జనగామ/ చేర్యాల, సెప్టెంబర్ 16 (నమస్తే తెలంగాణ) : జనగామ నియోజకవర్గ అభివృద్ధికి ప్రత్యేక నిధులు ఇవ్వాలని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీభివృద్ధిశాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు, జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి గురువారం సాయంత్రం ప్రగతి భవన్లో ముఖ్యమంత్రి కేసీఆర్ను కలిసి విజ్ఞప్తి చేశారు. ఢిల్లీ నుంచి తిరిగి వచ్చిన తర్వాత కేసీఆర్తో భేటీ అయిన మంత్రి, ఎమ్మెల్యే జనగామ, చేర్యాల పట్టణ, గ్రామీణ ప్రాంతానికి సంబంధించిన వివిధ అంశాలను ప్రస్తావించారు. ప్రధానంగా ఇటీవలి భారీ వర్షాలకు దెబ్బతిన్న జనగామ పట్టణ రోడ్లు సహా నియోకవర్గ వ్యాప్తంగా పాడైన రహదారుల మరమ్మతులకు తక్షణం నిధులు ఇవ్వాలని కోరారు. దేవాదుల రిజర్వాయర్ల కింద ఉన్న 230 చెరువులకు గోదావరి జలాలు నింపడం సహా మెట్ట ప్రాంత పొలాలు, చెలుకలకు నీటి అందించేందుకు కాలువల నిర్మాణానికి అవసరమయ్యే రూ.20 కోట్ల నిధులు ఇవ్వాలని కోరారు. దీనికి స్పందించిన సీఎం ప్రతిపాదనలు సిద్ధం చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. జనగామ చౌరస్తా నుంచి కొత్తగా నిర్మాణం పూర్తయిన సమీకృత కార్యాలయం వరకు అప్రోచ్ రోడ్డుకు నిధులు ఇవ్వడంతో పాటు కొత్త కలెక్టరేట్ ప్రారంభోత్సవానికి రావాలని సీఎం కేసీఆర్ను మంత్రి, ఎమ్మెల్యే ఆహ్వానించారు. మున్సిపల్ పరిధిలో రూ.130 కోట్లతో ప్రతిపాదించిన అండర్ డ్రైనేజీ నిర్మాణానికి కేంద్రం నుంచి నిధులు విడుదలయ్యేలా ఒత్తిడి తేవాలని కోరగా, ఢిల్లీ పర్యటన సందర్భంగా సంబంధిత కేంద్ర మంత్రి దృష్టికి తెచ్చానని, మరోసారి కలిసి కోరితే నిధులు వీలైనంత త్వరగా ఇచ్చే అవకాశం ఉందని కేసీఆర్ ఆశాభావం వ్యక్తం చేసినట్లు ఎమ్మెల్యే ముత్తిరెడ్డి తెలిపారు. వర్షాలకు గుంతలు పడిన గ్రామీణ రోడ్ల మరమ్మతులకు నిధులు మంజూరు చేయాలని పంచాయతీరాజ్ మంత్రి ఎర్రబెల్లిని సీఎం ఆదేశించారని చెప్పారు. చేర్యాల రోడ్లు, చేర్యాట పట్టణాభివృద్ధికి తగిన నిధులు ఇవ్వాలని సీఎంకు విజ్ఞప్తి చేసినట్లు ముత్తిరెడ్డి తెలిపారు.