ఝరాసంగం, జూలై 13: పల్లె ప్రగతి, ఏడోవిడుత హరితహార కార్యక్రమంలో భాగంగా మంగళవారం మండల పరిధిలోని దేవరంపల్లి గ్రామంలో గ్రామ సర్పంచ్ శశికళశ్యాం, ఆయా గ్రామాల ప్రత్యేక అధికారులతో పాటు ఎంపీడీవో సుజాతతో కలిసి గ్రామంలో పలు వార్డులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గ్రామం పరిశుభ్రంగా ఉండాలంటే గ్రామస్తులందరూ కలిసి కట్టుగా ఉండాలన్నారు. గ్రామాలు పరిశుభ్రంగా చేసేందుకు ప్రభుత్వం 10 రోజులపాటుగా పల్లె ప్రగతి, హరితహారం కార్యక్రమం ప్రవేశపెట్టిందన్నారు. గ్రామం లో వైకుంఠధామం, పల్లె ప్రకృతి వనం, డంపింగ్యార్డ్, నర్సరీలో పలు రకాల మొక్కల పెంపకం, గ్రామ సమీపంలో రోడ్డుకు ఇరువైపులా మొక్కలు నాటడం వంటి కార్యక్రమాలు ఏర్పాటు చేసిందన్నారు. గ్రామస్తులందరూ ఐక్యంగా ఉండి గ్రామాభివృద్ధికి సహకరించాలన్నారు. గ్రామ శివారులో పొలం గట్లపై ప్రజా ప్రతి నిధు లు, మహిళా సంఘాల సభ్యులు, ఉపాధిహామీ కూలీలు కలిసి మొక్కలు నాటి సంరక్షించాలన్నారు. ప్రతి ఒక్కరూ ఇంటి ఆవరణలో మొక్కలు నాటి సంరక్షించినప్పుడే గ్రామాలు పచ్చదనంతో ఆహ్లాదకరంగా మారుతాయన్నారు. కార్యక్రమంలో ఆయా గ్రామాల ప్రత్యేక అధికారులు మారుతివిఠోభ, బాలకృష్ణ, ఎంపీవో లక్ష్మయ్య, సీసీ యాదగిరి, పంచాయతీ కార్యదర్శులు,రవి, తిరుపతి, ఆనందం, కాంచన, లక్ష్మి, కృష్ణ, సంపత్, నవీన్, మహేశ్ పాల్గొన్నారు.
ఇంటింటికీ ఆరు మొక్కలు పంపిణీ
హరితహారంలో భాగంగా అందోల్-జోగిపేట మున్సిపల్ పరిధిలో అధికారులు, ప్రజాప్రతినిధులు ప్రతి ఇంటికీ ఆరు మొక్కలు పంపిణీ చేసి వాటిని నాటి సంరక్షించాలని సూచిస్తున్నారు. కార్యక్రమంలో భాగంగా మంగళవారం మున్సిపల్ వైస్ చైర్మన్ ప్రవీణ్, కౌన్సిలర్ భవాణినాగరత్నంగౌడ్ వారి వార్డుల్లో మహిళలకు గులాబీ మొక్కలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వాతావారణంలో వాయుకాలుష్యం తగ్గి మానవాళికి స్వచ్ఛమైన గాలి అందాలంటే మొక్కలు నాటడం ఒక్కటే మార్గమన్నారు. వర్షాలు సమృద్ధిగా కురిసి..పంటలు బాగా పండాలంటే చెట్ల తోనే సాధ్యమని సీఎం కేసీఆర్ హరితహారం కార్యక్రమాన్ని తలపెట్టారని, ఇందులో అందరూ భాగస్వాములై పెద్ద ఎత్తున మొక్కలు నాటాలని పిలుపునిచ్చారు.
ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలి
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసే హరితహారం కార్యాక్రమాన్ని ప్రతి ఒక్కరూ పాల్గొని విజయవంతం చేయాలని మండల ఉపాధిహామీ అధికారి విష్ణువర్దన్ అన్నారు. మంగళవారం మండల పరిధిలోని నాగన్పల్లి గ్రామంలో ఎంపీడీవో వెంకటేశం ఆదేశాల మేరకు రోడ్డుకు ఇరువైపులా హరితహారంలో మొక్కలు నాటామన్నారు. ఈ సందర్భంగ విష్ణువర్దన్ మాట్లాడుతూ 10 రోజులుగా నిర్వహించిన పల్లె ప్రగతిలో మిగిలి పోయిన పనులను వేగవంతంగా పూర్తి చేయాలని సిబ్బందికి సూచించారు. గ్రామంలో నెలకొన్న సమస్యలను వారం రోజుల్లో పరిష్కరిస్తామన్నారు. గ్రామస్తుల సహకారంతో హరితహారంలో పత్రి ఒక్కరికీ 6 మొక్కల చొప్పున నాటిస్తామన్నారు. సమావేశంలో సర్పంచ్ మహిపాల్రెడ్డి,టీఏలు సురేష్, తుక్కప్ప, మురాలి, పంచాయతీ కార్యదర్శి యాదుల్లా ఉన్నారు.