సంగారెడ్డి/ మెదక్, (నమస్తే తెలంగాణ)/ సిర్గాపూర్/ పాపన్నపేట/ పుల్కల్: అల్పపీడన ద్రోణితో మెదక్, సంగారెడ్డి జిల్లాలో సోమవారం రాత్రి నుంచి మంగళవారం ఎడతెరిపి లేని వాన కురిసింది. దీంతో ఆయా జిల్లాలో జిల్లాలోని జలవనరుల్లోకి నీరు చేరి కళకళలాడుతున్నాయి. వానల కోసం ఎదురుచూస్తున్న రైతులకు ఊరట లభించడంతో వ్యవసాయ పనులు షురూ చేశారు. సంగారెడ్డి జిల్లాలో 250.8 మి.మీ, మెదక్ జిల్లాలో 18.6 మి.మీటర్ల వర్షపాతం నమోదైనట్లు అధికారులు తెలిపారు. కొన్ని ప్రాంతాల్లో మోస్తరు, మరికొన్ని ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. ఆయా జిల్లాల్లోని సింగూరు, నల్లవాగు, వనదుర్గా ప్రాజెక్టుల్లోకి జలాలు వచ్చి చేరుతున్నాయి.
రైతులకు ఊరట…
ఇప్పటి వరకూ వర్షం లేక అల్లాడుతున్న రైతులకు ఊరట లభించింది. వాన కాలం ప్రారంభమై 20 రోజులు దాటినా ఇప్పటికీ సరైన వర్షాల్లేక పలు మండలాల్లో రైతులు అయోమయంలో ఉన్నారు. మొత్తంగా జిల్లాల్లో మంగళవారం కురిసిన వర్షంతో సాగుకు రైతులు సమాయత్తం అవుతున్నారు. సోమవారం రాత్రి నుంచి కురుస్తున్న వర్షాలతో రైతులు వ్యవసాయ పనులను ముమ్మరం చేశారు. ఇప్పటికే వరి నారు మళ్లు చేతికి రావడంతో రైతులు నాట్లు వేసేందుకు సిద్ధమయ్యారు. పలుచోట్ల వ్యవసాయ పనులు ఊపందుకున్నాయి. వ్యవసాయ బోర్ల వద్ద వరి నారు మళ్లు చేతికి రావడంతో రైతులు వరినాట్లు వేస్తున్నారు. వర్షాలు భారీగా కురుస్తుండడంతో పంట పొలాల్లోకి నీళ్లు చేరాయి. వర్షాల కారణంగా పంట పొలాల్లో నీరు సమృద్ధిగా చేరడంతో రైతులు ట్రాక్టర్లతో దున్ని వరినాట్లు వేస్తున్నారు. వర్షం నీటితో పాటు వ్యవసాయ బోర్ల వద్ద నీరు రైతులకు కలిసి వస్తున్నది. అటు వర్షపు నీరు ఇటు బోర్ల నీటితో రైతులు వరి నారు మళ్లను వేగవంతం చేశారు.
మెదక్ జిల్లాలో వర్షపాతం ఇలా…
జిల్లాలో సోమవారం రాత్రి నుంచి మంగళవారం మధ్యాహ్నం వరకు కురిసిన వర్షానికి నమోదైన వర్షపాతం వివరాలు ఇలా ఉన్నాయి. మెదక్ జిల్లాలో 18.6 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు కాగా, హవేళీఘణాపూర్లో 31.5 మి.మీ, రామాయంపేటలో 30.1 మి.మీ, నిజాంపేట్లో 27.2 మి.మీ, చిన్నశంకరంపేటలో 27.9 మి.మీ, మెదక్లో 26.1 మి.మీ, నార్సింగిలో 24.4 మి.మీ, కొల్చారం 22.9 మి.మీ, వెల్దుర్తిలో 20.2 మి,మీల అత్యధిక వర్షపాతం నమోదైంది. పెద్దశంకరంపేటలో 18.6 మి.మీ, కౌడిపల్లిలో 16.2 మి.మీ, రేగోడ్లో 15.0 మి.మీ, నర్సాపూర్లో 14.5 మి.మీ, తూప్రాన్లో 13.4 మి.మీ, శివ్వంపేటలో 13.1 మి.మీ, అల్లాదుర్గంలో 12.7 మి.మీ, చిలిపిచెడ్లో 11.9 మి.మీ, టేక్మాల్లో 10.3 మి.మీ అత్యల్ప వర్షపాతం నమోదైందని వాతావరణశాఖ అధికారులు తెలిపారు. జిల్లాలోని హవేళీఘణాపూర్, రామాయంపేట, నిజాంపేట్, చిన్నశంకరంపేట, మెదక్ తదితర ప్రాంతాల్లో భారీ వర్షం నమోదైంది. జిల్లా కేంద్రం మెదక్లో భారీ వర్షానికి పలు ప్రాంతాల్లో వర్షపు నీరు నిలిచింది. ముఖ్యంగా వెంకట్రావ్నగర్ కాలనీ, హన్మంతరావు కాలనీ, ఆటోనగర్, హౌసింగ్బోర్డు తదితర ప్రాంతాల్లో భారీగా వర్షంనీరు చేరింది. లోతట్టు ప్రాంతాలు, కాలనీల్లోకి నీరు చేరిన ప్రాంతాలను మున్సిపల్ చైర్మన్ చంద్రపాల్ పరిశీలించారు. మరోవైపు ఉద్యోగులు, వ్యాపారులు, ఇళ్లకు వెళ్లడానికి తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ప్రస్తుతం కురుస్తున్న వర్షంతో వనదుర్గా ప్రాజెక్టు పొంగిపొర్లుతున్నది. ఈ ప్రాజెక్టు కింద ఫతేనగర్, మహబూబ్ నగర్ కెనాన్ల కింద పాపన్నపేట, కొల్చారం, మెదక్, హవేళీఘనపూర్ మండలాల పరిధిలోని సుమారు 22 వేల ఎకరాలపై చిలుకు పంటలకు లబ్ధి చేకూరనున్నది.
సంగారెడ్డి జిల్లాలో..
సంగారెడ్డి జిల్లాలో మంగళవారం ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తూనే ఉంది. జిల్లాలో మొత్తం 250.8 మి.మీటర్ల వర్షపాతం నమోదైంది. జిల్లాలో అత్యధికంగా మొగుడంపల్లి మండలంలో 21.5 మి.మీటర్ల వర్షం కురిసింది. మొత్తం 11 మండలాల్లో సాధారణ కంటే ఎక్కువస్థాయిలో వర్ష పాతం నమోదు కాగా, 12 మండలాల్లో సాధారణ వర్షం కురిసింది. ఐదు మండలాల్లో సాధారణ కంటే తక్కువ వర్షం కురిసింది. నిజాంపేట, సిర్గాపూర్, జహీరాబాద్, ఝరాసంగం, పుల్కల్, అమీన్పూర్, పటాన్చెరు, రాయికోడ్, సిర్గాపూర్, జిన్నారం, కంగ్టి మండలాల్లో ఎక్కువగా వర్షం కురిసింది. సంగారెడ్డితోపాటు పటాన్చెరు, జహీరాబాద్, జోగిపేట పట్టణాల్లో రోజంతా వర్షం కురుస్తూనే ఉంది. దీంతో జనజీవనం స్తంభించిపోయింది. సిర్గాపూర్ మండలంలో ఎక్కువగా వర్షం కురవడంతో వాసర్, వాంగ్థాల్ వాగుల్లోరి వరదనీరు వచ్చి చేరుతున్నది. వర్షం కారణంగా వాసర్ ఇతర గ్రామాల్లో 20 ఎకరాల్లో పత్తి, సోయా పంటలు నీట మునిగాయి.
సింగూరు, నల్లవాగు ప్రాజెక్టుల్లో పెరుగుతున్న నీటిమట్టం
సింగూరు ప్రాజెక్టు ఎగువభాగమైన కర్ణాటకతోపాటు మంజీరా పరీవాహక ప్రాంతాల్లో వర్షాలు బాగా కురుస్తున్నాయి. దీంతో సింగూరు ప్రాజెక్టులోకి జలాలు వచ్చి చేరుతున్నాయి. మంగళవారం ఉదయం నుంచి సింగూరు ప్రాజెక్టులోకి 2442 క్యూసెక్కుల జలాలు వచ్చినట్లు ఏఈ మహిపాల్రెడ్డి తెలిపారు. ప్రాజెక్టు పూర్తి సామర్థ్యం 29.917 టీఎంసీలు కాగా, ప్రస్తుతం 18.517టీఎంసీల నీరు నిల్వ ఉన్నట్లు పేర్కొన్నారు. అవుట్ ఫ్ల్లో 405 క్యూసెక్యులు ఉండగా, హెచ్ఎండబ్ల్యుఎస్కు 80, మిషన్ భగీరథకు 70, ఈవీపీకి 235 క్యూసెక్యుల నీరు విడుదల చేస్తున్నట్లు తెలిపారు. నారాయణఖేడ్ నియోజకవర్గం సిర్గాపూర్లోని నల్లవాగు ప్రాజెక్టులోకి స్వల్పంగా వరద నీరు వచ్చి చేరుతుంది. మంగళవారం కురిసన వర్షాలకు నల్లవాగు ప్రాజెక్టులోకి 100 క్యూసెక్కుల నీరు చేరిందని ప్రాజెక్టు ఏఈ సూర్యకాంత్ తెలిపారు. నల్లవాగు ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి మట్టం 1493 అడుగులు కాగా, ప్రస్తుతం నీటి మట్టం 1484.5 అడుగులు ఉంది.