సిద్దిపేట, మార్చి 14(నమస్తే తెలంగాణ ప్రతినిధి): సిద్దిపేట ఎల్లమ్మ దేవాలయం నుంచి చిన్నకోడూరు మండల కేంద్రం వరకు చేపట్టిన రహదారి విస్తరణ పనులు నత్తనడకన సాగుతున్నాయి. దీంతో వాహనదారులు, ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రోడ్డును తవ్వి కంకర, చిప్స్ పరిచారు. కల్వర్టుల నిర్మాణం చేపట్టారు. కొంతదూరం మధ్యలో డివైడర్ సైతం ఏర్పాటు చేశారు. మొదట్లో పనులు స్పీడుగా జరిగాయి. ఆ తర్వాత నెమ్మదించాయి. మూడు నెలలుగా పనుల్లో పురోగతి లేదు. కేసీఆర్ ప్రభుత్వంలో సిద్దిపేట ఎల్లమ్మ దేవాలయం నుంచి చిన్నకోడూరు మీదుగా ఇల్లంతకుంట వరకు దాదాపు 32 కిలోమీటర్ల రోడ్డు విస్తరణ పనులకు సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్రావు, మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ వినతి మేరకు అప్పటి సీఎం కేసీఆర్ రూ. 254 కోట్లు మంజూరు చేశారు.
ఈ రహదారి విస్తరణ పనులను త్వరగా పూర్తి చేసేందుకు మూడు బిట్లుగా విభజించారు. శాసనసభ ఎన్నికల ముందు సిద్దిపేట నుంచి చిన్నకోడూరు వరకు విస్తరణ పనులు మొదలుపెట్టి పనులు వేగంగా జరిపించారు. ఎన్నికలు పూర్తయి కాంగ్రెస్ అధికారంలోకి రాగానే చిన్నకోడూరు నుంచి ఇల్లంతకుంట వరకు రెండు బిట్ల పనులను రద్దు చేసింది. సిద్దిపేట ఎల్లమ్మ దేవాలయం నుంచి చిన్నకోడూరు వరకు రహదారి విస్తరణ పనుల్లో జాప్యం జరుగుతున్నది. ఫలితంగా దుమ్ముతో వాహనదారులు, ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వాహనాలు వచ్చి పోయినప్పుడు విపరీతంగా దుమ్ము లేచి రోడ్డు పక్కన షాపుల్లోకి, ఇండ్లలోకి వెళ్తున్నది. తద్వారా ప్రజలు అనారోగ్య సమస్యలకు గురవుతున్నారు. చిన్నచిన్న కంకర రాళ్లు పైకి ఎగిరి పడుతుండడంతో గాయాల పాలవుతున్నారు.
కంకరతో వాహనాలు స్కిడ్ అయి ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. ఇటీవల ఓ కారు అదుపుతప్పి పక్కనే ఉన్న విద్యుత్ స్తంభానికి డికొట్టింది. నిత్యం ఏదో ఒక సంఘటన జరుగుతూనే ఉన్నది. ఇదంతా జరుగుతున్నప్పటికీ రోడ్లు భవనాలశాఖ అధికారులు, సంబంధిత కాంట్రాక్టర్ పట్టించుకోవడం లేదని ప్రజలు ఆరోపిస్తున్నారు. ఈ రహదారిపై ప్రయాణం అంటేనే నరకం కనిపిస్తున్నది. ఉదయం, సాయంత్రం వేళ తూతూమంత్రంగా ట్యాంకర్తో నీళ్లు పట్టి చేతులు దులుపుకొంటున్నారు. రోడ్డుపై వాహనాల రాకపోకలు ఎక్కువగా ఉండడంతో నీళ్లు చల్లిన అరగంట కాగానే ఎప్పటి లాగానే మళ్లీ విపరీతంగా దుమ్ము లేస్తున్నది. వాహనాలు వెళ్లినప్పుడు విపరీతంగా దుమ్ము లేవడంతో కనీసం ఎదురుగా వస్తున్న ఇతర వాహనాలు కనిపించడం లేదు.
దీంతో ప్రమాదాలు జరుగుతున్నాయి. ముక్కుకు మాస్క్ ధరించి పోవాల్సి వస్తున్నది. రోడ్డు వెంట ఉన్న కొంతమంది షాపుల యజమానులు వారి దుకాణాల ఎదుట ప్రతి అరగంటకు ఒక్కసారి నీటిని కొట్టుకుంటున్నారు. దుమ్ము, కంకర రాళ్లు, చిప్స్తో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పనుల్లో సైతం నాణ్యతా ప్రమాణాలు పాటించడం లేదనే ఆరోపణలు ఉన్నాయి. రోడ్డు విస్తరణలో భాగంగా ఏర్పాటు చేసే డివైడర్లకు కనీసం వాటర్ క్యూరింగ్ చేయడం లేదు. తక్షణమే సంబంధిత అధికారులు స్పందించి వెంటనే తారువేపి ఇక్కట్లను తొలిగించాలని వాహనదారులు, ప్రయాణికులు కోరుతున్నారు.