సిద్దిపేట, జనవరి 31 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా సిద్దిపేట జిల్లాలో నిర్మించిన రిజర్వాయర్లు జలకళను సంతరించుకున్నాయి. మల్లన్నసాగర్ (50 టీఎంసీల సామ ర్థ్యం) కాగా, ప్రస్తుతం 15 టీఎంసీలు, రంగనాయక సాగర్ (3 టీఎంసీల సామర్థ్యం)లో ప్రస్తుతం 2.41 టీఎంసీలు, కొండపాచమ్మ రిజర్వాయర్ (15 టీఎంసీల సామర్థ్యం)లో ప్రస్తుతం 11.2 టీఎంసీల నీళ్లు ఉన్నాయి. గోదావరి జలాలతో రిజర్వాయర్లు జలకళతో ఉట్టిపడుతున్నాయి. రైతుల సాగునీటి కష్టాలను సీఎం కేసీఆర్ తీర్చడంతో రైతులు సంతోషంగా పంటలు పండిస్తున్నారు.
రైతులకు అన్ని రకాలుగా ప్రభుత్వం అండగా ఉంటుంది. ఉచిత నాణ్యమైన విద్యుత్ను అందించడమే గాక రైతులకు పంట పెట్టుబడి సాయం కింద యాసంగిలో ప్రతి ఎకరాకు రూ.5 వేల చొప్పున రైతుబంధు డబ్బులను నేరుగా వారి వ్యక్తిగత బ్యాంకు ఖాతాలో జమ చేసింది. యాసంగిలో ఒక గుంట ఖాళీ లేకుండా రైతులు పంటలను సాగు చేశారు. ఈ పంటలను ఎండిపోకుండా అవసరమైన మేరకు చెరువులు, చెక్డ్యాంలు నింపాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నెల 24న రంగనాయక సాగర్ ఎడమ కాల్వ నుంచి రాష్ట్ర ఆర్థిక వైద్యారోగ్య శాఖల మంత్రి తన్నీరు హరీశ్రావు చిన్నకోడూరు, నారాయణరావుపేట మండలాలకు నీటిని విడుదల చేశారు. ఈ కాల్వ నుంచి ప్రతిరోజు 150 క్యూసెక్కుల నీరు చెరువులకు వెళుతున్నాయి. మిగతా ప్రాంతాల నుంచి రైతుల విజ్ఞప్తి మేరకు నీటిని విడుదల చేసేలా నీటి పారుదల శాఖ అధికారులు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. కూడవెల్లి, హల్దీవాగు పరిసర ప్రాంతాల రైతులు వాగులకు నీటిని విడుదల చేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు. రైతుల విజ్ఞప్తి మేరకు మల్లన్నసాగర్, కొండపోచమ్మ రిజర్వాయర్ల నుంచి త్వరలోనే నీటిని విడుదల చేసేలా ప్రణాళికలను సిద్ధం చేసుకుంటున్నారు.
సాగు నీటి విడుదలకు కసరత్తు
జిల్లాలోని రంగనాయక, మల్లన్నసాగర్, కొండ పోచమ్మ రిజర్వాయర్లు గోదావరి జలాలతో నిండుకుండలా ఉన్నాయి. త్వరలోనే యాసంగి సాగు పంటలకు నీటిని విడుదల చేసేలా కార్యాచరణ సిద్ధం చేస్తున్నారు. నీటి పారుదల శాఖ అధికారులు క్షేత్రస్థాయిలో కాల్వలను పరిశీలిస్తున్నారు. ఎక్కడైనా లోపాలున్నాయా..? ఏమేమి చేయాలి..? ఏ మేరకు నీటిని విడుదల చేయాలి..? ఎన్ని చెక్ డ్యాంలు ఉన్నాయి.. ? ఎన్ని ఎకరాల ఆయకట్టు ఉంది…? తదితర వివరాలతో కూడిన నివేదికలను సిద్ధం చేస్తున్నారు. సిద్ధం చేసిన నివేదికలను సీఎం కేసీఆర్, రాష్ట్ర ఆర్థిక, వైద్యారోగ్య శాఖల మంత్రి తన్నీరు హరీశ్రావుకు నివేదించనున్నారు. పైనుంచి ఆదేశాల రాగానే నీటిని విడుదల చేసేందుకు క్షేత్రస్థాయిలో అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. త్వరలోనే రంగనాయక సాగర్ కుడి కాల్వ నుంచి కూడా నీటిని విడుదల చేయనున్నారు.
జిల్లాలో గుంట జాగా ఖాళీ లేకుండా వరిసాగు చేశారు. సుమారు 2.60 లక్షల ఎకరాలకుపైగా వరిసాగు చేసినట్టు అధికారుల లెక్కలు తెలుపుతున్నాయి. ఇతర పంటలు సైతం సాగయ్యాయి. వరిపంటను కాపాడడానికి చెరువులు, చెక్డ్యాంలు నింపనున్నారు. శ్రీరాజరాజేశ్వర జలాశయం నుంచి రంగనాయక సాగర్కు, అక్కడి నుంచి మల్లన్న సాగర్ రిజర్వాయర్కు, అక్కడి నుంచి కొండపోచమ్మ రిజర్వాయర్లకు గోదావరి జలాలు వెళుతున్నాయి. ఆయా రిజర్వాయర్ల ప్రధాన కాల్వలు, చిన్న కాల్వల ద్వారా వాగులు, చెరువులు, చెక్డ్యాంలను నింపేలా కసరత్తు చేస్తున్నారు. గత రెండు సంవత్సరాల నుంచి రైతులకు యాసంగికి సాగునీటిని విడుదల చేస్తున్న విషయం తెలిసిందే. దీంతో గతంలో ఎన్నడూలేనంతగా సాగు విస్తీర్ణం పెరుగుతూ వస్తున్నది. నీటి వినియోగం కూడా బాగా పెరిగిందనే చెప్పాలి. త్వరలోనే హల్దీ వాగు, కూడవెల్లి వాగులకు నీటిని విడుదల చేసి వాటిపై ఉన్న ప్రతి చెక్డ్యాంను నింపనున్నారు.