సిద్దిపేట అర్బన్, జూన్ 12 : వేసవి సెలవుల అనంతరం సోమవారం జిల్లా వ్యాప్తంగా పాఠశాలలు పున:ప్రారంభమయ్యాయి. సిద్దిపేట జిల్లా వ్యాప్తంగా 1,018 ప్రభుత్వ పాఠశాలలు, కొన్ని పైవేటు పాఠశాలలు తెరుచుకున్నాయి. వేసవి సెలవుల్లో సరదాగా ఆటపాటలతో గడిపిన విద్యార్థులు బడి బాట పట్టారు. మొదటి రోజు కావడంతో విద్యార్థులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేశారు. దాదాపు అన్ని ప్రభుత్వ పాఠశాలలకు యూనిఫాంలతో పాటు పాఠ్యపుస్తకాల పంపిణీ ప్రారంభమైంది.
ఇప్పటికే అన్ని ప్రభుత్వ పాఠశాలల పరిధిలోని గ్రామాల్లో బడి బాట కార్యక్రమం ముమ్మరంగా జరిగింది. విద్యార్థులకు ఉచితంగా పాఠ్యపుస్తకాలు, రెండు జతల దుస్తులు, పౌష్టికాహారంతో కూడిన మధ్యాహ్న భోజనం అందిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ సంవత్సరం రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు ఉచితంగా నోటు పుస్తకాలు కూడా అందజేయనున్నది. మొదటి రోజు జిల్లా వ్యాప్తంగా 60 శాతం మంది విద్యార్థులు హాజరైనట్లు అధికారులు వెల్లడించారు.