వెల్దుర్తి, ఏప్రిల్ 28: ఎంపీ ఎన్నికల్లో మెదక్ బీఆర్ఎస్ అభ్యర్థి లక్ష ఓట్ల మెజార్టీతో విజయం ఖాయమైందని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్రావు అన్నారు. ఆదివారం వెల్దుర్తిలో ఎంపీ అభ్యర్థి వెంకట్రామిరెడ్డి, ఎమ్మెల్యే సునీతాలక్ష్మారెడ్డి, నియోజకవర్గ ఇన్చార్జి ఎమ్మెల్సీ యాదవరెడ్డితో కలిసి అంబేద్కర్ చౌరస్తా నుంచి బస్టాండ్ చౌరస్తా వరకు భారీ రోడ్షో నిర్వహించారు. అనంతరం వెల్దుర్తి బస్టాండ్ చౌరస్తా వద్ద ఏర్పాటు చేసిన కార్నర్ మీటింగ్లో హరీశ్రావు మాట్లాడుతూ.. ఆరు గ్యారంటీల పేరుతో రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ హామీలను అమలు చేయడంతో పూర్తిగా విఫలమైందన్నారు. డిసెంబర్ 9న రుణమాఫీ చేయడంతో పాటు, వంద రోజుల్లో ఆరు గ్యారంటీల హామీల అమలుకు బాండు పేపర్లు రాసిచ్చారని, ఇప్పుడు ఆ బాండు పేపర్లకు సైతం కాలం చెల్లిందన్నారు. ధాన్యం కొనుగోలులో పూర్తిగా విఫలమైన ప్రభుత్వం, రైతులను నట్టేట ముంచిందని, రైతుల ఉసురు పోసుకుంటుందన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఏనాడు ఎకరం పంట ఎండిపోలేదని, నేడు కాంగ్రెస్ వచ్చిన తరువాత మొదటి పంటనే ఎండిపోయిందని, నీళ్లు ఉన్నా, కరెంట్ ఉన్నా వాడుకోలేని చేతగాని ప్రభుత్వం అని ఆగ్రహం వ్యక్తం చేశారు. తమను ప్రజలు నమ్మడం లేదని, ఓటమి భయంతో ఎక్కడికి వెళితే అక్కడ దేవుళ్లపై ఒట్లు పెడుతూ ప్రజలను నమ్మించే ప్రయత్నం చేస్తున్నారన్నారు. ఝాటామాటల రేవంత్రెడ్డి, ఆగస్టు 15 అంటూ నయానాటకం మొదలు పెట్టారని, అప్పటికే రుణమాఫీ చేయకపోతే రాజీనామా చేయాలని సవాల్ చేస్తే తోకముడిచారన్నారు. తనకు పదవులు ముఖ్యం కాదని, అభివృద్ధి లక్ష్యమన్నారు.
కాళేశ్వర జలాలను మండుటెండల్లో హల్దీవాగులో ప్రవహించేలా చేసిన ఘనత తెలంగాణ తొలి సీఎం కేసీఆర్కే దక్కుతుందన్నారు. చెక్డ్యామ్ల నిర్మాణాలతో భూగర్భజలాలు, తాగునీటి కష్టాలు తీర్చారన్నారు. పదేండ్లు కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ హామీలను విస్మరించిందన్నారు.దుబ్బాక ఎన్నికల్లో హామీలను ప్రకటించి, ఒక్కటీ నెరవేర్చలేని రఘునందన్రావు మళ్లీ ఓట్ల కోసం ప్రజల ముందుకు రావడం విడ్డూరంగా ఉందన్నారు. అధికారిగా సేవలు చేసిన వెంకట్రామిరెడ్డి, చట్టసభల్లో ఉంటే ప్రశ్నించే గొంతుకై నిధుల కోసం పోరాటం చేసి ప్రాంత అభివృద్ధ్దికి కృషి చేస్తారని హరీశ్రావు అన్నారు. సేవచేసే భాగ్యం కల్పించాలని ప్రజలకు బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి వెంకట్రామిరెడ్డి విజ్ఞప్తి చేశారు.రూ. 100 కోట్లతో ట్రస్టు ఏర్పాటు చేసి మహిళలు, యువత, యువకులకు ఉపాధి శిక్షణ, ఉద్యోగాల కల్పన కోసం కృషి చేస్తా, కోచింగ్ సెంటర్లు పెట్టి నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు వచ్చేలా తీర్చిదిద్దుతానన్నారు. మెదక్ ఎంపీ స్థానంలో బీఆర్ఎస్ గెలుపు ఖాయమని నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతాలక్ష్మారెడ్డి అన్నారు. ప్రతి నాయకుడు, కార్యకర్త ఇంటింటికీ వెళ్లి బీఆర్ఎస్ చేసిన సేవలను, కాంగ్రెస్ పార్టీ చేస్తున్న మోసపూరిత హామీలను తెలియజెప్పాలన్నారు. కార్యక్రమంలో నాయకులు సింగాయిపల్లి గోపి, గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ చంద్రాగౌడ్, వెల్దుర్తి, మాసాయిపేట మండలాల పార్టీ అధ్యక్షులు భూపాల్రెడ్డి, మధుసూదన్రెడ్డి, జడ్పీటీసీ రమేశ్గౌడ్, ఎంపీటీసీ మోహన్రెడ్డి, పీఏసీఎస్ చైర్మెన్ అనంతరెడ్డి, నాయకులు ప్రతాప్రెడ్డి, పడిగె నర్సింలు, అశోక్రెడ్డి, శ్రీనివాస్రెడ్డి, కృష్ణాగౌడ్, మహేందర్రెడ్డి, తోటనర్సింలు, సోమప్ప, నాగరాజు, నర్సింలు, స్టేషన్శ్రీను, పాండురంగం, బాలేష్లతో పాటు వెల్దుర్తి, మాసాయిపేట మండలాలకు చెందిన బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
మాసాయిపేట నుంచి మండలంలోని ఆయా గ్రామాల నుండి బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు సుమారు నాలుగు వందల బైక్లతో భారీ ర్యాలీ నిర్వహించారు. మాసాయిపేటలోని ప్రధాన వీధుల్లో బైక్ర్యాలీ నిర్వహించిన అనంతరం ర్యాలీగా బొమ్మారం, కొప్పులపల్లి గ్రామాల మీదుగా వెల్దుర్తికి ర్యాలీగా తరలివచ్చారు. ఈ బైక్ ర్యాలీని ఎమ్మెల్యే సునీతాలక్ష్మారెడ్డి జెండా ఊపి ప్రారంభించారు.