నర్సాపూర్, ఏప్రిల్ 24: ప్రభుత్వ మొండివైఖరి వీడి న్యాయమైన సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఆర్టీసీ కార్మికులు చేపట్టిన సమ్మె శుక్రవారం మూడో రోజుకు చేరుకున్నది. మెదక్ జిల్లా నర్సాపూర్లో ఆర్టీసీ కార్మికులు చిల్డ్రన్ పార్కు నుంచి ర్యాలీగా వెళ్లి స్థానిక బస్డిపో వద్ద ధర్నా చేశారు. అనంతరం బస్టాండ్ ఎదుట మృతిచెందిన ఆర్టీసీ డ్రైవర్ శంకర్గౌడ్ ఫ్లెక్సీకి పూలమాల వేసి నివాళులర్పించారు.
అంతకుముందు నర్సాపూర్ జేఏసీ చైర్మన్ వెంకట్గౌడ్ బస్టాండ్లో తాత్కాలిక డ్రైవర్కు పూలు ఇచ్చి కాళ్లుమొక్కి విధులకు రావద్దని కోరారు. అనంతరం జేఏసీ చైర్మన్ వెంకట్గౌడ్, కన్వీనర్ అశ్వక్ హైమద్ మాట్లాడుతూ ప్రభుత్వం వెంటనే ఆర్టీసీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఆర్టీసీ కార్మికుల సమ్మెకు బీజేపీ జిల్లా అధ్యక్షుడు మల్లేశ్గౌడ్, పార్టీ మండల అధ్యక్షుడు నాగేశ్, నాయకుడు రాజేందర్ మద్దతు తెలిపారు.