పటాన్చెరు, ఫిబ్రవరి 15: సంగారెడ్డి కలెక్టర్ వల్లూరు క్రాంతి పరిశ్రమలను ఆకస్మిక తనిఖీ చేసి హడలెత్తించారు. వరుస తనిఖీలతో పారిశ్రామికవాడలోని రెడ్ కేటగిరి పరిశ్రమల యాజమాన్యాలు పరుగులు పెట్టాయి. ఫైర్సేఫ్టిపై కలెక్టర్ తనిఖీలు చేయడంతో అనేక పరిశ్రమల్లోని లోపాలు స్పష్టంగా కనిపించాయి. గురువారం పటాన్చెరు మండలం పాశమైలారం పారిశ్రామికవాడలో కలెక్టర్ వల్లూరు క్రాంతి పర్యటించారు. మంత్రి దామోదర రాజనర్సింహ ఆదేశాల మేరకు కాలిపోయిన సీఎంహెచ్ పరిశ్రమను, దాంతో పాటు వనమాలి పరిశ్రమను పరిశీలించి ప్రమాదం జరిగిన తీరును తెలుసుకున్నారు. సమగ్ర విచారణ చేసి నివేదికను ప్రభుత్వానికి సమర్పిస్తామని స్పష్టం చేశారు. అనంతరం ఎస్పీ రూపేశ్, పీసీబీ, పరిశ్రమల భద్రత, కార్మికశాఖ జిల్లా అధికారులతో కలిసి పలు పరిశ్రమలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. అనంతరం జిల్లా అధికారులతో ఐలా సమావేశమందిరంలో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పాశమైలారం పారిశ్రామికవాడలో రెండు రోజుల క్రితం జరిగిన అగ్నిప్రమాదం ఘటనపై సమగ్ర విచారణ చేపట్టి నివేదికను అందజేయాలని మంత్రి ఆదేశించారన్నారు.
జిల్లా అధికారులతో జరిపిన తనిఖీల్లో అనేక భద్రతా లోపాలున్నాయని, కొన్ని పరిశ్రమలు నిబంధనలు పాటించడం లేదని గుర్తించామన్నారు. ఆలాంటి పరిశ్రమలపై చర్యలు తీసుకోకపోవడంపై కలెక్టర్ సంబంధిత శాఖ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అగ్ని ప్రమాదం సంభవించినప్పుడు ప్రాణ, ఆస్తినష్టం జరుగుతుండటంపై విచారం వ్యక్తం చేశారు. టాస్క్ఫోర్స్ను ఏర్పాటు చేసుకుని ప్రమాదాల నివారణకు కృషి చేద్దామని సూచించారు. నిబంధనలను మరిచి పలు పరిశ్రమలు వ్యర్థాలను చెరువుల్లోకి వదులుతుండటంపై పీసీబీ అధికారులను ప్రశ్నించారు. పర్యావరణ సంరక్షణకు కృషి చేయాలని, ఇక మీదట వ్యర్థాలు కనిపిస్తే సంబంధిత పరిశ్రమలపై చర్యలుంటాయని హెచ్చరించారు. తాజాగా జరిగిన అగ్ని ప్రమాదం ఘటనలో రెండో రోజు మృతదేహాన్ని గుర్తించడంపై లేబర్ ఆఫీసర్ను నిలదీశారు. నిర్లక్ష్యంగా సమాధానం ఇచ్చినందుకు కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక మీదట అన్ని శాఖల అధికారులు పరిశ్రమలను నిరంతరం తనిఖీలు చేసి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. పెద్ద సమస్యలుంటే తన దృష్టికి తీసుకురావాలని, ప్రమాద రహిత పారిశ్రామికవాడలను ప్రోత్సహిద్దామన్నారు. కాలుష్యంపై గట్టి నజర్ పెడతామని, టాస్క్ఫోర్స్ ద్వారా భద్రత పెంచుతామన్నారు. ప్రమాదాలు జరుగకుండా ప్రణాళిక అమలు చేస్తామన్నారు. కార్యక్రమంలో డీఎస్పీ రవీందర్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
పటాన్చెరు, ఫిబ్రవరి 15: భద్రత విషయంలో నిర్లక్ష్యం వహించిన మూడు పరిశ్రమలపై కలెక్టర్ వల్లూరు క్రాంతి కొరడా ఝళిపించారు. పాశమైలారం పారిశ్రామికవాడలో సాల్యూబ్రియస్ లెబొరేటరీస్, వైటల్ సింథటిక్స్, వెంకర్ కెమికల్స్ పరిశ్రమల్లోను భద్రతా ప్రమాణాలు లేవని గుర్తించి, పరిశ్రమల మూసివేయాలని అధికారులకు ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో ఆర్డీవో రవీందర్రెడ్డి, పీసీబీ, కార్మిక శాఖ, పరిశ్రమల భద్రతా శాఖ అధికారుల బృందం మూడు పరిశ్రమలను సీజ్ చేశారు. మంగళవారం రాత్రి అగ్ని ప్రమాదం సంభవించిన పరిశ్రమలపై కేసులు నమోదు చేశారు.