సంగారెడ్డి జడ్పీ చైర్పర్సన్ మంజుశ్రీ జైపాల్రెడ్డి
పుల్కల్, జూలై 8: విద్యార్థులు బాగా చదివి ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని సంగారెడ్డి జడ్పీ చైర్పర్సన్ మంజు శ్రీ జైపాల్రెడ్డి అన్నారు. శుక్రవారం మండల కేంద్రంలోని జడ్పీహెచ్ఎస్లో స్వామి వివేకానంద సేవా సమితి ఆధ్వర్యంలో పదో తరగతి విద్యార్థులకు అభినందన సభకు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు, కార్పొరేట్కు దీటుగా మార్కులు సంపాదిస్తున్నారన్నారు. రెండేండ్లుగా కరోనాతో పోరాడి తిరిగి 10 జీపీఏ, 9.8 జీపీఏ మార్కులు తీసుకొచ్చారంటే అందుకు విద్యార్థుల తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల కృషి ఎంతో ఉందన్నారు. ఇలాగే బాగా చదివి ఉన్నత శిఖరాలకు ఎదిగి, తల్లిదండ్రులు, గురువులకు మంచి పేరు తీసుకురావాలన్నారు.
కార్యక్రమాన్ని ఏర్పా టు చేసిన స్వామి వివేకానంద సేవా సమితి జిల్లా అధ్యక్షుడు శేషాద్రిని ప్రత్యేకంగా అభినందించారు. ఇలాంటి కార్యక్రమాలతో విద్యార్థుల్లో నైపుణ్యం మరింతగా అభివృద్ధి చెందుతుందన్నారు. అనంతరం పాఠశాలలో తరగతి గదులు, టాయిలెట్లను పరిశీలించి అసహనం వ్యక్తంచేశారు. సిబ్బంది కొరత ఉండడంతో శుభ్రంగా ఉంచలేక పోతున్నామని హెచ్ఎం రవికుమార్ తెలిపారు. 10 జీపీఏ, 9.8 జీపీఏ తెచ్చుకున్న వైష్ణవి, భవానీతో పాటు 12 మంది విద్యార్థులను ఆమె సన్మానించి, నగదు అందజేశారు. కార్యక్రమంలో ఎంపీపీ చైతన్య విజయ్ భాస్కర్రెడ్డి, ఎంపీటీసీ అవుసలి శ్రీనివాసాచారి, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.