మెదక్, మార్చి 31 (నమస్తే తెలంగాణ): యాసంగి ధాన్యం కొనుగోలు చేసేందుకు ఈ నెల 3వ వారంలో కొనుగోలు కేంద్రాలు ప్రారంభిస్తామని మెదక్ కలెక్టర్ రాజర్షి షా అన్నారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అందరు సమన్వయంతో పనిచేయాలన్నారు. శుక్రవారం కలెక్టరేట్లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్లో అదనపు కలెక్టర్ రమేశ్తో కలిసి ధాన్యం దిగుబడి, కేంద్రాల ఏర్పాటు, మౌలిక వసతుల కల్పన తదితర అంశాలపై అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర మాట్లాడుతూ ఈ యాసంగిలో 94 వేల హెక్టార్లలో రైతులు వరి సాగు చేస్తున్నారన్నారు.
వ్యవసాయ శాఖ అంచనా ప్రకారం మారెట్కు 5లక్షల 24 వేల మెట్రిక్ టన్నుల ధాన్యం వచ్చే అవకాశం ఉన్నదన్నారు. 413 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. ఇందులో ప్రాథమిక సహకార సంఘాల ద్వారా 290, ఐకేసీ ద్వారా 110, డీసీఎంఎస్ ద్వారా 8, రైతు ఉత్పత్తి సంస్థల ద్వారా 5 కేంద్రాలు ఏర్పాటు చేయనున్నామన్నారు. రైతులకు ఇబ్బంది కలగకుండా ప్రతి కేంద్రంలో షామియానా, మంచినీరు, శౌచాలయాలు తదితర సౌకర్యాలు కల్పించాలని అధికారులకు సూచించారు. మారెట్కు వచ్చే ధాన్యం మేరకు కేంద్రాల ఏర్పాటు, వసతుల కల్పన ఆధారపడి ఉంటుందన్నారు.
కచ్చితమైన సమాచారం సేకరించాలి
వ్యవసాయాధికారులు మరోమారు రైతులు, గ్రామాల వారీగా ఎన్ని ఎకరాల్లో పంట వేశారు, విత్తనాలకు పోగా ఎంత ధాన్యం కొనుగోలు కేంద్రాలకు వచ్చే అవకాశం ఉందో వ్యవసాయ విస్తరణ అధికారులతో నిర్ణీత నమూనాలో మరోమారు కచ్చితమైన సమాచారం సేకరించి అందజేయాలని కలెక్టర్ ఆదేశించారు. తాళ్లు లేకుండా, 17 శాతం తేమ మించకుండా ఎఫ్సీఐ నిర్దేశించిన ప్రమాణాలకనుగుణంగా రైతులు నాణ్యమైన ధాన్యం (Fair Average Quality)(FAQ) కొనుగోలు కేంద్రాలకు తీసుకొచ్చేలా అవగాహన కలిగించాలన్నారు. ఏ గ్రామం, ఏ కేంద్రానికి ధాన్యం ఎప్పుడు తీసుకురావాలో స్పష్టం చేస్తూ టోకెన్లు ఇవ్వాలని సూచించారు.
ప్రభుత్వం ఏ-గ్రేడు ధాన్యం క్వింటాల్కు రూ.2060కు, సాధారణ రకం రూ.2040లకు కొనుగోలు చేసేందుకు మద్దతు ధర ప్రకటించిందన్నారు. ధాన్యం సేకరణకు కోటి 50 లక్షల గోనె సంచులు అవసరం కాగా 75 లక్షలు అందుబాటులో ఉన్నాయన్నారు. మిగతా వాటికీ చర్యలు తీసుకోవాల్సిందిగా డీఎస్వోకు సూచించారు. ట్యాబ్ ఎంట్రీకి కొత్త వర్షన్ 8.0 నూతన ట్యాబ్లు కొనుగోలు చేయాల్సిందిగా కలెక్టర్ అధికారులకు ఆదేశించారు. ధాన్యం అన్లోడ్ చేసుకునేందుకు ప్రతి రైస్ మిల్లులో 40 నుంచి 50 మంది హమాలీలు ఉండేలా చూసుకోవాలన్నారు.
సౌకర్యాలు కల్పించాలి
కొనుగోలు కేంద్రాల్లో అవసరమైన టార్పాలిన్లు, ప్యాడీ క్లీనర్, తేమను కొలిచే యంత్రాలు, డిజిటల్ కాంటాలు అందుబాటులో ఉంచుకోవాలని మారెటింగ్ అధికారికి సూచించారు. మరో 3 వేల టార్పాలిన్లు కొనుగోలు చేసేందుకు అనుమతిచ్చారు. ధర్మ కాంటాలు, రైస్ మిల్లులు, కొనుగోలు కేంద్రాల వద్ద కాంటాలు సరిగా పనిచేస్తున్నాయా లేదా పరిశీలించాలని లీగల్ మెట్రాలజీ అధికారికి సూచించారు. వేయి లారీలు అందుబాటులో ఉంచుతూ రైస్ మిల్లులకు జియో ట్యాగింగ్ చేయాలని, లారీలను మానిటరింగ్ చేయాలని రవాణాధికారికి సూచించారు. కాన్ఫరెన్స్లో డీఎస్వో శ్రీనివాస్, జిల్లా వ్యవసాయాధికారి ఆశాకుమారి, డీసీవో కరుణ, అడిషనల్ పీడ భీమయ్య, మారెటింగ్ అధికారి రియాజ్ తదితరలు పాల్గొన్నారు.