వెల్దుర్తి, మార్చి 20: మెదక్ జిల్లా మాసాయిపేటలోని మరకత లింగ శివపంచాయతన రుక్మిణీ పాండురంగ స్వామి దేవాలయం భక్తుల పాలిట కొంగుబంగారంగా.. మరో పండరీపురంగా విరాజిల్లుతున్నది. మూడు శతాబ్దాల చరిత్ర గల ఈ ఆలయం కల్యాణార్థుల పాలిట కల్పతరువుగా, సంతానాన్ని ఇచ్చే ప్రదాత, కోరిన కోర్కెలు తీర్చే క్షేత్రంగా భక్తుల నమ్మకం. పాత దేవాలయం శిథిలావస్థకు చేరగా 2004లో దేవాలయాన్ని పునరుద్ధరించి మరకత లింగంతో పాటు రుక్మిణీ పాండురంగ స్వామి దేవతామూర్తులను పునఃప్రతిష్ఠ చేసి నిత్యం ధూపదీప నైవేద్యాలతో పూజాధికాలు నిర్వహిస్తున్నారు.
హరిద్రా నది(ప్రస్తుత హల్దీవాగు)కి సమీపంలో మాసాయిపేటలో ఉన్న రుక్మిణీ పాండురంగ స్వామి దేవాలయం 300ఏండ్ల ఘన చరిత్ర కలిగి ఉంది. నిత్యం పూజలందుకుంటూ దేదీప్యమానంగా వెలుగొందుతున్నది. అన్నదానం రాఘవులు అనే భక్తుడు ఆలయ పోషణకు కంకణం కట్టుకొని నిత్యం ధూపదీప నైవేద్యాలను అందించారు. తదనంతరం వేద బ్రాహ్మణుడు కాసుల రామచంద్రయ్య ఆలయ బాధ్యతలు స్వీకరించి నిత్యం పూజాధికాలు, ఏకాదశ రుద్రాభిషేకాలు నిర్వహించారు. తర్వాతి కాలంలో సన్యసించిన కాసుల రామచంద్రయ్య శ్రీయతివర అఖండానంద సరస్వతి స్వామీజీగా హల్దీవాగుకు అవతలి వైపు సీతారామచంద్ర ఆశ్రమాన్ని స్థాపించి, రామ సాక్షాత్కారం పొంది, సమాధి అయ్యారు. వారి వంశస్తుల ఆధ్వర్యంలో 2004లో ఆలయాన్ని పునర్నిర్మించి మరకత లింగ శివపంచాయతన ఆలయంలోని దేవతామూర్తులను పున:ప్రతిష్ఠ చేశారు. ఒకే గర్భాలయంలో హరిహరులు, పాండురంగడు, శివలింగం దర్శనమిచ్చే విశిష్ట ఆలయం మాసాయిపేట రుక్మిణీ పాండురంగస్వామి దేవాలయం.
రుక్మిణీ పాండురంగస్వామి దేవాలయం భక్తుల కోరిన కోర్కెలు తీర్చే కొంగు బంగారంగా వెలుగొందుతున్నది. పెళ్లి కాని వారు ఆలయంలో మొక్కుకొని వెళ్తే ఏడాదిలోపు వివాహాలు కావడం, సంతానం లేని వారు స్వామివారిని బుధ, శని వారాల్లో దర్శించుకుంటే సంతానం కలుగుతుందని భక్తుల విశ్వాసం. రాజకీయ నాయకులు, ప్రజాప్రతినిధులు ఈ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి, మొక్కుకొని వెళ్లి, ప్రచారాలు చేస్తే విజయం కలుగుతుందని నమ్ముతారు. ఉన్నత విద్య అభ్యసించాలన్నా, విదేశాలకు వెళ్లాలన్నా విద్యార్థులు పాండురంగ స్వామిని దర్శించుకుంటే తప్పక నెరవేరుతాయని నమ్మకం.
ఆలయం పునర్నిర్మించినప్పటి నుంచి ఏటా వార్షికోత్సవాన్ని వైభవంగా నిర్వహిస్తున్నారు. 20వ వార్షికోత్సవాన్ని గురువారం(నేడు) నిర్వహిస్తున్నట్లు ఆలయ నిర్వాహకులు హరిరంజన్ శర్మ తెలిపారు. ఈ ఉత్సవాల్లో భాగంగా ఉదయం స్వస్తివాచనం,అఖండ దీపస్థాపన, గణపతిపూజ, రుక్మిణీ పాండురంగ స్వామికి పురుషసూక్త, లక్ష్మీసూక్తాదులచే అభిషేకం, మరకత లింగానికి మహాన్యాస పూర్వక రుద్రాభిషేకం, కుంకుమార్చన, పూర్ణాహుతి, రుక్మిణీ పాండురంగస్వామి కల్యాణోత్సవం నిర్వహించనున్నట్లు తెలిపారు. భక్తులకు అన్నదానం ఉంటుందని తెలిపారు. భక్తులు హాజరై ఉత్సవాలను విజయవంతం చేయాలని ఆయన కోరారు.