనలకనుగుణంగా చర్యలు చేపట్టాలని ఎమ్మెల్యే మహారెడ్డి భూపాల్రెడ్డి అన్నారు. శుక్రవారం నారాయణఖేడ్ ఎంపీడీవో కార్యాలయ సమావేశ మందిరంలో ఎంపీపీ అధ్యక్షురాలు చాందిబాయి చౌహాన్ అధ్యక్షతన జరిగిన మండల సర్వ సభ్య సమావేశానికి ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. మూడు నెలలకోసారి జరిగే మండల సభలో చర్చించిన అంశాలపై అధికారులు సమీక్షించుకొని వాటి పరిష్కారానికి త్వరితగతిన చర్యలు తీసుకోవాలన్నారు. సమావేశంలో ఎంపీ పీ అధ్యక్షురాలు చాందిబాయి చౌహాన్, జడ్పీటీసీ లక్ష్మీబాయి రవీందర్నాయక్, ఎంపీపీ ఉపాధ్యక్షుడు సాయిరెడ్డి, ఎంపీడీవో వెంకటేశ్వర్రెడ్డి, సర్పంచ్లు, ఎంపీటీసీలు, ఆయా శాఖల అధికారులు పాల్గొన్నారు.
రాబడి పెంపుతోనే..
మున్సిపాలిటీ రాబడిని పెంచుకున్నప్పుడే ప్రజల సమస్యలు పరిష్కారమవుతాయని ఎమ్మెల్యే మహారెడ్డి భూపాల్రెడ్డి అన్నారు. శుక్రవారం నారాయణఖేడ్ మున్సిపల్ కార్యాలయంలో నిర్వహించిన సమీక్షలో ఆయన మాట్లాడారు. పన్నులు సక్రమంగా వసూలు చేయడం ద్వారా ఆదాయం పెరిగే అవకాశం ఉంటుందని, ఆ మేరకు మున్సిపల్ అధికారులు, సిబ్బంది కృషి చేయాలన్నారు. కౌన్సి ల్ సమావేశంలో ప్రతిపాదించిన అంశాలకు ప్రాధాన్యతనిచ్చి పనులు చేపట్టాలని సమావేశంలో నిర్ణయించారు.