ప్రజలకు సుపరిపాలన అందించడంతో పాటు అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను క్షేత్రస్థాయికి తీసుకెళ్లాలనే ఉద్దేశంతో సీఎం కేసీఆర్ జిల్లాల పునర్విభజనకు శ్రీకారం చుట్టారు. 2016 అక్టోబర్ 11న కొత్త జిల్లాలను ప్రారంభించగా, నాలుగు రెవెన్యూ డివిజన్లు, నాలుగు మున్సిపాలిటీలు, 21 మండలాలు, 469జీపీలతో మెదక్ కొత్త జిల్లాగా ఆవిర్భవించింది. జిల్లా ఏర్పాటుతో ప్రజలకు పాలన చేరువైంది. ప్రజాప్రతినిధులు, అధికారులు అన్ని వేళలా అందుబాటులో ఉంటుండడంతో ఎప్పటికప్పుడు సమస్యలు పరిష్కారమవుతున్నాయి.
వైద్య, విద్య, వ్యవసాయ రంగాల్లో విప్లవాత్మక మార్పులు చోటుచేసుకున్నాయి. నిరంతర పర్యవేక్షణతో అభివృద్ధి పనులు త్వరితగతిన పూర్తవుతున్నాయి. అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందుతున్నాయి. ప్రభుత్వ కార్యాలయాన్నీ అందుబాటులోకి రాగా, పారదర్శకమైన సేవలు అందుతున్నాయి. జిల్లా కేంద్రంలో రూ. 67.07 కోట్లతో అత్యాధునిక హంగులతో నిర్మించిన సమీకృత కలెక్టరేట్ భవనం తలమానికంగా నిలుస్తున్నది. 69 ఎకరాల సువిశాల ప్రాంతంలో జిల్లా పోలీసుల కార్యాలయాన్ని నిర్మించారు. ఏడు వసంతాలు దిగ్విజయంగా పూర్తి చేసుకుని ఎనిమిదో సంవత్సరంలోకి అడుగిడుతున్న మెదక్ జిల్లాపై
‘నమస్తే’ ప్రత్యేక కథనం.- మెదక్, అక్టోబర్ 10 (నమస్తే తెలంగాణ)
మెదక్, అక్టోబర్ 10 (నమస్తే తెలంగాణ): తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పాలనా సౌలభ్యం కోసం కొత్త జిల్లాలను ఏర్పాటు చేసింది. 2016 అక్టోబర్కు ముందు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పది జిల్లాలు మాత్రమే ఉండేవి. జిల్లాల పునర్ వ్యవస్థీకరణ చట్టం 1974 ప్రకారం తెలంగాణ వ్యాప్తంగా 23 కొత్త జిల్లాలను ఏర్పాటు చేసి 2016 అక్టోబర్ 11న కొత్త జిల్లాలను సీఎం కేసీఆర్ ప్రారంభించారు. ఇందులో భాగంగా మెదక్ జిల్లాను కూడా ఏర్పాటు చేశారు.
పరిపాలనా సౌలభ్యం కోసం
ప్రజలకు ఇబ్బందులు కలుగకుండా, పరిపాలనా సౌలభ్యం కోసం జిల్లాను 4 రెవెన్యూ డివిజన్లుగా విభజించారు. ఇందులో మూడు పాత రెవెన్యూ డివిజన్లు మెదక్, నర్సాపూర్, తూప్రాన్ కాగా, నూతనంగా ఒక్క రెవెన్యూ డివిజన్ రామాయంపేట ఏర్పాటు చేశారు. మెదక్ జిల్లా ఏర్పాటు నాటికి జిల్లా కేంద్రంలో ఒక మున్సిపాలిటీ ఉండగా, నేడు కొత్తగా 3 మున్సిపాలిటీలు ఏర్పాటు చేసుకొని పరిపాలనను పట్టణ ప్రజలకు చేరువలోకి తీసుకువచ్చారు.
గంటలోనే పనులన్నీ..
జిల్లా కేంద్రంలో పరిపాలన సౌలభ్యం కోసం ఏర్పాటు చేసిన జిల్లా సమీకృత కలెక్టరేట్ కార్యాలయం, జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయాలు ప్రజల అవసరాలకు అనుకూలంగా ఏర్పాటు చేశారు. జిల్లా సమీకృత కలెక్టరేట్ సముదాయంలో ప్రభుత్వ శాఖలన్నింటిలో నూతన విభాగాలను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. దీంతో ప్రజలు జిల్లా కేంద్రానికి రావాలంటే గంట వ్యవధిలోనే వస్తున్నారు.
32 ఎకరాల్లో సమీకృత కలెక్టరేట్
జిల్లా కేంద్రంలోని ఔరంగాబాద్ శివారులో 32 ఎకరాల స్థలంలో సమీకృత కలెక్టరేట్ నిర్మాణం చేపట్టారు. భవన నిర్మాణానికి రూ.67.07 కోట్లు కేటాయించారు. అన్ని హంగులతో అధునాతన సదుపాయాలతో కలెక్టరేట్ భవన నిర్మాణ సముదాయం జీ ప్లస్ -2 నాలుగు బ్లాకుల నిర్మాణం చేపట్టారు. ఇందులో కలెక్టర్ బంగ్లాతో పాటు రెండు అడిషనల్ కలెక్టర్, 8 మంది జిల్లా అధికారుల నివాస గృహాలు ఉన్నాయి. ఆగస్టు 23న ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు ప్రారంభించారు.
మెదక్ జిల్లా ఏర్పాటు
రాష్ట్రంలో అన్ని జిల్లాల మాదిరిగానే మెదక్ జిల్లాను ఏర్పాటు చేశారు. జిల్లాల పునర్విభజనకు ముందు ఉమ్మడి మెదక్ జిల్లాలో 3 డివిజన్లు, 46 మండలాలలో జిల్లా పరిపాలన కొనసాగుతుండేది. జిల్లాల వ్యవస్థీకరణలో భాగంగా ఉమ్మడి మెదక్ జిల్లాను విభజించి 3 జిల్లాలు ‘మెదక్, సంగారెడ్డి, సిద్దిపేట’గా ఏర్పాటు చేశారు. దీంతో మెదక్ జిల్లాలో 5 కొత్త మండలాలు(మనోహరాబాద్, చిలిపిచెడ్, హవేళీఘణాపూర్, నిజాంపేట, నార్సింగి) మొత్తం 21 మండలాలతో కలిపి మెదక్ జిల్లాను 2016, అక్టోబర్ 11న ఏర్పాటు చేశారు. 2016కు ముందు మెదక్ జిల్లా కేంద్రంలో ఒకే ఒక్క మున్సిపాలిటీ ఉండగా, జిల్లా ఏర్పడిన తర్వాత తూప్రాన్, నర్సాపూర్, రామాయంపేట మున్సిపాలిటీలు ఏర్పడ్డాయి. గతంలో 320 గ్రామ పంచాయతీలు ఉండగా జిల్లా పునర్వీభజన తర్వాత 469 గ్రామ పంచాయతీలు ఏర్పడ్డాయి.
రాజ భవనంలా ఎస్పీ కార్యాలయం
జిల్లాలో ఎస్పీ కార్యాలయాన్ని అన్ని హంగులతో సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. రాజ భవనాన్ని తలపించే హంగులు, గాలి, వెలుతురు, సూర్యరశ్మి వచ్చేలా విశాలమైన గదులు ఇలా అందరినీ ఆకట్టుకునేలా జిల్లా పోలీసు కార్యాలయాన్ని నిర్మించారు. జిల్లా కేంద్రంలోని ఔరంగాబాద్ శివారులోని సర్వే నంబర్ 78లో కలెక్టరేట్ కార్యాలయ భవనం పక్కన ప్రభుత్వ స్థలాన్ని కేటాయించారు. 63 ఎకరాల్లో మూడు అంతస్తుల్లో నిర్మాణం చేపట్టారు. కార్యాలయ భవనంతోపాటు జిల్లా పోలీసు ఉన్నతాధికారుల నివాస గృహాలు ఒకే ప్రాంగణంలో నిర్మించారు. ముందు లాండ్స్కేప్, పార్కింగ్, అంతర్గత రహదారుల నిర్మాణం మినహా ప్రధాన భవన నిర్మాణంలోని గదులు తుది మెరుగు దశలో ఉన్నాయి. రాజ భవనాన్ని తలపించేలా అన్ని వసతులతో నిర్మించారు. ఆగస్టు 23న సీఎం కేసీఆర్ ప్రారంభించారు.