సంగారెడ్డి కలెక్టరేట్, ఆగస్టు 3: సంగారెడ్డి జిల్లాలో మద్యం దుకాణాల రిజర్వేషన్ ఖరారైంది. రాష్ట్ర ప్రభుత్వ ఎక్సైజ్ పాలసీ మేరకు జిల్లాలో 2023-25కు గానూ నూతన మద్యం పాలసీ ద్వారా రిజర్వేషన్లను కలెక్టర్ శరత్ ఖరారు చేశారు. 2023 డిసెంబర్ 1 నుంచి 2025 నవంబర్ 30 వరకు గల రెండేండ్ల వ్యవధికి ఈ పాలసీ అమలుకానున్నది. నవంబర్ 30తో మద్యం దుకాణాలకు కాలపరిమితి ముగియనుండడంతో రాష్ట్ర ప్రభుత్వం కొత్త మద్యం పాలసీని ఖరారు చేసిన విషయం తెలిసిందే. ఈ మేరకు గురువారం కలెక్టరేట్లోని కలెక్టర్ చాంబర్లో జిల్లా ఎక్సైజ్శాఖ ఆధ్వర్యంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ సంక్షేమ శాఖల అధికారుల సమక్షంలో నూతన మద్యం పాలసీ ద్వారా రిజర్వేషన్లను కలెక్టర్ ఖరారు చేశారు. జిల్లాలో మొత్తం 101 మద్యం దుకాణాలకు 24 దుకాణాలకు రిజర్వేషన్లను ఖరారు చేయగా, మిగతా 77 మద్యం దుకాణాలు జనరల్ కేటగిరీకి కేటాయించారు. నిబంధనల మేరకు మొత్తం దుకాణాల్లో రిజర్వేషన్ విధానంలో గౌడ కులస్తులకు 15 శాతం, ఎస్సీలకు 10 శాతం, ఎస్టీలకు 5 శాతం మద్యం దుకాణాలు లక్కీ డ్రా ద్వారా ఎంపిక చేశారు. లక్కీడ్రా ద్వారా మద్యం దుకాణాల కేటాయింపుల్లో భాగంగా గౌడ కులస్తులకు 9 దుకాణాలు, ఎస్సీలకు 13 దుకాణాలు, ఎస్టీలకు 2 దుకాణాలు కేటాయించారు.
మద్యం దుకాణాలకు శుక్రవారం నుంచే దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు కలెక్టర్ శరత్ స్పష్టం చేశారు. దరఖాస్తులను ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ జిల్లా కార్యాలయంలో గెజిట్ వారీగా ఈనెల 18న సాయంత్రం 6 గంటల వరకు స్వీకరించనున్నారు. దరఖాస్తు రుసుము రూ.2 లక్షలుగా ఖరారు చేయగా, సదరు రుసుము తిరిగి చెల్లించడం జరగదని ప్రభుత్వం స్పష్టం చేసింది. వచ్చిన దరఖాస్తులను ఈ నెల 21న సంగారెడ్డిలోని జేఆర్ఆర్ గార్డెన్ ఆండ్ ఫంక్షన్హాల్లో లాటరీ విధానం ద్వారా ఎంపిక చేయనున్నారు. ఈ డ్రా నిర్వహణకు దరఖాస్తుదారులను మాత్రమే అనుమతించనున్నారు. కలెక్టర్ లక్కీ డ్రా కార్యక్రమంలో ఎక్సైజ్శాఖ డిప్యూటీ కమిషనర్ హరికిషన్, జిల్లా ఆబ్కారీ శాఖ అసిస్టెంట్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ మాణెమ్మ, సీఐ మధుబాబు, షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి శాఖ డీడీ అఖిలేశ్రెడ్డి, గిరిజన సంక్షేమ అధికారి ఫిరంగి, జిల్లా వెనుకబడిన తరగతుల అభివృద్ధి శాఖ అధికారి జగదీశ్ తదితరులున్నారు.
జిల్లాలోని 101 మద్యం దుకాణాలకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నాం. మొత్తం 101 మద్యం దుకాణాల్లో 24 మద్యం దుకాణాలకు రిజర్వేషన్లు ఖరారు చేశాం. ప్రభుత్వ నిబంధనల మేరకు మొత్తం దుకాణాల్లో రిజర్వేషన్ విధానంలో గౌడ కులస్తులకు 15 శాతం, ఎస్సీలకు 10 శాతం, ఎస్టీలకు 5 శాతం మద్యం దుకాణాలు లక్కీ డ్రా ద్వారా ఎంపిక చేశాం. ఈ నెల 18లోగా ఆసక్తిగల వారు ఆయా మద్యం దుకాణాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ నెల 21న లాటరీ విధానం ద్వారా ఎంపిక ప్రక్రియ జరుగుతుంది.
– శరత్, సంగారెడ్డి కలెక్టర్