సంగారెడ్డి, ఫిబ్రవరి17: నేరాలను నియంత్రించేందుకు సీసీ కెమెరాలు ఉపయోగపడుతాయని, వీటి ఏర్పాటుపై ప్రజలకు అవగాహన కల్పిస్తున్నామని సంగారెడ్డి ఎస్పీ రమణకుమార్ తెలిపారు. ప్రధాన కూడళ్లలో స్వచ్ఛందంగా ఏర్పాటు చేసుకునేలా ప్రోత్సహించాలని పోలీసు అధికారులకు సూచించారు. శుక్రవారం జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో అధికారులతో నేర సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ రోడ్డు ప్రమాదాల కారణాలపై దృష్టి సారించాలన్నారు.
నేరస్తులపై కేసు నమోదు చేసి కటకటాలకు పంపించాలన్నారు. వాహనదారులు ట్రాఫిక్ నిబంధనలు పాటించేలా అవగాహన కల్పించాలన్నారు. ప్రతిఒక్కరూ ట్రాఫిక్ రూల్స్ పాటించాలన్నారు. బైక్ రైడర్స్ తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని, చిన్న నిర్లక్ష్యం నిండు ప్రాణానికి హానిగా మారొచ్చని వివరించారు. మైనర్లకు వాహనాలు ఇవ్వవద్దని, అలాంటి పక్షంలో తల్లిదండ్రులు శిక్షార్హులు అవుతారని హెచ్చరించారు. గ్రేవ్, నాన్-గ్రేవ్ కేసుల్లో ఏవిధంగా ఇన్వెస్టిగేషన్ చేయాలనే విషయాలను అధికారులు మరువొద్దన్నారు. ఈ సమీక్షలో అదనపు ఎస్పీ ఉషా విశ్వనాథ్, సంగారెడ్డి, పటాన్చెరు, జహీరాబాద్ల డీఎస్పీలు రవీంద్రారెడ్డి, భీమ్రెడ్డి, రఘు, సీఐలు, ఎస్సైలు, ఎస్బీ, డీసీఆర్బీ ఇన్స్పెక్టర్లు పాల్గొన్నారు.
మత్తు పదార్థాలు, మాదక ద్రవ్యాలను పసిగట్టడంలో జాగిలం షాడో నైపుణ్యం కలిగి ఉన్నదని సంగారెడ్డి ఎస్పీ రమణకుమార్ తెలిపారు. శుక్రవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో కొత్తగా కేటాయించిన జాగిలం పని తీరును ఎస్పీకి వివరిస్తూ పాసింగ్ అవుట్ పరేడ్ను చూపించారు.ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ జిల్లాకు మొదటిసారిగా మాదక ద్రవ్యాలను నివృత్తి చేయగల జాగిలాన్ని కేటాయించడంతో గంజాయి అక్రమ రవాణా, నిల్వలను నివారించగలమని ఎస్పీ వెల్లడించారు. జాగిలాలు సమర్థవంతంగా విధులు నిర్వహిస్తున్నాయన్నారు. జిల్లా కొత్త జాగిలం షోడోను పోలీస్ ఉన్నతాధికారులు కేటాయించారని ఎస్పీ రమణకుమార్ తెలిపారు.