సదాశివపేట, మే 15: వేసవి కాలం మనషులకే కాదు మూగ జీవాలకూ సంకటమే. ఫ్యాన్లు, కూలర్లు, ఏసీల వంటి వాటితో ప్రజలు వేసవితాపం నుంచి ఉపశమనం పొందుతున్నారు. మరి పశువుల సంగతేంటి? రోజు రోజుకు పెరుగుతున్న ఉష్ణోగ్రతల నుంచి వాటిని ఎలా కాపాడుకోవాలి? పశు పోషకులు పాటించాల్సిన జాగ్రత్తలు ఏంటి? అనే అంశాలపై పశువైద్యులు, సిబ్బంది గ్రామాల్లో రైతులు, ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. పశువులకు ఎండ దెబ్బతగలకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరిస్తున్నారు. ఉదయమే మేతకు తీసుకెళ్లాలని, సాధ్యమైనంత ఎక్కువగా నీళ్లు తాగించాలని, గ్రామాల శివార్లలో నీటి తొట్టెలు ఏర్పాటు చేసుకోవాలని సూచిస్తున్నారు.
పశుపోషకులు అప్రమత్తంగా ఉండాలి
గ్రామీణ ప్రాంతాల్లో అత్యధికంగా పశుపోషణపై ఆధారపడి జీవిస్తున్నారు. వేసవిలో పశుపోషణకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేసుకోవాలి. ముఖ్యంగా వడదెబ్బ తగలకుండా చూసుకోవాలి. పాల దిగుబడి తగ్గకుండా జాగ్రత్తలు పాటించాలి. వడదెబ్బ తగిలిన వెంటనే పశువైద్యులను సంప్రదించాలి. లేకుంటే రైతులకు తీవ్రనష్టం జరుగుతుంది. అప్రమత్తంగా వ్యవహరించి పశువులను పోషిస్తూ రైతులు అభివృద్ధి చెందాలి.
– సంతోష్కుమార్, పశువైద్యాధికారి, సదాశివపేట
తీసుకోవాల్సిన జాగ్రత్తలు
* ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉన్న సమయంలో యజమానులు గుర్తించి పశువులు ఎక్కువ మోతాదులో నీరు తాగేలా చూడాలి.
* ఉదయం 8 గంటల నుంచి 11 గంటల వరకు మేత కోసం మైదానాలకు తీసుకెళ్లాలి. మళ్లీ సాయంత్రం నాలుగు గంటల తర్వాత తీసుకెళ్లాలి.
* ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉన్న క్రమంలో సాయంత్రం సమయంలో కుంటలు, చెరువుల్లో పశువులను ఉంచాలి. ఇలా చేయడం వల్ల డిహైడ్రేషన్ నుంచి పశువులను రక్షించుకోవచ్చు.
* పశువుల కొట్టాలు, పాకలు చల్లగా ఉండేలా చూసుకోవాలి. నీళ్లతో రెండు మూడుసార్లు తడిపితే వేడిని తగ్గించవచ్చు. స్పింకర్లు అందుబాటులో ఉన్న రైతులు పశువుల కొట్టాలపై వాటిని వినియోగించడం వల్ల ఎండ దరి చేరకుండా ఉంటుంది.
ఎండ దెబ్బ లక్షణాలు…
* ఎండ దెబ్బకు గురైన పశువులు బాగా నీరసానికి గురవుతాయి. చూపు కూడా సరిగ్గా నిలుపలేదు.
* ఆరోగ్యంగా ఉన్న పశువుల చర్మాన్ని లాగితే వెంటనే వెనక్కి పోతుంది. కానీ ఎండ దెబ్బ తగిలిన పశువుల చర్మం లాగితే నిదానంగా వెనక్కి వెళ్తుంది.
* ఎండదెబ్బ తగిలిన పశువులను వెంటనే సమీపంలోని పశువైద్యశాలకు తీసుకెళ్లాలి. స్లైన్లు ఎక్కించాలి.
పాల దిగుబడి ఇలా పెంచుకోవచ్చు
సహజంగా ఎండకాలం రాగానే పశువుల పాల దిగుబడి గణనీయంగా తగ్గుతుంది. గ్రామీణ ప్రాంతాల్లో రైతులు అధికంగా పశుపోషణపై ఆధారపడి ఉంటారు. దీంతో ఎక్కువగా నష్టపోయే అవకాశం ఉంటుంది. సరైన జాగ్రత్తలు పాటిస్తేనే దీన్ని అధిగమించవచ్చు. మండుతున్న ఎండలను దృష్టిలో ఉంచుకుని సాధ్యమైనంత ఎక్కువగా నీరు తాగించాలి. కొట్టాల చుట్టూ ఖాళీ బస్తాలను కట్టి వాటిని తరచూ నీటితో తడపాలి. దీంతో బయటి నుంచి వచ్చే గాలి చల్లగా ఉంటుంది.
పశువుల శరీరం కూడా చల్లబడుతుంది. దీంతో పాల దిగుబడి పెరుగుతుంది. పాలు ఉత్పత్తి చేసే రైతులు వైద్యులను సంప్రదించి సలహాలు, సూచనలు పాటించాలి.