విద్య, ఉద్యోగం, ఉపాధి, ఇతరత్రా అవసరాల నిమిత్తం ఎక్కడెక్కడో ఉంటున్న వారంతా దసరా పండుగకు సొంతూర్లకు వెళ్తుంటారు. వీరికోసం ఆర్టీసీ ప్రత్యేక బస్సులు నడిపేందుకు ఏర్పాట్లు చేసింది. ఉమ్మడి మెదక్ జిల్లా ఆర్టీసీ రీజియన్ నుంచి 270 బస్సులు నడుపుతామని ఆర్టీసీ అధికారులు తెలిపారు. ఇందులో 211 బస్సులు హైదరాబాద్ నుంచి వివిధ ప్రాంతాలకు, మిగతా 59 బస్సులను ఆంధ్రాలోని ముఖ్యమైన ప్రాంతాలకు నడుపుతారు. 20 నుంచి 30 మంది సిద్ధంగా ఉంటే నేరుగా కాలనీలు, హాస్టళ్ల వద్దకు వచ్చి ప్రత్యేకంగా బస్సులో గమ్యస్థానాలకు చేరుస్తామని ఆర్టీసీ అధికారులు తెలిపారు.
సంగారెడ్డి, అక్టోబరు 5 : దసరా పండుగకు ఆర్టీసీ ప్రత్యేక బస్సులు నడిపేందుకు ఏర్పాట్లు చేస్తున్నది. విద్య, ఉద్యోగం, ఉపాధి ఇతరత్రా కారణాలతో ఇతర ప్రాంతాల్లో స్థిరపడిన వారు దసరా పండుగకు సొంతూళ్లకు వెళ్తుంటారు. వారికోసం రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ అధికారులు ఉమ్మడి మెదక్ జిల్లా ఆర్టీసీ రీజియన్ నుంచి 270 బస్సులు నడిపేందుకు ఏర్పాట్లు చేశారు. ఇందులో 211 బస్సులు హైదరాబాద్ నుంచి వివిధ ప్రాంతాలకు, మిగతా 59 బస్సులను ఆంధ్రాలోని పలు ముఖ్యమైన ప్రాంతాలకు నడిపించేందుకు ఆర్టీసీ అధికారులు ఏర్పాట్లు చేశారు. ఉమ్మడి మెదక్ జిల్లా నుంచి కాలనీలు, హాస్టళ్లలో వసతి పొందుతున్న ప్రజలు, విద్యార్థుల కోసం వారు తెలిపిన ప్రాంతాలకు ప్రత్యేక బస్సులు నడిపించేందుకు బస్సులు సిద్ధ్దంగా ఉన్నాయని అధికారులు తెలిపారు. ఉమ్మడి మెదక్ జిల్లా పరిధిలో 8 ఆర్టీసీ డిపోల నుంచి దూర ప్రాంతాలకు బస్సులు నడుపుతూ ప్రయాణికులను క్షేమంగా గమ్యస్థానాలకు చేర్చుతున్నారు. 2020లో కరోనా సమయంలోనూ ఆర్టీసీ ప్రత్యేక బస్సులు నడిపి సంస్థకు కొంతమేర ఆదాయం వచ్చేలా చర్యలు తీసుకున్నది. ప్రస్తుతం కరోనా కట్టడి కావడం, కేసులు తక్కువగా నమోదవుతుండడంతో ఆర్టీసీ ప్రయాణానికి ప్రయాణికులు ఎదురుచూస్తున్నారు.
సొంతూళ్లకు బస్సు ప్రయాణం..
ఈ నెల 8 నుంచి 15వ తేదీ వరకు మెదక్ ఆర్టీసీ రీజియన్లోని 8 డిపోల నుంచి 270 బస్సులు నిరంతరంగా తిరుగుతాయి. ప్రయాణికులను క్షేమంగా గమ్యస్థానాలకు చేర్చేందుకు రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ అధికారులు పకడ్బందీ చర్యలు చేపట్టారు. దూర ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులు సంతోషంగా, క్షేమంగా గమ్యస్థానాలకు చేర్చడమే లక్ష్యంగా ఆర్టీసీ అధికారులు ప్రణాళిక సిద్ధం చేశారు.
రీజియన్ నుంచి దూర ప్రాంతాలకు నడిచే బస్సులు..
మెదక్ ఆర్టీసీ రీజియన్లోని 7 డిపోల నుంచి ఇప్పటికే ఆంధ్రా రాష్ట్రంలోని ప్రధాన పట్టణాలు, సందర్శన కేంద్రాలకు 20 వరకు బస్సులు నడిపిస్తున్నారు. సంగారెడ్డి డిపో నుంచి తిరుపతి, వైజాగ్, విజయవాడ, నెల్లూరుకు రోజు వారీగా బస్సులు నడిపిస్తున్నారు. నారాయణఖేడ్ నుంచి కందుకూరు, చీరాలకు, జహీరాబాద్ నుంచి కాకినాడ, కందుకూరు, నెల్లూరు, బెంగళూరుకు బస్సులు నడుపుతున్నారు. మెదక్ నుంచి అమలాపురం, కాకినాడ, తిరుపతికి, గజ్వేల్-ప్రజ్ఞాపూర్ నుంచి విజయవాడకు, సిద్దిపేట నుంచి తిరుపతి, బెంగళూరుకు, హుస్నాబాద్ డిపో నుంచి విజయవాడ పుణ్యక్షేత్రం సందర్శనకు బస్సులు నడుపుతున్నారు. ఇప్పటి వరకు ప్రత్యేక బస్సులు నడిపేందుకు 184 బస్సులను పలు ప్రాంతాలకు కేటాయిస్తున్నట్లు అధికారులు తెలిపారు.
ప్రయాణికుల క్షేమమే ఆర్టీసీ లక్ష్యం…
దసరా పండుగకు మెదక్ ఆర్టీసీ రీజియన్ నుంచి ప్రయాణికులను క్షేమంగా వారి గమ్యస్థానాలకు చేర్చేందుకు బస్సులు నడుపుతున్నాం. ప్రత్యేకంగా కాలనీలు నుంచి 25-30 మంది ప్రయాణికులు తమను సంప్రదిస్తే వారికి అదనంగా బస్సు ఏర్పాటు చేసి గమ్యస్థానానికి చేరుస్తాం. హాస్టళ్లలో ఉంటున్న విద్యార్థులు తమ సొంతూళ్లకు వెళ్లడానికి బస్సుకోసం సమాచారం ఇస్తే వారికి కూడా ఏర్పాటు చేసి గమ్యస్థానాలకు సురక్షితంగా చేర్చుతాం. ప్రైవేట్ ప్రయాణం చేసి ప్రమాదం కొని తెచ్చుకోవడం కన్నా సురక్షితమైన ఆర్టీసీ సేవలను సద్వినియోగం చేసుకోవాలి.