సిద్దిపేట, జూలై 6 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): వానకాలం సాగు జోరందుకున్నది. రైతులకు పంట పెట్టుబడి సాయాన్ని సీఎం కేసీఆర్ అందజేస్తున్నారు. వారం రోజులుగా రైతుల బ్యాంకు ఖాతాల్లో రైతుబంధు డబ్బులను రాష్ట్ర ప్రభుత్వం జమ చేస్తున్నది. ఇప్పటి వరకు ఎకరాల వారీగా ఆరు ఎకరాల్లోపు ఉన్న రైతులకు రాష్ట్ర ప్రభుత్వం రైతుబంధు నగదును జమ చేసింది. దీంతో రైతులు ఎరువులు, విత్తనాలు, దున్నకాలకు ఈ డబ్బును వినియెగించుకుంటున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుతో గోదావరి జలాలు తీసుకొచ్చి ప్రతి చెరువు, కుంట, చెక్డ్యామ్ను నింపడంతో భూగర్భ జలాలు గణనీయంగా పెరిగాయి. దీంతో సాగు విస్తీర్ణం పెరిగింది. పడావు భూములు సైతం సాగులోకి వచ్చాయి. సాగు విధానంలో ఆధునిక పద్ధతులు, నూతన విధానాలు, ప్రభుత్వ పథకాలు, కార్యక్రమాలు తెలియజేసేందుకు ప్రతి వ్యవసాయ క్లస్టర్కు ఒక రైతు వేదికను ప్రభుత్వం నిర్మించింది. పంటల సాగు, మార్కెట్ విధానం తదితర అంశాలపై రైతులు చర్చించుకుంటున్నారు. ఎన్నో పథకాలను ప్రభుత్వం ప్రవేశ పెట్టడంతో రైతులు పండుగలా ఎవుసం చేసుకుంటున్నారు.
ఉమ్మడి మెదక్ జిల్లాలో రూ.636.14 కోట్లు జమ పదకొండో విడతలో ప్రస్తుతం సిద్దిపేట జిల్లాలో 2,94,977 మంది రైతులకు రూ.233.52 కోట్లు, మెదక్ జిల్లాలో 2,41,795 మందికి రూ.155.45 కోట్లు, సంగారెడ్డి జిల్లాలో 3,16,118 మందికి రూ.247.19 కోట్లు, మొత్తం ఉమ్మడి మెదక్ జిల్లాలో ఇప్పటి వరకు రూ.636.14 కోట్లు రైతుల ఖాతాలో జమ చేసింది. మిగతా రైతులకు రోజు వారీగా జమవుతున్నది.
విత్తు విత్తకముందే సీఎం కేసీఆర్ రైతుబంధు అందజేస్తున్నారు. పంట లాగోడి కోసం ఎదురు చూడకుండా పెట్టుబడి సాయాన్ని అందిస్తున్నారు. అన్నదాతలు అప్పులు తెచ్చుకునే రోజులు పోయాయి. రైతుబంధుతో పంట పెట్టుబడులకు తిప్పలు తప్పాయి. జేబులో నాలుగు రూపాయలు కనిపిస్తున్నాయని రైతులు సంబుర పడుతున్నారు. చెప్పులు అరిగేలా బ్యాంకుల చుట్టూ తిరిగే రోజులు పోయి.. వాళ్లే వచ్చి పంట రుణాలు ఇస్తున్నారు.
రైతులకు తప్పిన తిప్పలు
గతంలో పంట సాగు చేయాలంటే రైతుల గుండెల్లో గుబులు. లాగోడి కోసం ఎవరి దగ్గరికి పోవాలనే బెంగ రైతుల్లో ఉండేది. వడ్డీలకు డబ్బులు తెచ్చి పంట సాగుచేస్తే చివరికి అప్పులే మిగిలేవి. చేసిన అప్పులు తీర్చలేక రైతులు ఆత్మహత్యలు చేసుకునే వారు. తెలంగాణ రాష్ట్రం వచ్చాక రైతులకు ఆ తిప్పలు తప్పాయి. పంట పెట్టుబడి కోసం రైతులు ఎదురు చూడకుండా విత్తు విత్తక ముందే సీఎం కేసీఆర్ పెట్టుబడి సాయాన్ని అందిస్తున్నారు. దీంతో రైతులు సంబురంగా ఎవుసం చేసుకుంటున్నారు. ప్రభుత్వం ఇచ్చిన రైతు బంధుతో విత్తులు, ఎరువులు, దున్నకం చేసుకుంటున్నారు. దిను సులు వచ్చాక ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లో మద్దతు ధరకు విక్రయిస్తున్నారు.
రైతుబంధుతో వ్యవసాయం పండుగ
ఉమ్మడి మెదక్ జిల్లావ్యాప్తంగా వానలు పడుతుండడంతో రైతాంగం సాగు పనిలో నిమగ్నమయ్యింది. రైతుకు ఎలాంటి చింత లేకుండా సకాలంలో రైతుబంధును రైతుల బ్యాంకు ఖాతాలో ప్రభుత్వం జమ చేస్తున్నది. దీంతో ఎరువులు, విత్తనాలు, దున్నకం వాటికి ఈ డబ్బులు ఉపయోగపడుతున్నాయి. అంతేకాకుండా ప్రభుత్వం సబ్సిడీపై యంత్రాలు, బిందుసేద్యపు పరికరాలు అందిస్తున్నది. ఇవన్నీ రైతులకు అక్కరకు వస్తున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం వేసే ప్రతి అడుగు రైతు సంక్షేమం కోసం ఉంటున్నది. రైతుబీమా పథకంతో రైతు కుటుంబాల్లో భరోసా నింపింది. మద్దతు ధరతో ప్రతి గింజనూ రాష్ట్ర ప్రభుత్వం కొంటున్నది. రైతుబంధు కింద ఎకరాకు రూ.5 వేల చొప్పున రెండు పంటలకు రూ.10 వేలు అందించి రైతుకు ఈ ప్రభుత్వం దన్నుగా నిలుస్తున్నది.
సీఎం సార్ది గొప్ప మనసు
సీఎం కేసీఆర్ సార్ది గొప్ప మనసు. రైతులకు సరైన సమయంలో రైతుబంధు సాయం అందించి, ఆదుకుంటున్న దేవుడు. గతంలో పంట ఏద్దామంటే శావుకారి దగ్గరికి ఉరికెటోళ్లం. ఇప్పుడు ఆ ఇబ్బంది తప్పింది. సీఎం సారే నేరుగా సాగు ఖర్చుకు డబ్బులేస్తుండ్రు. అప్పు లేకుండా పంట లేసుకుంటున్నం.
– కిషన్, రైతు, సుతారిపల్లి, రామాయంపేట
కాంగ్రెసోల్ల మాటలు నమ్మకుండ్రి..
పంట పెట్టుబడికి సీఎం సార్ పెద్దకొడుకు లెక్క ఆదుకుంటుండు. గప్పట్ల అప్పు కోసం నానా తిప్పలు పడెటోళ్లం. గిప్పుడు కేసీఆర్ సారు పెట్టుబడి సాయం కింద రైతు బంధు పైసలు బ్యాంకులో ఏస్తున్నడు. కాంగ్రెసోల్ల మాటలు నమ్మితే మనం ఎటూ గానోళ్లం అవుతం. గాల్ల మాటలను నమ్మకుండ్రి.
– కుమ్మరి నారాయణ, కోనాపూర్ రామాయంపేట
రైతుబంధుతో విత్తనం వడ్లు కొన్న..
కేసీఆర్ సారు ఇచ్చిన రైతు బంధుతో విత్తనం వడ్లు కొన్న. నాకు 30 గుంటల వ్యవసాయ భూమి ఉన్నది. ప్రభుత్వం రూ.3 వేల రైతు బంధు ఇచ్చింది. దీంతో వడ్లు కొని నారు పోసుకున్న. ప్రభుత్వం రైతుబంధు ఇవ్వడం సంతోషంగా ఉంది. రైతులకు సాయం చేస్తున్న కేసీఆర్ సార్కు ధన్యవాదాలు.
– ర్యాగటి పోచయ్య, రైతు, ముత్తన్నపేట
పిండి బత్తాలకు మిత్తితోని కట్టేది
రైతుబంధు రాక ముందు పసలకొక్కమారు పిండి బత్తాలకు పంట అమ్మినంక రెండు రూపాల మిత్తితోని కట్టేది. ఇప్పుడు వ్యవసాయం మొదలు కాంగనే రైతు బంధు పైసలు పడుతున్నయ్. పైసలు పడంగనే పిండి బత్తాలకు కట్టి తెచ్చుకుంటున్నం. దున్నేటోల్లకు కూడా ఎప్పటికప్పుడు ఇత్తు న్నం. ఇదివరకు పైసల కోసం జరపేటోల్లం. ఈ పైసలు పడిన సంది ఇబ్బంది లేదు. రైతులకు రైతుబంధు పెద్ద సాయం జేస్తాంది. రైతులు బాగుపడుతరు.
– గంగం విజయ రైతు హుస్నాబాద్టౌన్.
పంట పెట్టుబడికి పనికొచ్చినయ్..
నాకున్న పావు తక్కువ మూడెకరాల వ్యవసాయ భూమికి రూ.14 వేల రైతుబంధు డబ్బులు వచ్చినయ్. పంట పెట్టుబడికి అవసరమున్న సమయంలోనే పైసలు రావడంతో దున్నకం, విత్తనాలు, మందు బస్తాలకు పనికొచ్చినయ్. పంట పెట్టుబడిగా పెడుతూ వడ్లు, ఆకుకూరలు, పత్తి, కూరగాయలు పండిస్తున్నా. కేసీఆర్ సారుకు రుణపడి ఉంటం.
– అనుముల రేణుక, మహిళా రైతు, ఆకునూరు
రైతుబంధు పథకం వరం లాంటిది
రైతుబంధు పథకం వరం లాంటిది. సరైన సమయంలో పెట్టుబడి సాయం అందడంతో లాగోడికి ఇబ్బంది లేదు. వ్యవసాయ పనులు ముమ్మరంగా చేస్తున్నాం. నాకు రెండెకరాల భూమి ఉంది. గురువారం నా ఖాతాలో రూ.10 వేలు జమైనయ్. దీంతో నాకు ఎంతో సంతోషం కలిగింది. రైతులంతా సీఎం కేసీఆర్ సారుకు ఎల్లప్పుడూ రుణాపడి ఉంటారు.
– ఈదిగోల్ల శంకయ్య, రైతు, వెంకట్రావ్పేట, తొగుట
సీఎం కేసీఆర్కు రుణపడి ఉంటాం
వానకాలంలో ఎరువులు, విత్తనాలకు ప్రభుత్వం అందిస్తున్న రైతు బంధు ఎంతో పనికొస్తున్నది. నాకు ఐదెకరాల భూమి ఉంది. రైతు బంధు ద్వారా రూ.20 వేలు వచ్చాయి. పెట్టుబడి సాయం రావడంతో ఎంతో సంతోషంగా ఉంది. ఈ పైసలను లాగోడికి వాడుకుంటా. గతంలో అప్పులు చేసి వ్యవసాయం చేసేటోళ్లం. ప్రస్తుతం సీఎం కేసీఆర్ అందిస్తున్న రైతు బంధుతో పెట్టుబడి బాధలు తప్పినయ్. సీఎం కేసీఆర్కు ఎల్లప్పుడు రుణపడి ఉంటాం.
– బాల్రెడ్డి, రైతు టెంకంపేట, రాయపోల్
కూలీలకూ పైసలు చెల్లించిన..
పంట పండించేందుకు పెట్టుబడి సాయాన్ని అందిస్తున్న సీఎం కేసీఆర్ సారుకు రైతులందరూ రుణపడి ఉంటారు. రైతుబంధు పైసలతో ఎరువులు, విత్తనాలు కొనుక్కున్నా. కొంతమంది కూలీలకు పైసలు చెల్లించిన. రైతుబంధు, రైతుబీమా, నిరంతర విద్యుత్ అందిస్తున్న కేసీఆర్ సారు మరోసారి సీఎం కావాలి.
– బస్వరాజ్, రైతు, మాచిరెడ్డిపల్లి, కోహీర్
రైతుబంధుతో ఎరువులు కొన్న..
నాకున్న ఎకరం పొలానికి సరిగ్గా నాట్ల సమయంలో సీఎం కేసీఆర్ అందిస్తున్న రైతుబంధు డబ్బులు పడ్డాయి. దీంతో సకాలంలో ఎరువులు కొన్న. నాటు ఖర్చులకు డబ్బులిచ్చిన. సీఎం కేసీఆర్ ప్రభుత్వం తప్పా ఇప్పటివరకు ఏ ప్రభుత్వం కూడా రైతులకు పంట పెట్టుబడి సాయం చేయలేదు. సీఎం కేసీఆర్కు రుణపడి ఉంటాం.
– బేగరి చిన్నరాములు, రైతు, గూడురు. శివ్వంపేట
ఏ బాధ లేకుండా ఎవుసం చేస్తున్న..
సీఎం కేసీఆర్ ఉన్నడని ఏ బాధ లేకుండా ఎవుసం చేస్తున్న. తెలంగాణ వచ్చాక రైతును ఆదుకుంటున్న గొప్ప నాయకుడు కేసీఆర్. కూలీలు, ఎరువులకు, దున్నుకానికి ఇప్పుడు ఇబ్బంది లేకుండా ఉంది. రైతుల ఇబ్బందులు ఎరుక.. అందుకే టైంకు ఇస్తుండు. నాకు నాలుగు ఎకరాల పొలం ఉంది. కాళేశ్వరం నీళ్లు వచ్చినయ్. భూముల ధరలు పెరుగుతున్నయ్. కరెంట్ కూడా ఫ్రీగా ఇయ్యవట్టే.
– మారెడ్డి మధుసూదన్రెడ్డి, రైతు, ఇర్కోడు, సిద్దిపేట రూరల్
దున్నుకానికి పనికొచ్చినయ్..
మొన్నటి రాళ్లవానకు పంట దెబ్బతిన్నది. ఎట్లా అనుకుంటున్న టైంల సీఎం కేసీఆర్ రైతుబంధు ఇచ్చిండు. దున్నుకానికి, ఎరువులకు పనికొస్తున్నయ్. ఎవుసం పనులు మొదలు పెట్టిన. గతంలో పెట్టుబడికి పైసలు లేక ఇబ్బందులు పడ్డం. ఇప్పుడు కేసీఆర్ ఉన్నడనే ధైర్యంతో ఎవుసం చేస్తున్నం. ఎరువులు, నీళ్లు మస్తుగ ఉన్నయ్. నాకు మూడు ఎకరాల పొలం ఉంది. వరి ఏస్తున్న.
– కుచ్చుల మల్లయ్య, రైతు, ఇర్కోడు, సిద్దిపేట రూరల్
ఎరువులు కొన్నా..
నాకు రెండెకరాల పొలం ఉంది. సీఎం కేసీఆర్ నాకు వానకాలం పంట సాగుకు రూ.10 వేల రైతు బంధు పైసలు నా అకౌంట్లో ఏసిండు. నాకు చాలా సంతోషంగా ఉంది. ఈ రైతు బంధు పైసలతో ఎరువులు కొన్నా. మాలాంటి రైతులకు రైతుబంధు, రైతుబీమా పథకాలు తెచ్చిన సీఎం కేసీఆర్ సారుకు రుణపడి ఉంటాం.
– రాజేశ్వరి, మహిళా రైతు, నారాయణరావుపేట
దున్నకాల టైమ్కు పడ్డయ్..
మాలాంటి రైతులందరినీ సీఎం కేసీఆర్ ఆదుకుంటుండ్రు. యాడాదికి రెండుమార్ల రైతుబంధు పైసల్ పడుతున్నయ్. దున్నకాల టైమ్కు బ్యాంకులో పైసల్ పడడంతో ఇబ్బందులు తప్పినయ్. రైతు గోస తెలిసిన మనిషి సీఎం కేసీఆర్. అందుకే రాష్ట్ర సర్కారు పెట్టుబడి ఇచ్చి అప్పుల జోలికి పోకుండా చేస్తున్నది. వచ్చిన రైతుబంధు సాయం దున్నకం, ఎరువులు, ఇత్తనపు వడ్లకు వాడకమైంది.
– ఎ.యాదయ్య, రైతు, సిద్దిపేట
రైతుబంధును లాగోడికి పెట్టిన..
సీఎం కేసీఆర్ వానకాలం సాగుకు ఇచ్చిన రైతు బంధు పైసలు ఇత్తనాలు, ఎరువులకు ఖర్చు జేసిన. గప్పుడైతే ఎరువులు తెచ్చుకోనికే ఆల్లను ఈల్లను అడిగెటోళ్లం. గిప్పుడు గా రంది పోయింది. సీఎం కేసీఆర్ సార్ ఏసిన పైసలతోని రంది లేకుండా ఎవుసం చేసుకుంటున్నా. సీఎం కేసీఆర్ సారుకు రుణ పడి ఉంటం.
– మొగుళ్ల శింగరాలు, రైతు, మిరుదొడ్డి
అప్పుల బాధలు తప్పినయ్..
పంట సాగుకు తెలంగాణ ప్రభుత్వం రైతులకు అందిస్తున్న రైతుబంధు డబ్బులు సకాలంలో నా ఖాతాలో జమ అయినయ్. దీంతో ఎరువులు, విత్తనాలు కొన్నా. గతంలో ఇవి కొనేందుకు అప్పులు చేసేటోళ్లం. ఒక్కోసారి అప్పులు దొరక్క ఇబ్బందులు పడేవాళ్లం. ప్రస్తుతం సీఎం కేసీఆర్ రైతుల కష్టాలు గుర్తించి పంట సాగుకు పెట్టుబడి సాయం అందిస్తుండడం సంతోషంగా ఉంది. సీఎం కేసీఆర్కు ప్రత్యేక కృతజ్ఞతలు.
– కొడిపాక కృష్ణ, రైతు, నస్తీపూర్, హత్నూర
యాళ్లకు చేతుకొచ్చినయ్
రైతుబంధు పైసలు యాళ్లకు చేతుకొచ్చినయ్. వానలు పడంగనే ఎరువులు, దుక్కులకు, ఇత్తనాలు తేవడానికి యాళ్లకు పైసలేశిండ్రు. మాకు రెండెకరాలన్నర ఉంది. రూ.12.500 పడ్డాయి. వొడ్ల పైసలు ఇన్నీ, రైతుబంధు పైసలు కలుపుకొని లాగోడికి రంది లేకుండా ఖర్చు జేస్తున్నం. కట్టె, పొద, పొరక సాపు జేసి, ఏగిళ్లు దుక్కులు దున్ని, రడీ జేసిన. ఎకరంన్నర తరిపొలంలో నాటేస్త, ఖుష్కిలో ఇంత పత్తివెట్టిన. ఆరు నెలలకొకసారి సర్కారు ఇస్తున్న రైతుబంధుతో మాకు ఢోకా లేదు.
– బూర్గుపల్లి నర్సయ్య, మైలారం, వర్గల్
ఇంతమంచి ఇకమత్ జేసిన కేసీఆర్కు మొక్కుతం..
ఆయిటి అచ్చిందంటే పెట్టుబడి కోసం ఆడ, ఇడ ఇబ్బందులు పడేది. షావుకార్ల దగ్గర పెట్టుబడి కోసం అప్పులు తెచ్చి ఇత్తనాలు, మందు బస్తాలు తెచ్చేది. సీఎం కేసీఆర్ సారు అచ్చినంకా ఆ తిప్పలు తప్పినయ్. యాడాదికి రెండు సార్లు రెండు పంటలకు రైతుబంధు పైసలు పడుతున్నయి. ఆ పైసలతోటే ఇత్తనాలు, మందుబస్తాలు, దున్నకాల ఖర్చులు ఎల్లుతున్నయి. రైతుల కోసం ఇంతమంచి ఇకమాత్ చేసిన కేసీఆర్ సారుకు ఎన్నిసార్లు మొక్కినా తక్కువే. రైతులమంతా ఎప్పుడైనా కేసీఆర్ సార్కే సపోర్ట్ జేస్తం.
– అత్కూరి పద్మ, రైతు, గాగిళ్లాపూర్, మద్దూరు
పంట పెట్టుబడికి ఉపయోగపడుతున్నాయ్
సీఎం కేసీఆర్ ఏటా రెండు పంటలకు దున్నకానికి ముందే పెట్టుబడి పైసలు ఏస్తున్నడు. దీంతోపాటు ప్రభుత్వమే మద్దతు ధర ఇచ్చి పంట కొంటున్నది. నిజంగా ఇది కేసీఆర్ సార్తోనే సాధ్యం. రైతుల అవసరాలను గుర్తించి సార్ ఇచ్చే పెట్టుబడి సాయం మరువలేనిది. రైతుబంధు పైసలను వ్యవసాయ పనులకే ఉపయోగిస్తున్నా. రైతులకు గీ పైసలు ఇవ్వకుంటే మిత్తికి తెచ్చే పరిస్థితి. ఎవరు ఏం చెప్పినా రైతులకు సీఎం కేసీఆరే పెద్ద దిక్కు.
– దండు నర్సింహులు, రైతు, ఐనాపూర్
పడావుబడ్డ సాగుకు వెన్నెముక రైతుబంధు
పడావుబడ్డ సాగుకు వెన్నెముక రైతుబంధు. సమైక్య రాష్ట్రంలో నీళ్లు, కరెంటు లేక విత్తనాలు దొరకక అప్పుల పాలయ్యే పరిస్థితి. నేడు సీఎం కేసీఆర్ పాలనలో ‘రైతే రాజు’ అన్న నినాదం నిజమైంది. వ్యవసాయానికి 24 గంటల ఉచిత కరెంటు, ప్రాజెక్టులతో సాగు నీరు, అందుబాటులో ఎరువులు, వాటికితోడు సమయానికి రైతు బంధు అందడంతో ప్రతి రైతు ముఖంలో చిరునవ్వు కనిపిస్తున్నది. రైతు బంధుతో నా సాగు జోరుమీదున్నది.
– చింతకింది కిష్టయ్య, రైతు, ములుగు
రంది లేకుండా ఎవుసం చేస్తున్నా..
సీఎం కేసీఆర్ సరైన సమయంలో రైతుబంధు పథకంతో పంట పెట్టుబడికి పైసలు వేస్తుండ్రు. దీంతో రంది లేకుండా ఎవుసం చేస్తున్నం. పంట పెట్టుబడికి బయటకు పోయి అప్పులు తెచ్చుడు తగ్గిపోయింది. నాకు 4.20 ఎకరాల పొలం ఉంది. ప్రతి ఆరు నెలలకు ఒకసారి రూ.22,500 పడుతున్నాయి. ఇందుకు సీఎం కేసీఆర్కు కృతజ్ఞతలు.
– దండు సిద్ధిరాములు, రైతు, నిజాంపేట
రైతుబంధుతో కొండంత భరోసా
రైతుబంధుతో రైతులకు కొండంత భరోసా వస్తున్నది. పంట పెట్టుబడి సాయంగా రైతుబంధు అక్కరకు వస్తున్నది. ప్రభుత్వం చేస్తున్న సాయం నాలాంటి రైతులకు ఎంతో మేలు చేస్తున్నది. మాకు 3.5 ఎకరాలకు రైతుబంధు పైసలు పడ్డాయి. సీఎం కేసీఆర్ రైతులకు ఎంతో మేలు చేస్తుండ్రు. రైతుల శ్రేయస్సుకు సీఎం కేసీఆర్ ఎంతో కృషి చేస్తున్నారు.
– శ్రీపాల్రెడ్డి, రైతు, తెల్లాపూర్, ఆర్సీపురం