గజ్వేల్ స్టేషన్లో తొలుత పూజలు
కొడకండ్ల వరకు ట్రాలీపై వెళ్తూ ట్రాక్, బ్రిడ్జిల నిర్మాణం, సౌకర్యాల పరిశీలన
క్షుణ్ణంగా పరిశీలించిన అధికారులు
గజ్వేల్, ఫిబ్రవరి 11: మనోహరాబాద్-కొత్తపల్లి రైల్వేమార్గం నిర్మాణంలో భాగంగా కొడకండ్ల వరకు నిర్మించిన రైల్వేలైన్ను శుక్రవారం రైల్వే సేఫ్టీ కమిషనర్ అభయ్కుమార్ రాయ్ అధికారులతో కలిసి పరిశీలించారు. మెదక్ జిల్లా మనోహరాబాద్ నుంచి సిద్దిపేట జిల్లా గజ్వేల్ వరకు 33 కిలోమీటర్ల రైలు మార్గాన్ని గతంలోనే సేఫ్టీ కమిషనర్ పరిశీలించారు. శుక్రవారం గజ్వేల్ రైల్వేస్టేషన్లోని సిగ్నల్స్ వ్యవస్థ, రైల్వేలైన్, మౌలిక వసతులు పరిశీలించారు. అనంతరం గజ్వేల్ రైల్వేస్టేషన్లో, కొడకండ్ల వైపు ప్రయాణానికి సిద్ధంగా ఉన్న రైలు వద్ద పూజలు నిర్వహించారు. అనంతరం సేఫ్టీ కమిషనర్ ట్రాలీలపై డీఆర్ఎం శరత్చంద్ర, డిప్యూటీ చీఫ్ ఇంజినీర్ సహధర్మ దేవరాయ, చీఫ్ ఇంజినీర్ కలబందే, చీఫ్ సిగ్నల్ టెలీ కమ్యూనికేషన్ ఇంజినీర్ లక్ష్మణ్తో కలిసి కొడకండ్ల రైల్వేలైన్ మార్గాన్ని, బ్రిడ్జిలను, రైల్వేగేట్లను క్షుణ్ణంగా పరిశీలించారు. ఉదయం 11 గంటలకు ప్రారంభమైన రైల్వే సేఫ్టీ తనిఖీలు సాయంత్రం 5.30 గంటల వరకు కొనసాగాయి. అధికారులు రైల్వేట్రాక్పై ట్రాలీలో వెళ్లి, కొడకండ్లకు చేరుకున్న తర్వాత అధికారులంతా తిరిగి రైలులోనే గజ్వేల్కు చేరుకున్నారు. పరిశీలన పూర్తయిన తర్వాత మనోహరాబాద్ మీదుగా సికింద్రాబాద్ వెళ్లారు.
సంతోషం వ్యక్తం చేసిన ప్రజలు…
గజ్వేల్ రైల్వేస్టేషన్లో మరోసారి అధికారుల సందడి కనబడడంతో స్థానికులు చాలామంది స్టేషన్కు తరలివచ్చారు. గజ్వేల్ నుంచి కొడకండ్ల వెళ్లే మార్గంలోనూ రైలును ప్రజలు ఆసక్తిగా తిలకించారు. రెండేండ్ల క్రితమే గజ్వేల్ స్టేషన్ నిర్మాణం పూర్తికావడం, సేఫ్టీ పరిశీలన జరిగినా, రైలు ప్రయాణం అందుబాటులోకి రాకపోవడంతో ప్రజలు నిరాశ చెందారు. శుక్రవారం గజ్వేల్ రైల్వేస్టేషన్ పూర్తి సామగ్రి, అధికారులతో నిండిపోయి కనబడడంతో అందరూ సంతోషం వ్యక్తం చేశారు. కొడకండ్ల వరకు రైల్వే లైన్ పూర్తి కావడంతో త్వరలో గజ్వేల్ స్టేషన్ నుంచి రైళ్లు ప్రారంభమవుతాయని సంతోషం వ్యక్తం చేశారు. గజ్వేల్ రైల్వేస్టేషన్ నుంచి రైల్వే సేవలు ప్రారంభమైతే మనోహరాబాద్, సికింద్రాబాద్తో పాటు దేశంలోని ముఖ్యనగరాలైన బెంగళూరు, చెన్నై, తిరుపతికి రైళ్లు నడిపే అవకాశం ఉందని గతంలోనే రైల్వే అధికారులు వెల్లడించారు.
మల్లన్నను దర్శిచుకున్న రైల్వే సేఫ్టీ కమిషనర్
కొమురవెల్లి, ఫిబ్రవరి 11: దక్షిణమధ్య రైల్వే సేఫ్టీ కమిషనర్ అభయ్కుమార్ రాయ్ శుక్రవారం కొమురవెల్లి మల్లన్నను దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం అర్చకులు ఆయనకు ఆలయ చరిత్ర వివరించి, స్వామివారి ప్రసాదం అందజేశారు. కార్యక్రమంలో శరత్ చంద్రయాన్, సీఈవో గోలే తదితరులున్నారు.
రైల్వే స్టేషన్ ఏర్పాటు చేయాలి..
గజ్వేల్ పట్టణంలో ట్రయల్న్ల్రో భాగంగా కొమురవెల్లికి వచ్చిన రైల్వే సేఫ్టీ కమిషనర్ అభయ్కుమార్ రాయ్ సర్పంచ్ సార్ల లతాకిష్టయ్య ఆధ్వర్యంలో పలువురు గ్రామస్తులు కొమురవెల్లిలో రైల్వే స్టేషన్ ఏర్పాటు చేయాలని వినతి ప్రతం అందజేశారు. ఈ విషయంపై కమిషనర్ సానుకూలంగా స్పందించారు. కార్యక్రమంలో ఉపసర్పంచ్ కొండ శ్రీధర్, గ్రామస్తులున్నారు.