సంగారెడ్డి, జూన్ 11: తెలుగు సాహిత్యం సమాజానికి మంచి సందేశం ఇచ్చేవిధంగా ఉండాలని సంగారెడ్డి జిల్లా పరిషత్ చైర్పర్సన్ మంజుశ్రీజైపాల్రెడ్డి అన్నారు. ఆదివారం కలెక్టరేట్లో తెలంగాణ రాష్ట్ర అవతరణ ఉత్సవాల్లో భాగంగా సాహితీ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. కలెక్టర్ శరత్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో సాహితీవేత్తలు, కవులు పాల్గొన్నారు. అంతకుముందు జిల్లాకు చెందిన 17వ శతాబ్దపు కవి పొన్నగంటి తెలగన్న చిత్ర పటానికి పూలమాలలు వేసి, జ్యోతి ప్రజ్వలన చేసి ఉత్సవాలను ప్రారంభించారు. అనంతరం జిల్లా డెయిరీశాఖ ఆధ్వర్యంలో రూపొందించిన ప్రజాప్రతినిధులు, అధికారులు ‘జై పాడి రైతన్న’ సీడీని ఆవిష్కరించారు.
సాహిత్య ఉత్సవాల్లో పాల్గొన్న కవులకు శాలువా కప్పి, సత్కరించి రూ.1,116లను అందజేశారు. ఈ వేడుకలకు ముఖ్యఅతిథులుగా హాజరైన జడ్పీ చైర్పర్సన్ మాట్లాడుతూ కవిత్వమంటే తనకేంతో ఇష్టమని, రాయడం రాదని, మంచి కవిత్వాలను తాను ఆస్వాదిస్తానన్నారు. తెలంగాణ పోరాటంలో ప్రజలను చైతన్యవంతం చేసిన విధంగా అభివృద్ధికి సాహిత్యం తోడుగా నిలవాలని కోరారు. తెలంగాణ ఉద్యమంలో సాహితీ కారుల పాత్ర అమోఘమైనదన్నారు. రాష్ట్రం వచ్చిన తర్వాత ప్రభుత్వం కవులు, కళాకారులు, రచయితలు, సాహితీవేత్తలకు గౌరవం ఇస్తుందన్నారు. దశాబ్ది ఉత్సవాల్లో సాహిత్య దినోత్సవాన్ని జరుపుకొంటూ కవులకు గౌరవం ఇస్తున్నదని జడ్పీ చైర్పర్సన్ చెప్పారు.
కవితా రచనతో సమాజ జాగృతం : సంగారెడ్డి కలెక్టర్ శరత్
కవులు కవిత్వంతో సమాజాన్ని జాగృతం చేస్తారని, వారి కవితలు, రచనలు, పాటలతో సమాజంలో చైతన్యం వస్తుందని కలెక్టర్ శరత్ కోరారు. తెలంగాణ ఉద్యమంలో ప్రజలను చైతన్య పర్చిన ఘనత కవులదేనన్నారు. రాష్ట్రం ఏర్పడిన తర్వాత కూడా సమాజహితానికి, రాష్ట్ర అభివృద్ధికి కవుల కవితలు దారి చూపేలా ఉండాలన్నారు. జిల్లాలో ప్రదర్శించిన కవితలతో కవులు రాష్ట్రస్థాయిలో మంచి కవిత్వంతో నిలవాలని సూచించారు. జిల్లాస్థాయిలో సాహిత్య దినోత్సవంలో పాల్గొనేందుకు 70మంది కవులు రిజిస్ట్రేషన్ చేసుకోవడం సంతోషకరమన్నారు. రవి కాంచని చోటు కవి కాంచునని కవుల మాటలు నిజం చేసేందుకు సాహిత్యం పునాదిగా మారాలన్నారు.
జిల్లాస్థాయిలో ఉత్తమ కవితా పఠనం చేసిన 5 మంది కవులను న్యాయనిర్ణేతల కమిటీ ఎంపిక చేసి రాష్ట్రస్థాయికి పంపిస్తామన్నారు. కవి సమ్మేళనానికి వచ్చిన ప్రతి కవికి ప్రభుత్వం తరఫున రూ.1,116లను ప్రోత్సాహాకాన్ని అందజేస్తుందన్నారు. సమాజాన్ని జాగృతం చేసేలా కవితలు, సాహిత్యం ఉండాలని కలెక్టర్ కోరారు. ఈ వేడుకల్లో రాష్ట్ర చేనేత అభివృద్ధి సంస్థ చైర్మన్ చింతా ప్రభాకర్, అదనపు కలెక్టర్ వీరారెడ్డి, డీఆర్వో మెంచు నగేశ్గౌడ్, జిల్లా విద్యాధికారి వెంకటేశ్వర్లు, డీఐఈవో గోవిందరామ్, డీసీవో తుమ్మ ప్రసాద్, జిల్లా డెయిరీ అధికారి మురళీ, జిల్లా సైన్స్ అధికారి విజయ్కుమార్, యువజన సంక్షేమాధికారి రామచందర్రావు, ఆర్డీవో రవీందర్రెడ్డి, న్యాయనిర్ణేతలు మోహన గాంధీ, మహిపాల్రెడ్డి, కవులు, రచయితలు తదితరులు పాల్గొన్నారు.