గడిచిన వానకాలంలో విస్తారంగా కురిసిన వానలకు చెరువులు, ప్రాజెక్టుల్లోకి వరద రావడంతో జలకళతో ఉట్టిపడుతున్నాయి.కాగా, నీటి వనరుల్లో ఈ ఏడాది చేపపిల్లలు వదిలేందుకు ప్రభుత్వ ఆదేశాల మేరకు మత్స్యశాఖ అన్ని ఏర్పాట్లు చేసింది. నేడోరేపో సంగారెడ్డి జిల్లాలో 1071 చెరువుల్లో ఉచితంగా చేప పిల్లలను మత్స్యశాఖ ద్వారా వదిలేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈసారి జిల్లాలో 3.62 కోట్ల చేప పిల్లలను వదలనున్నారు. సింగూరు, నల్లవాగు, మెలిగిరిపేట ్రప్రాజెక్టులతో పాటు అందోలు, మల్కాపూర్, మల్చెల్మ, గొటిగార్పల్లి, కుసునూరు చెరువుల్లో 25 లక్షల రొయ్యలను ఉచితంగా వేయనున్నారు. మెదక్ జిల్లాలో 1614 చెరువుల్లో రూ.5.40 కోట్ల చేప పిల్లలు వదిలేందుకు ఏర్పాట్లు చేశారు. సోమవారం మెదక్ మండలం కొంటూరు చెరువులో ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి చేపల పంపిణీని లాంఛనంగా ప్రారంభిస్తారు.
మెదక్, ఆగస్టు 27 (నమస్తే తెలంగాణ) : నీటి వనరుల్లో చేప పిల్లల విడుదలకు జిల్లా యంత్రాంగం ఏర్పాట్లు చేసింది. ఈసారి వర్షాలు సమృద్ధిగా కురియడంతో చెరువుల్లో నీటి వనరులు పుష్కలంగా ఉన్నాయి. దీంతో రాష్ట్ర ప్రభుత్వం చేప పిల్లల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించాలని నిర్ణయించింది. మెదక్ జిల్లాలో 1614 చెరువుల్లో రూ.5.40 కోట్ల చేప పిల్లలు వదిలేందుకు మత్య్స శాఖ అధికారులు ప్రణాళికా రూపొందించారు. గుర్తించిన చెరువులు, కుంటలు, రిజర్వాయర్లలో ఉచితంగా చేప పిల్లలు వదిలేందుకు మత్స్యశాఖ సిద్ధమైంది. చేప పిల్లల సరఫరా కోసం ఇప్పటికే టెండర్లను పూర్తి చేసింది. చెరువుల్లో చేప పిల్లలను వదలడం ద్వారా మత్స్యకారులకు ఉపాధి కల్పించాలన్నదే రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన లక్ష్యం. సోమవారం మెదక్ మండలం కొంటూరు చెరువులో ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి చేపల పంపిణీని లాంఛనంగా ప్రారంభిస్తారు.
మెదక్ జిల్లాలో 1614 చెరువులు..
మెదక్ జిల్లాలో 1614 చెరువులు, కుంటలు, పోచారం, ఘనపూర్ ప్రాజెక్టుల్లో ఈసారి బొచ్చె, రాహు, బంగారుతీగతో పాటు వివిధ రకాలకు చెందిన 5.40 కోట్ల చేప పిల్లలను వదలనున్నారు. నేటి నుంచి ఈ ప్రక్రియ ప్రారం భం కానున్నది. 30 నుంచి 40 రోజుల్లో జిల్లాలోని అన్ని చెరువుల్లో చేప పిల్లలను వదులుతారు. మెదక్ మత్య్సశాఖ కార్యాలయంలో చేప పిల్లలను కృత్రిమంగా ఉత్పత్తి చేస్తున్నారు. ఈ సీడ్ను స్థానిక చెరువుల్లో వదలనున్నారు.
మత్స్యకారులకు చేయూత…
మత్స్యకారులకు ఆర్థికంగా అభివృద్ధి చెందేందుకు ప్రభుత్వం చెరువుల్లో చేప పిల్లలను ఉచితంగా వదులుతున్నది. వదిలిన నాటి నుంచి ఆరు నెలల తర్వాత పెరిగిన చేపలను పట్టి అమ్ముకోవడం ద్వారా మత్స్యకారులు ఆర్థికంగా లబ్ధి పొందనున్నారు. జిల్లాలో మహిళా సంఘాలతో కలుపుకొని మొత్తం 263 మత్స్య పారిశ్రామిక సహకార సంఘాలు ఉన్నాయి. వీటిలో దాదాపు 15,724 మంది మత్స్యకారులు సభ్యత్వం కలిగి ఉన్నారు. వంద శాతం రాయితీతో చెరువులు, కుంటలు, ప్రాజెక్టుల్లో సామర్ధ్యానికి అనుగుణంగా ఉచితంగా చేప పిల్లలను వదలడం ద్వారా వీరందరికీ ఉపాధి లభించనున్నది.
ఈసారి వీడియో చిత్రీకరణ.. ప్రజాప్రతినిధుల పర్యవేక్షణ..
గతంలో మాదిరి ఆరోపణలు రాకుండా ఈసారి చేప పిల్లలు వదిలే ప్రక్రియపై ప్రభుత్వం స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. ప్రతి చెరువులో చేప పిల్లలు వదిలే సమయంలో వీడియో చిత్రీకరించాలని ఆదేశించింది. చేప పిల్లల నాణ్యత, సైజు, సంఖ్య విషయంలో సందేహాలు ఉంటే అప్పటికప్పుడు అందుబాటులో ఉన్న మత్య్స శాఖ అధికారుల దృష్టికి తీసుకువెళ్లాలని ప్రభుత్వం మత్స్యకారులు, మత్స్యసంఘాల సభ్యులకు సూచించింది. ప్రతిరోజు ఉదయం 9 గంటల్లోపు చేప పిల్లల పంపిణీ పూర్తి చేయాలని ప్రభుత్వం విడుదల చేసిన మార్గదర్శకాల్లో పేర్కొంది. ప్రజాప్రతినిధుల పర్యవేక్షణలో కార్యక్రమం చేపట్టనున్నారు.
ప్రభుత్వ ఆదేశాల ప్రకారం ఏర్పాట్లు
ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లాలో చేప పిల్లలను పంపిణీ చేస్తాం. జిల్లాలోని 1614 చెరువుల్లో 5.04కోట్ల చేప పిల్లలను పంపిణీ చేయనున్నాం. ఇందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశాం. 16,200 మంది మత్య్సకారులు ఉండగా, 279 సొసైటీలు ఉన్నాయి. నేడు మెదక్ మండలం కొంటూరు చెరువులో మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి చేప పిల్లల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు.
-రజని, జిల్లా మత్య్సశాఖ అధికారి మెదక్