స్వయంభూగా వెలిసిన రేజింతల్ సిద్ధి వినాయకుడు భక్తులకు అభయహస్తం అందిస్తూ కొంగు బంగారంగా మారాడు. కోరిన కోర్కెలు తీరుస్తూ భక్తుల పాలిట ఇలవేల్పుగా మారాడు. స్వామి 223వ జయంతి ఉత్సవాలు ఈనెల 24వ తేదీ నుంచి 28 వరకు ఘనంగా జరగనున్నాయి. తెలంగాణతో పాటు కర్ణాటక, మహారాష్ట్ర భక్తులు తరలిరానుండగా.. ఆలయవర్గాలు భారీగా ఏర్పాట్లు చేస్తున్నాయి.
న్యాల్కల్, డిసెంబర్ 22 : సంగారెడ్డి జిల్లా న్యాల్కల్ మండలంలోని రేజింతల్ స్వయంభూ సిద్ధి వినాయకుడి 223వ జయంతి ఉత్సవాలకు ఆలయం ముస్తాబైంది. ఈనెల 24వ తేదీ నుంచి 28 వరకు ఆలయంలో జయంతోత్సవాలను వైభవంగా నిర్వహిస్తారు. కంచి కామకోటి పీఠం పర్యవేక్షణలో ఆలయ కమిటీ ఆధ్వర్యంలో అన్ని ఏర్పాట్లు పూర్తిచేశారు. ప్రసిద్ధి గాంచిన స్వయంభూ వినాయక ఆలయాల్లో ఆంధ్రప్రదేశ్లోని చిత్తూరు జిల్లాలోని కాణిపాకం ఆలయం ఒకటి కాగా, రెండోది రేజింతల్ గ్రామ శివారులోని వెలిసిన సిద్ధివినాయక ఆలయం. భక్తుల కోరిన కోర్కెలు తీర్చే సిద్ధి వినాయకుడి స్వామి జయంతోత్సవాలను ఏటా ఘనంగా నిర్వహిస్తారు.ఆలయంలో నాలుగు రోజుల పాటు జరిగే ఈ ఉత్సవాలకు తెలంగాణ, కర్ణాటక, మహారాష్ట్రకు చెందిన వేలాది మంది భక్తులు తరలివస్తారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ కమిటీ, హద్నూర్ పోలీసుల ఆధ్యర్యంలో భారీగా ఏర్పాట్లు చేశారు.
ఆలయ ప్రాశస్త్యం…
223 ఏండ్ల క్రితం రేజింతల్ సిద్ధివినాయక ఆలయం నిర్మాణం జరిగింది. అప్పట్లో ఈ ప్రాంతం దట్టమైన కీకారణ్యంగా ఉండేది. దేశ సంచారంలో ఉన్న శివరాం అనే పంతులు రేజింతల్ ప్రాంతానికి చేరుకోగా, ప్రస్తుతం స్వామివారి ఆలయం ఉన్న ప్రాంతం ఆయనకు మానసిక ప్రశాంతతను ఇచ్చింది. దీంతో చాలాకాలం పాటు ఇక్కడే ఆయన తపోదీక్షకు పూనుకున్నాడు. పుష్యమాసం చవితి రోజుల తపోదీక్షలో అతనికి సిద్ధివినాయక స్వామి కలలో దర్శనమిచ్చి, తన ఉనికిని తెలియజేస్తూ పూజాది కార్యక్రమాలు చేపట్టాలని సూచించారు. ఆ తర్వాత చిన్నపాటి గుడిని నిర్మించి స్వయంభూగా వెలిసిన రేజింతల్ సిద్ధి వినాయక స్వామివారి విగ్రహానికి భక్తులు పూజలు చేసేవారు.
అప్పటి నుంచి స్వామివారు భక్తుల కోరిన కోర్కెలను తీర్చుతూ కొంగుబంగారంగా విరాజిల్లుతున్నాడు. కొన్ని సంవత్సరాల క్రితం కంచి కామకోటి పీఠం ఆధ్వర్యంలో ఆలయ కమిటీ ఏర్పడింది. ఆ తర్వాత సిద్ధివినాయక ఆలయం దినదినాభివృద్ధి చెందుతున్నది. గర్భగుడిలో ఉన్న సిద్ధివినాయకుడి విగ్రహం ఏటా పెరుగుతున్నదని అంటుంటారు. స్వామివారి విగ్రహం వెలిసినప్పుడు రెండున్నర అడుగుల ఎత్తు ఉంటే, ఇప్పుడు ఐదున్నర అడుగుల ఎత్తు, ఆరు అడుగుల వెడల్పు అయ్యిందని భక్తులు చెబుతున్నారు. స్వామివారి విగ్రహం దక్షిణ వైపు ముఖం ఉండడం, సింధూర వర్ణం పూయడంతో ఆంజనేయస్వామిగా కనిపిస్తాడు. ప్రతి మాసంలో పౌర్ణమి అనంతరం వచ్చే మూడో రోజున సంకష్టహర చతుర్థిగా, వినాయకుడి ఇష్ట దినమైన మంగళవారం వచ్చే సంకష్టహర చతుర్థిని అంగారక చతుర్థిగా భక్తులు కొలుస్తారు. రాష్ట్రం నుంచే కాకుండా పొరుగు రాష్ర్టాలైన కర్ణాటక, మహారాష్ట్ర ప్రాంతాల నుంచి భక్తులు కాలినడక ఆలయానికి వచ్చి దర్శనం చేసుకుంటారు. కాలినడకన వచ్చి స్వామివారిని దర్శించుకుంటే కోరిన కోరికలు తీరుతాయని భక్తులు విశ్వాసం.
జయంతోత్సవ కార్యక్రమాలు…
భక్తులకు విస్తృత ఏర్పాట్లు…
ఉత్సవాలకు ఆలయాన్ని రంగురంగుల విద్యుద్దీపాలతో అందంగా తీర్చిదిద్దారు. తెలంగాణ, కర్ణాటక, మహారాష్ట్ర తదితర ప్రాంతాల నుంచి వచ్చే భక్తుల దర్శనానికి అన్ని ఏర్పాట్లు చేశారు. ఆలయంలో స్వామి వారి దర్శనానికి ప్రత్యేకంగా క్యూలైన్లను ఏర్పాటు చేశారు. భక్తులకు అన్నదానం, తాగునీరు, వసతి తదితర సౌకర్యాలు కల్పిస్తున్నారు. భక్తుల అధిక సంఖ్యలో పాల్గొని స్వామి వారి కృపకు పాత్రులు కావాలని ఆలయ ట్రస్టు అధ్యక్షుడు రేజింతల్ అశోక్, ప్రధాన కార్యదర్శి అల్లాడి నర్సింలు కోరారు.