సంగారెడ్డి కలెక్టరేట్ ఆగస్టు 12 : జిల్లాలో స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించాలని, అందు కు అవసరమైన ఏర్పాట్లు పూర్తి చేయాలని సంగారెడ్డి జిల్లా అదనపు కలెక్టర్ వీరారెడ్డి సంబంధిత అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలపై జిల్లా అధికారులతో ఆయన సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వీరారెడ్డి మాట్లాడుతూ ఈ సారి వేడుకలకు శాసన మండలి ప్రొటెం స్పీకర్ భూపాల్రెడ్డి ముఖ్య అతిథిగా హాజరు కానున్నారని తెలిపారు. అధికారులు ఏర్పాట్లతో సిద్ధంగా ఉండాలన్నారు. కొవిడ్ నిబంధనలకు అనుగుణంగా వేడుకలను నిర్వహించనున్నామని ఆయన స్పష్టం చేశారు. గౌరవ వందనంతో పాటు, పోలీసు బందోబస్తుపై సంబంధిత అధికారులకు దిశా నిర్దేశం చేశారు. రోడ్ల వెంట ముండ్ల పొదలను తొలిగించాలని మున్సిపల్ కమిషనర్కు సూచించారు. ముఖ్య అతిథికి జిల్లాలో జరుగుతున్న అభివృద్ధి పనులపై ప్రసంగం రూపొందించాలని ఆయన స్పష్టం చేశారు. అన్ని శాఖల అధికారులు తమకు అప్పగించిన పనులను పూర్తి చేసేలా సిద్ధంగా ఉండాలన్నారు. స్టాల్స్ ఏర్పాటు చేయడానికి ఆయా శాఖలు సిద్ధం చేయాలన్నారు. అధికారులందరూ సమన్వయంతో పనిచేసి స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను జయప్రదం చేయాలని ఆయన కోరారు. ఈ సమావేశంలో ఆయా శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.