సంగారెడ్డి కలెక్టరేట్, మే 20: సీఎం కప్ జిల్లా స్థాయి క్రీడలను ఘనంగా నిర్వహించాలని సంగారెడ్డి కలెక్టర్ డాక్టర్ శరత్ సంబంధిత అధికారులను ఆదేశించారు. శనివారం కలెక్టరేట్ నుంచి నిర్వహించిన టెలీ కాన్ఫరెన్స్లో కలెక్టర్ మాట్లాడుతూ ఈ నెల 22 నుంచి 24 వరకు జిల్లా స్థాయి సీఎం కప్ క్రీడలు నిర్వహించనున్నట్లు వెల్లడించారు. స్థానిక అంబేద్కర్ మైదానంలో నిర్వహించనున్న ఈ క్రీడలకు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ, ఆర్థిక శాఖల మంత్రి తన్నీరు హరీశ్రావు ముఖ్యఅతిథిగా హాజరై క్రీడలను ప్రారంభిస్తారని తెలిపారు. ఈ నెల 22న ఉదయం 9 గంటలకు క్రీడలు ప్రారంభమవుతాయన్నారు.
మండల స్థాయిలో నిర్వహించిన క్రీడా పోటీల్లో ఎంపికైన 87 బృందాల నుంచి 1,119 మంది క్రీడాకారులు జిల్లా స్థాయి క్రీడలలో పాల్గొననున్నట్లు వివరించారు. కబడ్డీలో 343 మంది, వాలీబాల్ 347, అథ్లెటిక్స్ 108, ఖోఖో 267, ఫుట్బాల్లో 54 మంది క్రీడాకారులు జిల్లా స్థాయిలో పోటీ పడనున్నట్లు కలెక్టర్ వివరించారు. అనంతరం స్థానిక అంబేద్కర్ మైదానాన్ని సందర్శించిన కలెక్టర్ అక్కడ పలు సూచనలు, సలహాలు చేశారు. ఈ టెలీ కాన్ఫరెన్స్లో జిలా అదనపు కలెక్టర్ వీరారెడ్డి, క్రీడాధికారి రాంచందర్రావు, ఆయా కమిటీల అధికారులు, జిల్లా విద్యాధికారి, డీపీవో, మున్సిపల్ కమీషనర్, జడ్పీ సీఈవో తదితరులు పాల్గొన్నారు.