మేడారం భక్తుల సౌకర్యానికి ఆర్టీసీ శ్రీకారం
సంగారెడ్డి, ఫిబ్రవరి 11: ఆర్టీసీ కార్గో సేవలు ప్రారంభించి పార్సిల్ సేవలతో ఆర్టీసీ తనకంటూ ఓ ముద్ర వేసుకున్నది. ప్రస్తుతం మెదక్ రీజియన్ నుంచి మేడారం సమ్మక్క-సారలమ్మ జాతరకు ప్రత్యేక బస్సులను వరంగల్ రీజియన్ను కేటాయించింది. కాగా, మేడారం వెళ్లలేని వారి కోసం మొక్కులు చెల్లించుకునే విధంగా ఆర్టీసీ కార్గో పార్సిల్స్ ద్వారా దేవాదాయ శాఖ మొక్కులు అమ్మవారికి సమర్పించుకొనే అవకాశం కల్పించింది.
ఇంటి నుంచే మొక్కులు…
మేడారంలో సమ్మక్క-సారక్క అమ్మవార్లకు మొక్కులు చెల్లిచేందుకు అక్కడకు వెళ్లలేని వారి కోసం ఈ అవకాశం ఆర్టీసీ కలిగిస్తున్నది. బంగారం పంపించడం ‘మీ వంతు-అమ్మ వారికి సమర్పించడం మా తంతు’ అనే నినాదంతో ఆర్టీసీ ఈ కొత్త సేవల్ని ప్రారంభిస్తున్నది. భక్తులు తాము చెల్లించాలకునే బంగారాన్ని పార్సిల్లో బుక్ చేస్తే చాలు ఆ మొక్కును నేరుగా అమ్మవార్లకు సమర్పించనున్నారు. సంస్థ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్, సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ సజ్జనార్ సూచనల మేరకు ఈ మహత్తర కార్యానికి శ్రీకారం చుట్టారని అధికారులు స్పష్టం చేశారు. బంగారాన్ని సమర్పించిన తరువాత ప్రసాదాన్ని కూడా తిరిగి అందించనున్నారు. రాష్ట్రంలోని అన్ని బస్స్టేషన్ల నుంచి ఈ సేవల్ని భక్తులు వినియోగించుకునే విధంగా తగిన కార్యాచరణను రూపొందించారు.
5 కిలోల బంగారం సమర్పణకు అవకాశం…
5 కేజీల వరకు బంగారం(బెల్లం)ను పంపించుకునే అవకాశం దేవాదాయశాఖ సహకారంతో అమ్మవార్లకు సమర్పించడంతో పాటు తిరిగి సంబంధిత భక్తులకు 200గ్రాముల ప్రసాదంతో పాటు పసుపు, కుంకుమలను అందజేయనున్నది. ఇందుకు 200 కిలోమీటర్ల వరకు రూ.400, ఆపై కిలోమీటర్లకు రూ.450 చార్జీలు ఆర్టీసీకి చెల్లించాలి. బంగారాన్ని బుక్ చేసిన చోటే ప్రసాదాన్ని తిరిగి పొందే అవకాశం కల్పించారు. ఇతర వివరాలకు టీఎస్ ఆర్టీసీ: 040-30102829, 040-68153333కు, https://www.tsrtc.telangana.gov.in ను సంప్రదించాలని మెదక్ రీజినల్ మేనేజర్ సుదర్శన్ పేర్కొన్నారు.