హుస్నాబాద్, జూలై 26: ప్రభుత్వ పాఠశాలల్లోనే నాణ్యమైన విద్య అందుతుందని, తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించాలని మున్సిపల్ చైర్పర్సన్ ఆకుల రజితావెంకట్, ఎంపీపీ లకావత్ మానస అన్నారు. సోమవారం హుస్నాబాద్ పట్టణంలోని ప్రభుత్వ పాఠశాలలో మున్సిపల్ చైర్పర్సన్ రజితావెంకట్, మండలంలోని పోతారం(ఎస్), పొట్లపల్లి ప్రభుత్వ పాఠశాలల్లో ఎంపీపీ మానస బడిబాట కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మా ట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి రాష్ట్ర ప్రభు త్వం పెద్ద మొత్తంలో నిధులు ఖర్చు చేస్తున్నదని, ప్రభుత్వం కల్పిస్తున్న సదుపాయాలను విద్యార్థులు, తల్లిదండ్రులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్య, పాఠ్యపుస్తకాలు, దుస్తులు, మధ్యాహ్న భోజనం ఉచితంగా లభిస్తున్నాయన్నారు. ఈ సౌకర్యాలు ప్రైవేటు విద్యాసంస్థల్లో ఉండవన్నారు. కరోనా దృష్ట్యా ఉచిత ఆన్లైన్ తరగతులు కూడా నిర్వహిస్తున్నారని, టీ-సాట్, యూట్యూబ్, దూరదర్శన్ ద్వారా పాఠాలు చెప్తున్నట్లు చెప్పారు. మొదటి రోజు మొత్తం 35 కొత్త అడ్మిషన్లు అయినట్లు అధికారులు తెలిపారు. కార్యక్రమాల్లో ఎంఈవో మారంపల్లి అర్జున్, హెచ్ఎం బండారి మనీల, బొందయ్య, కౌన్సిలర్ దొడ్డి శ్రీనివాస్, సర్పంచ్లు దేవసాని సుశీల, బత్తిని సాయిలు, ఎంపీటీసీలు బి శ్రీనివాస్, నిర్మల, ఉపాధ్యాయులు రాజ్బహదూర్, శంకర్నాయక్, పాపిరెడ్డి, రాధిక, రమేశ్, కవిత పాల్గొన్నారు.
ప్రభుత్వ పాఠశాలలో పిల్లలను చేర్పించాలి
అక్కన్నపేట, జూలై 26: బడీడు పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించి, పాఠశాలను బలోపేతం చేయాలని ఎంపీపీ మాలోతు లక్ష్మి అన్నారు. సోమవారం గోవర్ధనగిరిలో మన ఊరు-మన బడి కార్యక్రమాన్ని జడ్పీటీసీ భూక్య మంగతో కలిసి ఎంపీపీ లక్ష్మి ప్రారంభించారు.ఎంపీపీ మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్య, ఆన్లైన్ ద్వారా, దూరదర్శన్, టీసాట్, యూట్యూబ్ చానళ్ల విద్యా బోధన జరుగుతుందన్నారు. ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులను చేర్పించి సౌకర్యాలు సద్వినియోగం చేసుకోవాలన్నారు. కార్యక్రమంలో ఎంఈవో మారంపల్లి అర్జున్, సర్పంచ్ పీచర సునీత రాములు, ఎంపీటీసీ గొర్ల స్వప్న, మాజీ జడ్పీటీసీ మాలోతు బీలునాయక్, పెండెల రమా, కాంప్లెక్స్ హెచ్ఎం శ్రీనివాస్, సర్వన్నాయక్, ఉపాధ్యాయులు ఉన్నారు.
కూలిపోయిన ఇండ్లను పరిశీలించిన మున్సిపల్ చైర్పర్సన్
హుస్నాబాద్, జూలై 26: హుస్నాబాద్ పట్టణంలోని పలు వార్డుల్లో ఇటీవల కురిసిన వర్షాలకు కూలిపోయిన ఇండ్లను మున్సిపల్ చైర్పర్సన్ ఆకుల రజితావెంకట్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున శిథిలావస్థలో ఉన్న ఇండ్ల యజమానులు సురక్షితమైన ప్రదేశానికి వెళ్లాలని సూచించారు. కూలిపోయిన ఇండ్లకు పరిహారం కోసం కృషి చేస్తామన్నారు. కా ర్యక్రమంలో కమిషనర్ రాజమల్లయ్య, మాజీ ఎంపీపీ ఆకుల వెంకట్, కోఆప్షన్ సభ్యులు అయిలేని శంకర్రెడ్డి, ఎండీ అయూబ్, వార్డు ఇన్చార్జి రాజు పాల్గొన్నారు.