‘ఎలాంటి విపత్కర పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు అన్ని శాఖలు అలర్ట్గా ఉన్నాయి. ప్రజలకు ఎక్కడా ఇబ్బందులు రాకుండా చూస్తాం.’ అని సంగారెడ్డి కలెక్టర్ శరత్కుమార్ అన్నారు. భారీ వర్షాలు కురుస్తున్న క్రమంలో ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను కలెక్టర్ ‘నమస్తే తెలంగాణ’కు వివరించారు. మండల, డివిజన్ స్థాయిల్లో ప్రత్యేక బృందాలను నియమించామని, కలెక్టరేట్లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశామని తెలిపారు. వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేసి ఎప్పటికప్పుడు ఆదేశాలు జారీ చేస్తున్నట్లు వివరించారు. లోతట్టు ప్రాంతాలు జలమయమైతే బాధితులను సురక్షిత ప్రాంతాలకు తరలించేలా ఏర్పాట్లు చేశామన్నారు. చెరువులు, కుంటలు, కాల్వలను ఆక్రమిస్తే బాధ్యులపై నిబంధనల మేరకు కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. చెరువులకు గండ్లు పడితే వెంటనే పూడ్చేలా ఇరిగేషన్ శాఖను అప్రమత్తం చేశామని పేర్కొన్నారు.
భారీ వర్షాలు, వరదల నేపథ్యంలో సంగారెడ్డి జిల్లాలోని ప్రభుత్వ యంత్రాంగం హై అలర్ట్లో ఉన్నట్లు కలెక్టర్ శరత్ తెలిపారు. రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్యశాఖల మంత్రి హరీశ్రావు ఆదేశాల మేరకు జిల్లాలో వర్షాల కారణంగా ప్రజలు ఇబ్బందులు పడకుండా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. విపత్తులు సంభవిస్తే ఎదుర్కొనేందుకు జిల్లా యంత్రాంగం సిద్ధంగా ఉన్నట్ల్లు చెప్పారు. వర్షాల నేపథ్యంలో జిల్లా యంత్రాంగం చేపడుతున్న చర్యలను కలెక్టర్ ‘నమస్తే తెలంగాణ’తో వివరించారు.
కలెక్టర్ : సంగారెడ్డి జిల్లాలో నాలుగు రోజులుగా ఎడతెరపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. ఈ నెలలో 12.8 సెంటిమీటర్ల సాధారణ వర్షం కురవాల్సి ఉండగా ఇప్పటివరకు 45.5 సెం.మీ.లు కురిసింది. జిల్లాలోని ప్రాజెక్టులు, చెరువుల్లోకి భారీగా నీళ్లు వచ్చి చేరుతున్నాయి. సింగూరు, నల్లవాగు ప్రాజెక్టులోకి వరద వస్తున్నది.
కలెక్టర్ : వర్షాల కారణంగా ప్రజలు ఇబ్బందులు పడకుండా ఉండేందుకు జిల్లా యంత్రాంగాన్ని హై అలర్ట్లో ఉంచాం. మండల, డివిజన్ స్థాయిలో అధికారులతో ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేశాం. కలెక్టరేట్లో 24 గంటలు పని చేసేలా కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశాం. ఎక్కడైనా సమస్య ఉంటే వెంటనే గుర్తించి పరిష్కరించేందుకు వీలుగా ప్రత్యేకంగా వాట్సాప్ గ్రూప్ను ఏర్పాటు చేశాం. అందులో ఎప్పటికప్పుడు ఆదేశాలు ఇస్తున్నాం. జిల్లా యంత్రాంగాన్ని సన్నద్ధం చేశాం.
కలెక్టర్ : వర్షాల కారణంగా జిల్లాలో ఎక్కడా ప్రాణ నష్టం జరగలేదు. నారాయణఖేడ్, జహీరాబాద్ రెవెన్యూ డివిజన్లలోని కొన్ని గ్రామాల్లో పాత ఇండ్లు కూలిపోయాయి. ఈ నేపథ్యంలో తహసీల్దార్లను అప్రమత్తం చేశాం. ఇండ్లు కూలినా, వరదలో మునిగినా వారిని ఇతర ప్రాంతాలకు తరలించేందుకు అనువైన ప్రదేశాలు గుర్తించి పెడుతున్నారు. ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా రెవెన్యూ, పోలీస్ యంత్రాంగం చర్యలు తీసుకుంటున్నది. వర్షాలు ఎక్కువగా ఉన్న గ్రామాలకు ముందుగానే రేషన్ బియ్యం చేరవేస్తున్నాం.
కలెక్టర్ : వర్షాల కారణంగా కొన్ని పట్టణాలు, గ్రామాల్లోని లోతట్టు ప్రాంతాలు, కాలనీల్లోకి వర్షం నీరు వచ్చి చేరుతున్న విషయం నిజమే. వారిని ఆదుకునేలా చర్యలు చేపడుతున్నాం. చెరువులు, కుంటలు, కాల్వలు అన్యాక్రాంతం కావడంతో సహజ పద్ధతిలో వర్షం నీళ్లు బయటకు వెళ్లకుండా కాలనీల్లోకి వస్తున్నాయి. జహీరాబాద్లో వసంత్ విహార్ కాలనీని స్వయంగా సందర్శించా. అక్కడ కాల్వ నుంచి నీళ్లు వెళ్లకుండా చేశారు. ఈ విషయంలో వెంటనే సమస్యను పరిష్కరించడంతో పాటు ఆక్రమణలకు బాధ్యులైన వారిని గుర్తించి చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించాం.
కలెక్టర్ : వర్షాలు భారీగా కురుస్తున్నందున సీజనల్ వ్యాధులు ప్రబలకుండా చర్యలు తీసుకుంటున్నాం. గ్రామాలు, మున్సిపాలిటీల్లో వందశాతం పారిశుధ్య పనులు నిర్వహించేలా అధికారులను ఆదేశించాం. రోజూ డ్రైనేజీలు శుభ్రం చేయాలని చెప్పాం. బ్లీచింగ్ పౌడర్ అందుబాటులో ఉంచాం. పంచాయతీ, మున్సిపల్ అధికారులు పారిశుధ్య విషయంలో అజాగ్రత్త వహిస్తే చర్యలు తప్పవు. ప్రజలు వ్యక్తిగత పరిశుభ్రతతో పాటు, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి. వేడి వేడి ఆహారం స్వీకరించాలి. కాచివడబోసిన నీళ్లు తాగాలి.
కలెక్టర్ : జిల్లాలోని చెరువులు, కుంటలు వర్షాలతో నిండుతున్నాయి. చాలా చెరువులు అలుగు పారుతున్నాయి. ఇరిగేషన్ అధికారులను అప్రమత్తం చేశాం. ఎక్కడైనా చెరువులకు గండ్లు పడితే వెంటనే పూడ్చేలా ఇరిగేషన్ శాఖ చర్యలు తీసుకుంటున్నది. మండలాల్లోని ఇరిగేషన్ అధికారులు ప్రతి చెరువును తనిఖీ చేసి రిపోర్టు ఇవ్వాలని ఆదేశించాం.
కలెక్టర్ : వర్షాల నేపథ్యంలో వైద్య ఆరోగ్యశాఖ అధికారులతో ప్రత్యేకంగా సమావేశం నిర్వహించి అప్రమత్తం చేశాం. సీజనల్ వ్యాధులు ప్రబలకుండా ఉండేందుకు 285 ప్రత్యేక వైద్య బృందాలు ఏర్పాటు చేశాం. ఈ బృందాలు గ్రామాల్లో పర్యటించి సీజనల్ వ్యాధులపై ప్రజలకు అవగాహన కల్పిస్తారు. డీఎంహెచ్వో కార్యాలయంలో ప్రత్యేకంగా కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశాం. వైద్య విధాన పరిషత్ దవాఖానలు, పీహెచ్సీల్లో వైద్యులను అందుబాటులో ఉంచాం. వైద్య సేవలు అందిచేందుకు, అవసరమైన మందులు అందుబాటులో ఉన్నాయి.
కలెక్టర్ : వర్షాలతో ప్రజా రవాణాకు ఎక్కడా ఆటంకం కలగడంలేదు. ప్రజలు ఇబ్బందులు పడకుండా సకాలంలో ఆర్టీసీ బస్సులు నడిచేలా చర్యలు తీసుకుంటున్నాం. వర్షాలతో అక్కడక్కడా కొంత మేర రోడ్లు దెబ్బతిన్నట్లు అధికారులు చెబుతున్నారు. వర్షాలు ఆగిన తర్వాత వాటి మరమ్మతుకు చర్యలు తీసుకుంటాం.
కలెక్టర్ : జిల్లాలో వర్షాల నేపథ్యంలో విద్యుత్శాఖ ను అప్రమత్తం చేశాం. వైర్లు, ఒరిగిన స్తంభాలు ఉంటే గుర్తించి వెంటనే బాగు చేయాలని ట్రాన్స్కో ఎస్ఈని ఆదేశించాం.