మెదక్ మున్సిపాలిటీ, ఫిబ్రవరి 9 : అసంఘటిత రంగాల్లో పని చేస్తున్న కార్మికులను ‘ఈ-శ్రమ్’ పోర్టల్లో నమోదు చేసుకునేలా చర్యలు తీసుకోవాలనికార్మిక శాఖ అధికారులను కలెక్టర్ రాజర్షి షా ఆదేశించారు. గురువారం కలెక్టరేట్లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్లో స్థానిక సంస్థల ఆదనపు కలెక్టర్ ప్రతిమాసింగ్తో కలిసి జిల్లాలోని నాలుగు మున్సిపాలిటీల్లో ఎస్డీఎఫ్, గడా నిధులతో చేపట్టిన వెజ్, నాన్వెజ్ మార్కెట్లు, వైకుంఠధామాలు, గ్రంథాలయం, టీఎస్ బీపాస్ ద్వారా భవ న నిర్మాణ అనుమతుల మంజూరు, ఆస్తి పన్ను వసూళ్లు తదితర అంశాలపై మున్సిపల్ కమిషనర్లు, ఇంజినీరింగ్ అధికారులు, కాంట్రాక్టర్లతో సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ అసంఘటిత రంగాల్లో పనిచేస్తున్న 32 శాతం కార్మికులు ‘ఈ-శ్రమ్’ పోర్టల్ పేరు నమోదు చేసుకుని రిజిస్ట్రేషన్ చేసుకోవాలన్నారు. ‘ఈ-శ్రమ్’ ఇచ్చే యూనిక్ నంబర్ ఆధారంగా కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను అసంఘటిత రంగ కార్మికులు లబ్ధి పొందే అవకాశం ఉంటుందన్నారు.
అసంఘటిత కార్మికులను కామన్ సర్వీస్ సెంటర్లో ‘ఈ-శ్రమ్’లో రిజిష్టర్ చేసుకునేలా మున్సిపల్ కమిషనర్లు, ఈడీఎంతో సమన్వయం చేసుకోని వంద శాతం పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని జిల్లా కార్మికశాఖ అధికారికి సూచించారు. జిల్లా కేంద్రం మెదక్లో నిర్మించే ఇంటిగ్రేటెడ్ మార్కెట్ స్థలంలో వెంటనే పనులను ప్రారంభించాలని అధికారులను ఆదేశించారు. వైకుంఠధామాల నిర్మాణాలను ఏప్రిల్ రెండో వారంలోగా పూర్తి చేయాలని, పచ్చదనం ఏర్పాటుకు మున్సిపల్ నిధులు వెచ్చించాలన్నారు. జిల్లా కేంద్రంలోని మున్సిపల్ కాంప్లెక్స్ నిర్మాణ పనులు వచ్చే సెప్టెంబర్ నాటికి పూర్తి చేయాలని సూచించారు. జంతు సంరక్షణ కేంద్ర నిర్మాణ పనులను వేగవంతం చేయాలని ఇంజినీరింగ్ అధికారులను ఆదేశించారు. మున్సిపాలిటీల్లో సీసీరోడ్లు, డ్రైనేజీలు తదితర నిర్మాణాలకు అవసరమైన మెటీరియల్ను సిద్ధ్దంగా ఉంచుకోని షెడ్యూల్ ప్రకారం పనులు పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలన్నారు. నర్సాపూర్ మున్సిపల్లోని వైకుంఠధామాన్ని మార్చి 15లోగా పూర్తి
చేయాలని ఆదేశించారు.
గ్రంథాలయ భవనాన్ని నెలాఖరులోగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. సీసీ రోడ్లు, డ్రైనేజీలు, స్పోర్ట్స్ స్డేడియం, ఎస్సీ కమ్యూనిటీ భవన నిర్మాణ పనులపై సమీక్షించారు. రామాయంపేటలో నిర్మిస్తున్న ఇంటిగ్రేటెడ్ మార్కెట్,వైకుంఠధామం పనులను జూలై నాటికి పూర్తి చేయాలన్నారు. తూఫ్రాన్ మున్సిపాలిటీలోని డంపింగ్ యార్డు నిర్మాణానికి చర్యలు తీసుకోవాలన్నారు. టీఎస్ బీపాస్ మార్గదర్శకాలకు అనుగుణంగా భవన నిర్మాణాలకు నిర్ణీత గడువులోగా అనుమతులు ఇవ్వాలని మున్సిపల్ కమిషనర్లకు సూచించారు. ఆర్థిక సంవత్సరం సమీపిస్తుండటంతో ఆస్తిపన్ను వసూళ్లు వేగవంతం చేసి వంద శాతం లక్ష్యం సాధించాలని సూచించారు. సమావేశంలో మున్సిపల్ కమిషనర్లు జానకీరాంసాగర్, వెంకటగోపాల్, మెహన్, జడ్పీ సీఈవో శైలేశ్, కార్మిక శాఖ అధికారులు, మున్సిపల్ ఇంజినీర్లు పాల్గొన్నారు.
సమావేశం అనంతరం జిల్లాకేంద్రంలోని ఆర్డీవో కార్యాల య సమీపంలో నిర్మించే ఇంటిగ్రేటెడ్ మార్కెట్ స్థలా న్ని ఆదనపు కలెక్టర్ ప్రతిమాసింగ్తో కలిసి పరిశీలించారు. వెంటనే పనులు ప్రారంభించాలని అధికారులకు సూచించారు.