రామాయంపేట, ఆగస్టు 2: అజాగ్రత్త, నిర్లక్ష్యంతోనే రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని హైదరాబాద్ రేంజ్ డీఐజీ కమలాసన్రెడ్డి అన్నారు. కరీంనగర్ జిల్లా కేంద్రం నుంచి మెదక్ జిల్లా రామాయంపేటకు చేరుకున్న ఇండియన్ యూత్ సెక్యూర్ ఆర్గనైజేషన్ సంస్థ రోడ్డు భద్రత బస్సును మెదక్ ఎస్పీ రోహిణి ప్రియదర్శినితో కలిసి కమలాసన్రెడ్డి జెండా ఊపి ప్రారంభించారు. రోడ్డు సేఫ్టీపై ఆర్గనైజేషన్ నిర్వాహకుడు గన్శ్యాం ఓజా డీఐజీకి రోడ్డు భద్రతపై సూచనలు చేశారు. అనంతరం కమలాసన్రెడ్డి మాట్లాడుతూ రోడ్డు భద్రతకు ప్రజలే భాగస్వాములన్నారు. పోలీసులు ఎప్పుడూ అందుబాటులో ఉండరని, ప్రమాదాలు జరిగినప్పుడు ప్రజలే ముందుంటారన్నారు. ప్రమాదాలు జరిగిన వెంటనే క్షతగాత్రులను దవాఖానకు తరలించాలన్నారు.
ఎక్కువ శాతం ద్విచక్ర వాహనాలతో ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయని తెలిపారు. రోడ్డు సేప్టీ కోసం ఇండియన్ యూత్ సెక్టార్ ఆర్గనైజేషన్ సంస్థ ప్రత్యేకంగా ప్రమాదాల నివారణకు బస్సు ద్వారా ప్రజలు, విద్యార్థులకు అవగాహన కల్పించడం హర్షించదగ్గ విషయమన్నారు. ఈ బస్సు యాత్ర తెలంగాణలో వెయ్యి రోజులపాటు కొనసాగుతుందన్నారు. రోజుకు 410మంది రోడ్డు ప్రమాదాల్లో చనిపోతున్నారన్నారు. ఇంట్లో నుంచి బయటకు వెళ్లేముందు పిల్లలు, కుటుంబాన్ని గుర్తుకు తెచ్చుకోవాలన్నారు. రామాయంపేట మున్సిపల్ చైర్మన్ పల్లె జితేందర్గౌడ్, పీఏసీఎస్ చైర్మన్ బాదె చంద్రం, కౌన్సిలర్లు ఐజీ కమలాసన్రెడి, ఎస్పీ రోహిణి ప్రియదర్శినిని శాలువాతో సన్మానించి మొక్క అందజేశారు. కార్యక్రమంలో తూప్రాన్ డీఎస్పీ యాదగిరిరెడ్డి, రామాయంపేట సీఐ చంద్రశేఖర్రెడ్డి, ఎస్సైలు రాజేశ్, శ్రీనివాస్రెడ్డి, సుభాష్గౌడ్, టీఆర్ఎస్ నాయకులు గంగాధర్, శ్యాంసుందర్, దేవుని రాజు, కృష్ణాగౌడ్, చింతల యాదగిరి, అనిల్కుమార్ పాల్గొన్నారు.