దుబ్బాక/మిరుదొడ్డి, ఏప్రిల్13 : నమ్ముకున్న సిద్ధాంతం కోసం అడవి బాట పట్టిన మావోయిస్టు నేత రూపీ అలియాస్ భాగ్య ఎన్కౌంటర్లో మృతిచెందడం కుటుంబీకులను కన్నీరు పెట్టిస్తున్నది. ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని కాంకేర్ జిల్లాలో సోమవారం జరిగిన భారీ ఎన్కౌంటర్లో సిద్దిపేట జిల్లా మిరుదొడ్డి మండలం ధర్మారం గ్రామానికి మావోయిస్టు నేత రూపీ అలియాస్ భాగ్య మృతిచెందారు.
46 ఏండ్ల రూపీ 2002లో మావోయిస్టు పార్టీలో చేరారు. తొలుత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో, ఆ తర్వాత అబూజ్మడ్ ప్రాంతంలో పనిచేశారు. ఇటీవల సీఎం రేవంత్రెడ్డి సమక్షంలో జరిగిన మావోయిస్టు లొంగుబాట్ల సందర్భంగా తెలంగాణలో ఇంకా క్రియాశీలకంగా ఉన్న మావోయిస్టుల జాబితాను డీజీపీ విడుదల చేశారు. అందులో రూపీ అలియాస్ భాగ్య పేరు ఉంది.
ధర్మారం గ్రామానికి చెందిన రంగబోయిన ఎల్లవ్వ, నర్సయ్య దంపతులకు నలుగురు సంతానం కాగా, అందులో పెద్ద కూతురు భాగ్య అలియాస్ రూపీ, రెండో కూతురు కవిత, మూడో కూతురు మమత, కొడుకు కుమార్ ఉన్నారు. వీరిది పేద వ్యవసాయ కుటుంబం. వ్యవసాయంతో పాటు కూలీ పనులు చేస్తూ జీవించేవారు. పెద్ద కూతురైన భాగ్య తల్లిదండ్రులకు అండగా ఉంటూ వ్యవసాయ పనులతో పాటు మేకలు కాసేది. పేదరికం కారణంగా ఆమె విద్యనభ్యసించలేదు.
2002 సమయంలో పీపుల్స్వార్ పార్టీ కార్యక్రమాలు జోరుగా కొనసాగుతున్నా యి. గ్రామాల్లో పేదల కోసం పార్టీ నేతలు చేస్తున్న పోరాటం ఆమెను ఎంతగానో ఆకర్షించింది. 2002 లో నాటి పీపుల్స్వార్ దుబ్బాక దళ కమాండర్ మధు ఆధ్వర్యంలో ఆమె పార్టీలో చేరారు. అప్పటి నుంచి 24 ఏండ్లుగా అజ్ఞాతంలో ఉంటూ మావోయిస్టు పార్టీ కీలక నేతగా ఎదిగారు. తొమ్మిదేండ్ల కిందట భాగ్య తండ్రి నర్సయ్య మృతిచెందినా ఆమె గ్రామానికి రాలేదు. పార్టీలోకి వెళ్లినప్పటి నుంచి భాగ్య గ్రామానికి రాలేదు. గ్రామంలో భాగ్య తల్లి ఓ పెంకుటింట్లో తన కొడుకు కుమార్తో కలిసి నివసిస్తున్నది. కూలీ పనులు చేసుకుంటు వారు జీవిస్తున్నారు.
మావోయిస్టు నేత రంగబోయిన భాగ్య అలియాస్ రూపీని లొంగిపోవాలంటూ మీడియా ద్వారా ఆమె తల్లి ఎల్లవ్వ కన్నీటితో పలుమార్లు వేడుకుంది. భాగ్య మాత్రం సిద్ధాంతాలను నమ్ముకుని తుదిశ్వాస వరకు పోరుబాటలో కొనసాగింది. తన తల్లి ఎల్లవ్వ ఇటీవల మీడియా ద్వారా పంపించిన సందేశంలో …పానం శాతగాకుంటైంది. ఒంట్లో శక్తి లేక నొప్పులతో ఎముకులు గుడైనయ్ ..ఎప్పుడు సావోస్తదో తెల్వది. 24 యేండ్ల నుంచి నీకోసం కండ్లు కాయలు కాసేలా ఎదురు చూస్తున్నా.
తొమ్మిదేండ్ల కిదంట మీ నాయన నర్సయ్య చనిపోయినా నువ్వు రాలేదు. ఇప్పుడు నేను సచ్చిపోతో నువ్వు వస్తావో రావో తెల్వదు. నేను బతికుండగా నువ్వు ఎన్కౌంటర్లో సచ్చిపోయి వస్తావో, లొంగిపోయి పాణాలతో తిరిగి వస్తావో తెల్వదు బిడ్డా.. నువ్వు యాడున్నా పోలీసులకు లొంగిపోయి రా అంటూ తల్లి కోరింది. కడ సూపుకన్నా నోసుకుంటా అంటూ కన్నీరు పెట్టుకుంది. ఈ క్రమంలోనే ఎన్కౌంటర్లో రూపీ మృతి వార తెలియడంతో ఎల్లవ్వ గుండెలవిసేలా రోదించింది. ఆమె స్వగ్రామం ధర్మారంలో విషాదం అలుముకుంది.