సంగారెడ్డి జిల్లాలో ధాన్యం కొనుగోళ్లు వేగంగా పూర్తి చేయాలని కలెక్టర్ డాక్టర్ శరత్ అధికారులను ఆదేశించారు. ధాన్యం కొనుగోళ్లపై బుధవారం కలెక్టరేట్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ధాన్యం కొనుగోళ్లలో నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదన్నారు. ధాన్యం లారీలు ఖాళీ చేయకుండా జాప్యం చేస్తున్న రైస్మిల్లర్లు, కాంట్రాక్టర్లపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈనెల 2 నుంచి 22 వరకు జరిగే దశాబ్ది ఉత్సవాలకు ఏర్పాట్లు పూర్తి చేయాలని ఆదేశించారు. రైతు వేదికల అలంకరణ, దశాబ్ది ఉత్సవాల లోగో, ప్రభుత్వ పథకాల ప్రదర్శన, గీతాలాపన చేయాలని సూచించారు. నాటి-నేటి ప్రగతిని వివరించేలా ఏర్పాట్లు చేయాలన్నారు.
సంగారెడ్డి కలెక్టరేట్, మే 31: సంగారెడ్డి జిల్లాలో ధాన్యం కొనుగోళ్లు వేగంగా పూర్తి చేయాలని కలెక్టర్ డాక్టర్ శరత్, అధికారులు, డీలర్లను ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్ నుంచి ధాన్యం కొనుగోళ్లపై వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రోజూ 50 లారీలకు తగ్గకుండా కొనుగోలు కేంద్రాలకు పంపాలన్నారు. రైస్ మిల్లుల వద్ద లారీల నుంచి ధాన్యం ఖాళీ చేయకుండా జాప్యం చేస్తున్న మిల్లర్లపై, రవాణా కాంట్రాక్టర్లపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ధాన్యాన్ని వెంటనే ఖాళీ చేయించాలని కేంద్రాల సూపర్వైజర్లను ఆదేశించారు. ధాన్యం కొనుగోళ్లలో ఎక్కడ నిర్లక్ష్యం వహించినా సహించేది లేదని స్పష్టంచేశారు.
అన్నపూర్ణ నినాదం వినిపించాలి
దశాబ్ది ఉత్సవాలకు సంబంధించిన ఏర్పాట్లపై కలెక్టర్ సమీక్షించారు. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు తెలంగాణ దేశానికే అన్నపూర్ణ అనే నినాదం వినిపించాలన్నారు. రైతు వేదికల అలంకరణ, దశాబ్ది ఉత్సవాల లోగో ఏర్పాటు, ప్రభుత్వ పథకాల ప్రదర్శన, గీతాలాపనలు ఉండాలని వివరించారు. రైతు దినోత్సవానికి రైతులు భారీగా తరలివచ్చేలా కృషి చేయాలన్నారు. రైతులకు ముందస్తు వరి సాగు గురించి అవగాహన కల్పించాలన్నారు. నాడు, నేడు జరిగిన ప్రగతిని వివరించాలన్నారు.
రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల ఏర్పాట్లలో లోటుపాట్లు లేకుండా చూడాలని నియోజకవర్గ ప్రత్యేక అధికారులు, సూపర్వైజర్లకు సూచించారు. ఈ నెల 2 నుంచి 22 వరకు జరిగే ఉత్సవాల ఏర్పాట్లు త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించారు. నియోజకవర్గం వారీగా ప్రభుత్వ పథకాల లబ్ధిదారుల వివరాలు అందజేయాలన్నారు. వేడుకలకు ఫంక్షన్ హాల్స్ ఏర్పాటు చేసుకోవాలని, అవసరమైన వసతులు కల్పించాలని సూచించారు. కాన్ఫరెన్స్లో అదనపు కలెక్టర్ వీరారెడ్డి, జడ్పీ సీఈవో ఎల్లయ్య, వ్యవసాయ శాఖ జేడీ నర్సింహరావు, డీఎం అండ్ హెచ్వో డాక్టర్ గాయత్రీ దేవి, సివిల్ సైప్లె డీఏం సుగుణబాయి, ప్రత్యేకాధికారులు, రెవెన్యూ అధికారులు పాల్గొన్నారు.