సిద్దిపేట జిల్లా వ్యాప్తంగా గణతంత్ర వేడుకలు శుక్రవారం ఘనంగా జరిగాయి. విద్యాసంస్థలు, ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాల్లో జాతీయ జెండాను ఎగురవేసి జనగణమన ఆలపించారు. పలు పాఠశాలల్లో విద్యార్థులు స్వాతంత్య్ర సమరయోధుల వేషధారణాలతో వచ్చి ఆకట్టుకున్నారు. ఈ సందర్భంగా నిర్వహించిన పలు క్రీడాపోటీల్లో గెలుపొందిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు.
సిద్దిపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో కలెక్టర్ ప్రశాంత్ జీవన్పాటిల్ జాతీయ జెండాను ఎగురవేశారు. సిద్దిపేటలో ఎమ్మెల్యే తన్నీరు హరీశ్రావు, హుస్నాబాద్లో మాజీ ఎమ్మెల్యే వొడితెల సతీశ్కుమార్, దుబ్బాకలో ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో కొత్త ప్రభాకర్రెడ్డి త్రివర్ణపతాకాన్ని ఎగురవేసి జాతీయగీతం ఆలపించారు. గణతంత్ర వేడుకల సందర్భంగా నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ అలరించాయి.