పెద్దశంకరంపేట, జనవరి24: రెవెన్యూ అధికారులు పెద్దశంకరంపేట మండలంలోని ప్రభుత్వ భూములు గుర్తించాలని నారాయణఖేడ్ ఎమ్మెల్యే పట్లోళ్ల సంజీవరెడ్డి అన్నారు. బుధవారం స్థానిక మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీపీ జంగం శ్రీనివాస్ అధ్యక్షతన జరిగిన మండల సర్వసభ్య సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. పెద్దశంకరంపేట పట్టణ శివారులో సర్వేనంబర్ 1, 258, 217, 237లో ఎవరైనా భూములు ఆక్రమిస్తే వాటిని గుర్తించి నోటీసులు అందజేయాలన్నారు. పెద్దశంకరంపేట పట్టణంలో బీసీ గురుకుల పాఠశాల, ఇంటర్నేషనల్ స్కూల్ ఏర్పాటుకు ప్రభుత్వ భూములు గుర్తించాలన్నారు.
గత ఐదేండ్ల రికార్డులు తీసి ఎవరైనా అక్రమంగా నిర్మాణాలు చేపడితే చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని తహసీల్దార్ గ్రేసీబాయికి సూచించారు. గ్రామాల్లో పర్యటించి సమస్యలు పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. అనంతరం ఎమ్మెల్యేను ప్రజాప్రతినిధులు సన్మానించారు. సమావేశంలో వైస్ ఎంపీపీ లక్ష్మి, ఎంపీడీవో రఫీకున్నీసా, ఆయా గ్రామాల సర్పంచ్లు, ఎంపీటీసీలు తదితరులు పాల్గొన్నారు.