ఏ ఫంక్షన్ వచ్చినా.. కార్యం ఏదైనా సన్న బియ్యం వండాల్సిందే. నేటి కాలంలో సన్నబియ్యం లేనిదే ముద్ద దిగడం లేదంటే అతిశయోక్తి కాదు. అందుకే మార్కెట్లో సన్నబియ్యానికి భలే డిమాండ్ ఏర్పడింది. దీంతోపాటు సన్నరకాల ధాన్యం పండించే రైతులు కూడా మంచి లాభాలు గడిస్తున్నారు. ఉమ్మడి మెదక్ జిల్లాలో సన్నరకం ధాన్యానికి డిమాండ్ ఎక్కువగా ఉన్నది. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా చూస్తే సన్నరకం ధాన్యం 80 నుంచి 90 వేల ఎకరాల్లో సాగు చేస్తున్నారు. ఎకరానికి 20 నుంచి 25 క్వింటాళ్ల వరకు ధాన్యం వస్తున్నది. ఒక క్వింటాలు సన్నరకం ధాన్యం రూ.3 వేల నుంచి రూ.3,200 వరకు ధర పలుకుతున్నది. క్వింటాలు బియ్యం రూ.5 వేల నుంచి రూ.6,000 వరకు విక్రయిస్తున్నారు.
సిద్దిపేట, డిసెంబర్ 14(నమస్తే తెలంగాణ ప్రతినిధి): ఉమ్మడి మెదక్ జిల్లాలో సన్నరకం ధాన్యానికి భలే డిమాండ్ ఉంది. సన్న బియ్యానికి అధిక ధర పలుకుతున్నది. ఉమ్మడి మెదక్ జిల్లావ్యాప్తంగా చూస్తే సరాసరిగా సన్నరకం ధాన్యం సాగు 80 వేల నుంచి 90 వేల ఎకరాల వరకు సాగైంది. ఇందులో వివిధ రకాలకు చెందిన ధాన్యాన్ని రైతులు పండించారు. సిద్దిపేట జిల్లాలో పండించిన ధాన్యాన్ని నల్గొండ, సూర్యాపేట తదితర ప్రాంతాల నుంచి వ్యాపారులు వచ్చి కొనుగోలు చేస్తున్నారు. మరికొన్ని చోట్ల రైతులు నేరుగా ధాన్యం మిల్లులకు తరలించి బియ్యం తయారు చేసి విక్రయిస్తున్నారు. మొత్తంగా చూసుకుంటే గతేడాది కన్న ఈ సంవత్సరం సన్నరకాలకు అధిక డిమాండ్ ఉంది.
ఒక రైతు పండించిన ధాన్యం అంత ఒకే సీడ్గా ఉంటుంది. అది అంత ఒకే కూటుగా బియ్యాన్ని చేయిస్తారు. దీంతో ఇతర రకాల సీడ్ బియ్యం ఇందులో కలిసే అవకాశం ఉండదు. బియ్యం పక్కాగా ఉంటుంది. వ్యాపారుల దగ్గర చేయించిన బియ్యంలో కొంత మిళితమయ్యే (వేర్వేరు రకాలుగా) అవకాశం ఉంటుంది. రైతుల వద్ద నేరుగా బియ్యాన్ని కొనుగోలు చేస్తే నాణ్యమైన బియ్యం మనకు దొరికే అవకాశం ఉంటుంది. మొత్తంగా చూస్తే గతేడాది కన్న ఈసారి సన్న రకం బియ్యానికి అధిక డిమాండ్ ఉందని చెప్పొచ్చు. గతేడాది కన్నా దిగుబడి తగ్గడంతో ఇతర ప్రాంతాలకు ఎగుమతి చేయడంతో ధరలు పెరిగే అవకాశాలున్నాయి. కొద్ది రోజుల నుంచి ధరలు పెరుగుతున్నాయిని వ్యాపారులు చెబుతున్నారు. సాధారణంగా సన్న రకాలను వానకాలంలో రైతులు సాగు చేస్తుంటారు. కారణం ఏమిటంటే ఈసీజన్లో నూక శాతం తక్కువ వస్తుంది. ఆదే యాసంగిలోనైతే నూక శాతం అధికంగా ఉంటుంది. వానకాలంలో ఎక్కువ మంది రైతులు పండించిన దొడ్డు రకం వడ్లను నేరుగా మిల్లులకు తరలించి అమ్ముకున్నారు. జిల్లాలో సన్న రకాల బియ్యం ధరలు రికార్డు స్థాయిలో ఉన్నాయి. మరికొన్ని రోజులు ఆగితే మరింతగా పెరిగే అవకాశాలు ఉన్నట్లు వ్యాపారులు చెప్పుతున్నారు. ప్రస్తుతం వివిధ రకాలైన కావేరి చింటు, జైశ్రీరాం, బీపీటీ తదితర వాటికి క్వింటాల్కు రూ.5 వేల నుంచి రూ. 5,500 ధర పలుకుతున్నది. మంచి క్వాలిటీ బియ్యం అయితే క్వింటాల్కు రూ.6 వేలు పలుకుతున్నాయి. వ్యాపారులు తమ తమ దుకాణాల్లో పంచ రంగుల సంచుల్లో నింపి వివిధ రకాల పేర్లు పెట్టి అమ్ముతున్నారు. ఈ బియ్యంపై జాగ్రత్త అవసరం. వీటిలో చాలా వరకు స్టీమ్ రైస్ నింపి అధిక ధరలకు అమ్ముతున్నారు. రక రకాల పేర్లు పెట్టి అమ్మడంతో వినియోగదారులు మోసపోయే ప్రమాదం ఉంది. బియ్యం కొనే వారు నేరుగా రైతు వద్ద కొనుగోలు చేస్తే నాణ్యమైన బియ్యం దొరుకుతాయి.
అగ్గితెగులు, మొగిలిపురుగు, బ్యాక్టీరియా, ఎండు తెగులు తదితర తెగుళ్లు వరి పైరుపై ఆశించి పంట దిగుబడి రాలేదు. ఆశించిన దిగుబడి రాకపోయినప్పటికీ పెరిగిన ధరతో రైతుకు కొంతమేర ఉపశమనం కలిగిస్తుందని చెప్పొచ్చు. ఒక ఎకరానికి 20 నుంచి 25 క్వింటాళ్ల వరకు ధాన్యం వస్తున్నది. కొన్ని నేలల్లో (భూముల రకాన్ని బట్టి) 18 నుంచి 22 క్వింటాళ్ల వరకు దిగుబడి వస్తున్నదని రైతులు చెబుతున్నారు. ప్రస్తుత సీజన్లో సిద్దిపేట జిల్లాలోని ఆయా ప్రాంతాల్లో వివిధ రకాల సన్నాలకు ధరలు ఉన్నాయి. సరాసరిగా ఒక క్వింటాల్ సన్నరకాల ధాన్యం రూ.3 వేల నుంచి రూ.3,200 వరకు పలుకుతున్నది. వీటిలో ప్రధాన రకాలు జైశ్రీరాం, ఆర్ఎన్ఆర్, బీపీటీ, కావేరి, చింటు తదితరలు ఉన్నాయి. వీటి బియ్యం క్వింటాల్కు రూ.5 వేల నుంచి రూ.5,500 వరకు, పాత బియ్యం ఒక క్వింటాల్కు రూ.6 వేలు పలుకుతున్నది. కొంతమంది రైతులు పంటను వ్యాపారులకు విక్రయించగా, మరికొంతమంది నేరుగా మిల్లుకు తీసుకెళ్లి బియ్యం పట్టించి వారే అమ్ముకుంటున్నారు. నేరుగా రైతుల వద్ద బియ్యం కొనే వారికి క్వింటాల్కు ఓ ఐదారు వందల రూపాయలు తక్కువ ధరకు దొరుకుతున్నాయి. వ్యాపారులు వద్ద అధిక ధరలకు సన్న బియ్యం కొనుక్కుంటున్నారు. చాలామంది నేరుగా రైతుల వద్దనే బియ్యం కొనుగోలు చేయడానికి మొగ్గు చూపుతున్నారు.