మెదక్ మున్సిపాలిటీ/ చిన్నశంకరంపేట/ రామాయంపేట/ నిజాంపేట, డిసెంబర్ 3 : అర్హులైన యువతీయువకులు ఓటరుగా పేర్లను నమోదు చేసుకోవాలని మెదక్ ఆర్డీవో సాయిరాం సూచించారు. శనివారం జిల్లా కేంద్రంలోని ప్ర భుత్వ డిగ్రీ కళాశాల, ఆవుసులపల్లిలోని పోలింగ్ కేంద్రాలను తహసీల్దార్ నవీన్తో కలిసి ఆర్డీవో సందర్శించారు. పోలింగ్ కేంద్రాల్లోని బూత్ స్థాయి అధికారులతో మాట్లాడి ఓటరు నమోదును పరిశీలించారు. జనవరి 1, 2023 నాటికి 18 ఏండ్లు నిండిన ప్రతి ఒక్కరూ ఫారం -6లో వివరాలు నమో దు చేసి బీఎల్వోలకు అందజేయాలన్నారు. ఓటర్ హెల్ప్లైన్ యాప్ ద్వారా ఆన్లైన్లో పేరు నమోదు చేసుకోవాలన్నారు.
18 ఏండ్లు నిండిన యువత ఓటు హక్కు పొంది, ఓటర్లుగా మారాలని చిన్నశంకరంపేట తహసీల్దార్ రాజేశ్వర్రావు సూచించారు. చిన్నశంకరంపేటలో ఓటర్ నమోదు కేంద్రాన్ని సందర్శించారు. ఓటరు నమోదు దరఖాస్తు ఫారానికి బోనోఫైడ్ సర్టిఫికెట్ జతపర్చాలని తహసీల్దార్ సూచించారు.
ఓటరు జాబితాలో పేరు ఉన్నవారు స్థానికంగా లేకుంటే నోటీసులు ఇచ్చి, పేర్లను తొలిగిస్తామని రామాయంపేట తహసీల్దార్ ఎండీ మన్నన్, మున్సిపల్ కమిషనర్ యాదగిరి పేర్కొన్నారు. రామాయంపేటలో బూత్ లెవల్ ఆఫీసర్లకు సూచనలు, సలహాలిచ్చారు. ఓటర్లు తమ పేర్లతోపాటు చిరునామాలో మార్పులు లేదా చేర్పులు చేసుకోవాలని సూచించారు. రెండు రోజుల పాటు ఓటరు నమోదు ప్రక్రియను కొనసాగిస్తామన్నారు. కార్యక్రమంలో ఆర్ఐ రాజు, మేనేజర్ శ్రీనివాస్, శివరాజు, అంగన్వాడీ టీచర్ పద్మ, బీఎల్వోలు జమున, రాధ, రాణి, మున్సిపల్ సిబ్బంది ప్రసాద్, నరేశ్ ఉన్నారు.నిజాంపేట మండలం బచ్చురాజ్పల్లిలో గ్రామపంచాయతీలో ఓటరు నమోదు నిర్వహించారు. కార్యక్రమంలో వీఆర్ఏలు రంజిత్, కరుణాకర్, గ్రామస్తులు రమేశ్, సత్యం ఉన్నారు. కొల్చారం మండల వ్యాప్తంగా ఓటరు నమోదు చేపట్టారు. పోలింగ్ కేంద్రాల్లో చేపట్టిన ఓటరు నమోదును తహసీల్దార్ చంద్రశేఖర్రావు, ఆర్ఐ శ్రీహరి పర్యవేక్షించారు.