సంగారెడ్డి కలెక్టరేట్, ఫిబ్రవరి 20: ప్రజావాణి సమస్యలను త్వరితగతిన పరిష్కరించేందుకు కృషి చేయాలని సంగారెడ్డి జిల్లా కలెక్టర్ డాక్టర్ శరత్ అధికారులకు సూచించారు. ప్రజా సమస్యలను పరిష్కరించేందుకు ప్రతి వారం నిర్వహించే ప్రజావాణికి సోమవారం 29 అర్జీలు అందాయి. ఆయా అర్జీలను కలెక్టర్ స్వీకరించారు. ఇందులో 12 అర్జీలు రెవెన్యూ శాఖకు సంబంధించినవి కాగా, మిగతా శాఖలకు చెందిన 17 అర్జీలను సంబంధిత శాఖల అధికారులకు పంపిస్తూ వాటిని పరిష్కరించాలని కలెక్టర్ సూచించారు. ప్రజావాణిలో ప్రజలు తమ సమస్యల పరిష్కారం కోసం పెట్టుకున్న అర్జీలను పరిశీలించి వెంటనే పరిష్కరించాలన్నారు. సమస్యల పరిష్కారంలో జాప్యం చేయడం సరికాదన్నారు.
అన్ని శాఖల అధికారులు ప్రజావాణిలో తమ శాఖకు సంబంధించి వచ్చిన అర్జీలు, పరిష్కరించినవి, పెండింగ్లో ఉన్న వివరాలను సంబంధిత రిజిష్టర్లలో అప్డేట్ చేయాలని సూచించారు. ప్రజావాణికి సంబంధించి నిర్దేశించిన రిజిష్టర్లను తప్పనిసరిగా నిర్వహించాలని కలెక్టర్ స్పష్టం చేశారు. కార్యక్రమంలో నారాయణఖేడ్, సంగారెడ్డి ఆర్డీవోలు, కలెక్టరేట్ ఏవో, ఆయా శాఖల అధికారులు పాల్గొన్నారు.
ఎస్సీ కమ్యూనిటీ హాల్ నిర్మించాలని ప్రజావాణిలో వినతి
బొల్లారం, ఫిబ్రవరి 20: మున్సిపల్ పరిధిలోని ఎస్సీ కాలనీలో నూతనంగా ఎస్సీ కమ్యూనిటీ హాల్ నిర్మించాలని కోరుతూ కాలనీ యువకులు ప్రజావాణిలో వినతి సమర్పించారు. బొల్లారానికి చెందిన ఎస్సీ కాలనీ యువకులు కలెక్టరేట్లో సోమవారం ప్రజావాణి కార్యక్రమానికి తరలివెళ్లారు. కాలనీలో ఎస్సీ కమ్యూనిటీ హాల్ నిర్మించాలని ఆర్డీవో మెంచు నగేశ్కు కలిసి వినతిపత్రాన్ని అందజేశారు.
కాలనీలో ఇదివరకే ఉన్న కమ్యూనిటీ హాల్లో బస్తీ దవఖానకు కేటాయించారని, దీంతో కమ్యూనిటీ హాల్ లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని వాపోయారు. మున్సిపల్ అధికారులు తలవారి శ్మశానవాటిక ప్రాంతంలో కమ్యూనిటీ హాల్ను నిర్మించేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు వివరించారు. అక్కడ కమ్యూనిటీ హాల్ నిర్మిస్తే రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు తలెత్తుతాయని మరోచోట ఒక ఎకరం స్థలం కేటాయించి కమ్యూనిటీ హాల్ నిర్మించాలని అధికారులకు కాలనీవాసులు విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో కాలనీవాసులు జీతయ్య, అమృత, మంజుల, దుర్గమ్మ, సంతోష్ తదితరులు పాల్గొన్నారు.